Magha Puranam in Telugu
బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట
పూర్వగాథ
ఓ దిలీపుమహారాజా! మాఘమాసములో స్నానము ఆచరించుట వల్ల కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది విన్నావు కదా! ఒక విప్రకన్య తన భర్తతో విష్ణు సాయుజ్యమును ఎలా పొందినదో వివరిస్తాను సావధానుడవై విను.
సుబుద్ధి అనే బ్రాహ్మణుడు
పూర్వకాలమందు కాశ్మీర దేశమందు గల ఒక గ్రామములో సుబుద్ధి అను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను నాలుగు వేదములు చదివి అర్థ తాత్పర్యసహితముగా వర్ణించగల పండితుడు. బుద్ధియందు పేరుకు తగినట్టుగా పెద్దలను గౌరవించుట, భూతదయ గలిగి, అందరి మన్ననలను పొంది ఉండేవాడు. అంతేకాకుండా, అతడు గొప్ప పండితుడు అవుటచేత అనేకమంది అతనివద్ద శిష్యులైరి.
సుశీల జననం, రూపం
ఆ బ్రాహ్మణునకు సుశీలని పేరు కల బాలిక కలదు. ఆమె ఎంతో రూపవతి, సుగుణాల రాశి, అందాలభరిణ. లేడి కన్నులవలె చక్కటి కన్నులు గలది. నిండు చంద్రుని వంటిముఖము కలది. తుమ్మెద రెక్కలను పోలు నల్లని పొడుగాటి తలవెంట్రుకలు, అందమైన ముఖవర్చస్సుతో, హంస నడకను మరిపించు నడక, కోకిల వంటి కంఠము కల ఆ సుందరాంగి ముక్కు, పండ్లవరుసతో ఉన్న ఆమెను చూసిన వారికి మరల మరల చూడాలన్న కోరిక కలుగుతుంది. సర్వలక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెండ్లి చేయాలా అని తండ్రి సుబుద్ధి ఆలోచన చేస్తూ ఉండేవాడు.
సుమిత్రుడు సుశీల కలయిక
ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి ఇంట జరుగు దైవకార్యమునకు పూజాద్రవ్యములను తెచ్చుటకై అడవికి బయలుదేరి వెళుతుండగా- దారిలోనున్న ఉద్యానవనములో సుశీల తన స్నేహితురాండ్రతో బంతులాట ఆడుకొనుచుండెను. ఆటలో బయటకుపడిన బంతి తెచ్చుటకు తోట వెలుపలకు వచ్చిన సుశీల సుమిత్రుని చూసింది.
సుమిత్రుడు కూడా యుక్తవయస్సులో ఉన్నాడు. చక్కటి అవయవ సౌష్టవముతో విశాలమైన వక్షము కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు. అతని అందమును చూడగానే సుశీల నివ్వెరపోయింది. అతనిని తదేక దృష్టితో చూచి అతని వెంటబడింది. సుమిత్రుడు తన పని కొరకు చాలా దూరము వెళ్ళాడు. అనంతరం, కొంత దూరము వెళ్ళేసరికి ఒక కోనేరు కనిపించింది. ఆ కోనేరు నిండా తామరపువ్వులు విరబూసి ఉన్నాయి. తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును త్రాగుతూ మత్తెక్కి ఎగురుతున్నాయి. అక్కడ ఉన్న వివిధ ఫల వృక్షములు పువ్వులతోను, పండ్లతోను నిండివున్నాయి. కోయిలలు తమ మధుర కంఠములను విప్పి కూస్తున్నాయి. మగనెమళ్ళు ఆడనెమళ్ళకు తమ అందాన్ని చూపించుటకు తమ తమ పింఛములను విప్పి నాట్యమాడుచున్నవి. నీటి జంతువులు తామర తూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకెగిరిపడుతూ నీటిలో ఈదుతున్నాయి. సుమిత్రుడు దూరంనుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు త్రాగి చెట్లనీడలో విశ్రమించాడు. వెనుకనుండి వచ్చిన సుశీల అచటి ప్రకృతి రమణీయతను చూచి మల్లె, జాజి, సంపెంగ పూవ్వుల వాసనలకు మన్మధ చేష్టలతో మత్తెక్కినదై చెట్లక్రింద విశ్రమించి ఉన్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలపడినది. సుమిత్రుని సౌందర్యమును చూచి చలించిపోయి తానే సుమిత్రుని పలకరించింది.
సుశీల కోరికను తిరస్కరించిన సుమిత్రుడు
“ఓ అందగాడా! సుమిత్రా! నిన్ను చూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనములో లేదు. అందుకే నీ వెనుక ఇంతదూరం వచ్చాను. ఈ ఏకాంత ప్రదేశమున నన్ను కౌగిలించుకొని నాతో కూడుము. నీ వయసు, నా వయసు సరిసమానము. ఇద్దరమూ ఏరికూర్చిన జంటవలె ఉన్నాము. చిలకా గోరింకల వలె, రతీ మన్మధులవలె లీనమై పోదాము. ఆ చెట్టుపై ఉన్న గువ్వలజంటలను చూడు. మధువును త్రాగి మత్తెక్కిన ఆ తుమ్మెదల జంటల చూడు ఎలా ఉన్నాయో ! కాన రమ్ము నా యవ్వన బింకాన్ని ఆఘ్రాణించుము. సమయమును జారవిడువకుము. నా సుకుమార లేత శరీరమును సున్నితములగు అవయవములను నీకు అర్పింతును. నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కౌగలించుకో” అని అనేక విధముల ఆ విప్రకుమారుని తొందర పెట్టసాగింది.
సుమిత్రుడు నిశ్చేష్టుడై నోటమాట రాక శిలావిగ్రహము వలె ఉండిపోయాడు. అయితే, కొంతసేపైన తరువాత బాలా! నీమాటలు చూడ పిచ్చిదాని వలె ఉన్నావు. నీకేదైనా గ్రహము ఆవరించినదా? అని సందేహము కలుగుతున్నది. అదియుగాక నీవు నా గురువు కుమార్తెవు. నేను నీకు అన్నవుతాను. నీవు నాకు చెల్లివంటి దానవు. నీ మనసును నీవు స్వాధీనము చేసుకోలేని స్థితిలో ఉన్నావు. నీవెంతటి అందగత్తెవయినా హద్దుమీరి ప్రవర్తించుట భారతనారికి తగదు. అదిగాక నీవు విద్యావతివి, పుణ్యవతివి. నీ ప్రయత్నమును మాను. నీకు కష్టములు ఎదురు అవుతాయి. వావి వరస లేక మన్మధాగ్నికి బలియై మనమిద్దరము సంభోగించిన ఆ మహాపాతకము సూర్య చంద్రాదులు ఉన్నంతవరకు ఎన్ని జన్మలెత్తినా, ఏయే జన్మలెత్తినా మనలను వెంటాడుతూనే ఉంటుంది. ఆ నరకబాధలనుండి మనము ఎన్నటికిని విముక్తి పొందలేము. నీకోరికను అంగీకరించను. ఇప్పటికే చాలా ఆలస్యమైనది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినట్టు గురువర్యులకు తెలిసిన నిన్ను దండింతురు. ఫలములు, కుశలు, పుష్పములు మొదలగు పూజాద్రవ్యములను తీసుకుని వెళ్ళిపోదామ” ని సుమిత్రుడు అనేక విధముల బోధించాడు.
సుమిత్రునితో సుశీల శారీరక సంబంధం
ఆ కన్య బంగారం, రత్నము, విద్య, అమృతము తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించు వాడు మూర్ఖుడు గాని వివేకవంతుడు గాదు. నానిండు యవ్వనాన్ని, నా శరీరాన్ని సమస్తమును నీకర్పింతునన్న నిరాకరిస్తున్నావు గదా! సరే నేను ఒంటరిగా గృహమునకు వెళ్ళను. నేను ఇక్కడే ప్రాణత్యాగము చేస్తాను. నీవలన ఒక కన్య చనిపోయిందని నలుగురూ నిన్ను ఆడిపోసుకొంటారు. నన్ను ఒంటరిగా ఈ కారడవిలో వదలి ఇల్లు చేరిన యెడల నా తండ్రి నిన్ను విడచి పెడతాడా? నా కుమార్తె ఏదని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికత్తెలు నీతో అడవికి వెళ్ళానని చెప్పే ఉంటారు. నేను కామబాధ భరించలేకుండా ఉన్నాను. నాతో సంభోగించి నన్ను నీదానను చేసుకో ” అని పలికింది.
సుమిత్రుడు ఆమె దీనాలాపములు ఆలకించి సంకట స్థితిలో పడ్డాడు. కొంత తడవు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతీక్రీడల తేలుటకై నిశ్చయించుకొన్నాడు.