Ramayanam Story in Telugu – రామాయణం 62

సీతమ్మ వద్ద సెలవు మరియు సంకల్పం

Ramayanam Story in Telugu- హనుమంతుడు సీతమ్మ దగ్గర సెలవు తీసుకుని ఉత్తర దిక్కుకు వచ్చాడు. అప్పటికే లంకా పట్టణానికి రావడం, సీతమ్మ తల్లిని దర్శించడం పూర్తయ్యాయి. రావణుడికి ఒక మాట చెబితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని ఆలోచించాడు. అయితే, దర్శనం ఇవ్వమని అడిగితే వాడు ఇవ్వడని నిశ్చయించుకున్నాడు. అందుకని, రావణుడికి అత్యంత ప్రియమైన ప్రమదా వనాన్ని (అశోక వనం) నాశనం చేస్తే వాడే తనను పిలుస్తాడని భావించాడు.👉 బక్తి వాహిని – శ్రీరామ రామాయణం

అశోక వన విధ్వంసం

భీమరూపుడైన హనుమంతుడు అశోక వనం మీద ఎగిరాడు. ఆయన తొడల వేగానికి అక్కడున్న చెట్లు విరిగిపోయాయి. హనుమంతుడు చేసిన మహా నాదానికి అక్కడున్న పక్షులు గుండెలు బద్దలై కిందపడిపోయాయి. అంతేకాకుండా, ఆయన అక్కడున్న సరోవరంలోని నీటిని బయటకు తోసేశాడు.

విధ్వంసం వివరాలువివరణ
చెట్ల వినాశనంతొడల వేగానికి చెట్లు విరిగిపోయాయి
పక్షుల మరణంగట్టిగా కేకలతో పక్షుల గుండెలు పగిలాయి
నీటిపై ప్రభావంసరోవరాల నీళ్లు బయటకి తోసేశాడు

రాక్షసుల కలకలం మరియు సీతమ్మను ప్రశ్నించడం

హనుమంతుడు చేస్తున్న విధ్వంసానికి అక్కడున్న రాక్షసులు ఉలిక్కిపడి లేచారు. రాక్షస స్త్రీలు సీతమ్మ దగ్గరికి వచ్చి, “ఈ కోతి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ చెట్టు మీద కూర్చుని ఉండడం చూశాము. ఆ కోతి నీ దగ్గరికి వచ్చి కిచకిచలాడినట్టు మాకు అనుమానం, ఆ కోతి ఎవరు?” అని అడిగారు.

సీతమ్మ సమాధానం

అప్పుడు సీతమ్మ వారితో, “పాము కాళ్ళు పాముకే తెలియాలి. ఆయన రాక్షసుడో, వేరొకడో తెలుసుకునే శక్తి నాకెక్కడ ఉంది. ఆయనెవరో మీకే తెలియాలి, నాకు తెలియదు” అని చెప్పింది. ఆ రాక్షస స్త్రీలు వెంటనే పరుగు పరుగున రావణుడి దగ్గరికి వెళ్ళి, “ఎక్కడనుంచి వచ్చిందో కాని ఒక మహా వానరం వచ్చింది. అది ఇంద్రుడి దూతో, కుబేరుడి దూతో, విష్ణువు దూతో, యముడి దూతో మాకు తెలియదు. అది అశోక వనం అంతటినీ నాశనం చేసింది, కాని సీత కూర్చున్న శింశుపా వృక్షాన్ని మాత్రం వదిలిపెట్టేసింది.

అలసట చేత వదిలిపెట్టిందో, కావాలని వదిలిపెట్టిందో తెలియదు. అలసట అని అనుకోడానికి వీలులేదు, ఎందుకంటే ఇంత అశోక వనాన్ని నాశనం చేసిన వానరానికి శింశుపా వృక్షాన్ని నాశనం చేయడం పెద్ద లెక్క కాదు, అది కావాలనే వదిలిపెట్టింది. నువ్వు ఏ కాంత మీదైతే నీ మనస్సుని, కామాన్ని ఉంచావో, ఆ సీతతో ఈ వానరం మాట్లాడింది” అని చెప్పారు.

రావణుడి ఆగ్రహం మరియు సైన్యాన్ని పంపడం

అప్పుడు రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే 80,000 మంది రాక్షస కింకరులను పిలిచి, “మీరందరూ వెళ్ళి ఆ మహా వానరాన్ని పట్టి బంధించండి, లేకపోతే సంహరించండి” అని ఆజ్ఞాపించి పంపించాడు. ఆ సమయంలో హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చుని జయ మంత్ర శ్లోకాలను చెప్పాడు.

హనుమంతుడు తన మాటలను ఇలా కొనసాగించాడు:

“రాముడు, లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతున్నాడు. అటువంటి రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ, నేను యుద్ధంలో వేరుగా ఆయుధములు వాడను, ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తోక్కేస్తాను, నా పిడి గుద్దులతో చంపేస్తాను, పెద్ద పెద్ద చెట్లతో, రాళ్ళతో కొడతాను. వెయ్యిమంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణంలో లేడు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగే మొగాడు ఈ లంకా పట్టణంలో లేడు.”

కింకరుల సంహారం

అప్పుడు ఆ 80,000 కింకరుల మూక హనుమంతుడి మీదకి రకరకాల ఆయుధాలను వేశారు. చండ ప్రచండుడైన హనుమంతుడు ఆ తోరణానికి ఉన్న ఇనుప పరిఘను ఒకదాన్ని పీకి వాళ్ళందరినీ దానితో కొట్టాడు. కళ్ళు మూసి తెరిచేలోగా అక్కడ ఆ రాక్షసుల మాంసపు ముద్దలు, రక్తపు మరకలతో ఆ ప్రాంతం నిండిపోయింది. మళ్ళీ ఆయన తోరణం ఎక్కి కూర్చున్నాడు.

ప్రాసాద విధ్వంసం మరియు రాక్షస సంహారం

అప్పుడాయనకు దూరంగా వెయ్యి స్తంభాలతోటి ఒక ప్రాసాదం కనపడింది. వెంటనే ఆయన ఆ ప్రాసాదం మీదకి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదం చేశాడు. ఆ నాదం వినేసరికి లంకా పట్టణంలో కొన్ని వేలమంది గుండెలు బద్దలయ్యి, చెవుల వెంట, ముక్కుల వెంట నెత్తురు కారి చనిపోయారు. అప్పుడాయన తొడలు కొట్టాడు, ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారు. తరువాత ఆ ప్రాసాదానికి మధ్యలో ఉన్న బంగారు స్తంభాన్ని పీకి గాలిలో గిరగిర తిప్పితే, ఆ వేగానికి అందులోనుంచి అగ్ని పుట్టి ఆ ప్రాసాదం అంతా కాలిపోయింది. ఆ ప్రాసాదానికి కాపలా ఉన్న 100 మంది రాక్షసులను కూడా కొట్టి చంపేశాడు.

హనుమంతుని హెచ్చరిక

అప్పుడాయన రాక్షసులతో ఇలా అన్నాడు: “మా వానరములలో 10 ఏనుగుల బలం కలిగినవారు, 100 ఏనుగుల బలం కలిగినవారు, 1000 ఏనుగుల బలం కలిగినవారు, 10,000 ఏనుగుల బలం కలిగినవారు, అంతకన్నా ఎక్కువ బలం కలిగినవారు ఉన్నారు. భూమికి అడ్డంగా ఎగరగలిగేవాళ్ళు, నిలువుగా ఎగరగలిగేవాళ్ళు ఈ భూమండలం అంతటా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు, వాళ్ళెవరూ మిమ్మల్ని విడిచిపెట్టరు. సుగ్రీవుడే బయలుదేరి లంకలో అడుగుపెట్టిననాడు, ఈ లంక లేదు, మీరు లేరు, ఆ రావణుడు లేడు. ధర్మాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మడిసిపోతారు.” అని చెప్పి మళ్ళీ తోరణం మీదకి వచ్చి జయ మంత్రం చెప్పాడు.

జంబుమాలి వధ

80,000 మంది చనిపోయారన్న విషయం తెలుసుకున్న రావణుడు ప్రహస్తుడి కుమారుడైన జంబుమాలిని పంపాడు. గాడిదలు పూన్చిన రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు హనుమంతుడు ఆ జంబుమాలి మీదకి ఒక పెద్ద రాయిని విసిరాడు. బాణములతో జంబుమాలి ఆ రాయిని కొట్టి ముక్కలు చేశాడు. తరువాత హనుమంతుడు ఒక సాల వృక్షాన్ని పీకి విసిరాడు, కాని ఆ చెట్టు మీద పడకముందే దానిని జంబుమాలి ఖండ ఖండములుగా కొట్టాడు. తరువాత ఆ జంబుమాలి హనుమంతుడి నుదుటి మీద, వక్షస్థలం మీద బాణములతో కొట్టాడు, ఆ దెబ్బలకి ఆయన శరీరం నుండి రక్తం కారింది.

హనుమంతుడు మళ్ళీ ఒక పరిఘను పీకి, గిరగిర తిప్పుతూ పిడుగు వచ్చి పడినట్టు ఆకాశంలోకి ఎగిరి వాడిమీద పడి ఆ పరిఘతో కొట్టాడు. ఆ దెబ్బకి జంబుమాలి రథం, శిరస్సు, చేతులు, గాడిదలు మొదలైనవి ఏమీ కనపడలేదు. మళ్ళీ ఆయన తోరణం ఎక్కి జయ మంత్రం చెప్పడం ప్రారంభించాడు. అక్కడున్న రాక్షసులందరినీ కాళ్ళ కింద పెట్టి తొక్కేశాడు, మోకాళ్ళతో కుమ్మేశాడు, చేతులతో గుద్దేసి అక్కడున్న రాక్షసులందరినీ సంహరించాడు.

దశఘటన
జంబుమాలి రాకగాడిదలు పూన్చిన రథంపై హనుముని మీదకు వచ్చాడు
బాణప్రహారాలుహనుమంతునిపై బాణాలు వదిలాడు
హనుముని ప్రతీకారంపిడుగు వేయబడినట్టు పరిఘతో అతడిని ఛేదించాడు

మంత్రుల కుమారుల మరణం

“జంబుమాలి, జంబుమాలి వెనక వెళ్ళిన సైన్యము అంతా మరణించారు” అని రావణుడికి కబురు వెళ్ళింది. అప్పుడు రావణుడు తన 7 మంత్రుల కొడుకులను హనుమ పైకి యుద్ధానికి పంపించాడు. వాళ్ళు అన్ని వైపుల నుండి హనుమ మీదకి బాణ ప్రయోగం చేశారు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా పెంచేసి ఆకాశంలోకి ఎగిరి ఒక్కసారి కింద పడిపోయాడు. ఆయన కింద పడిపోవడంతో చాలామంది చనిపోయారు, మిగిలినవారి గుండెల్ని తన గోళ్ళతో గిల్లేసి చంపేశాడు. కొంతమందిని పళ్ళతో కొరికి చంపేశాడు. అప్పుడు ఆ ప్రాంతం తెగిపోయిన తలలతో, చచ్చిపోయిన ఏనుగులతో, పచ్చడైపోయిన శరీరాలతో, విరిగిపోయిన రథాలతో భయానకంగా ఉంది.

సేనాధిపతుల ఓటమి

వెళ్ళిన మంత్రుల సుతులు చనిపోయారన్న వార్త రావణుడికి చేరింది. అప్పుడాయన 5 సేనాగ్ర నాయకులను పిలిచి, “మీరు ఆ వానరాన్ని జాగ్రత్తగా పట్టండి, అది సామాన్యమైన వానరం కాదు. నేను ఎందరో మహర్షులను బాధ పెట్టాను, వాళ్ళందరూ తమ తపోశక్తులను ధారపోసి సృష్టించిన మహా భూతం అయ్యి ఉంటుంది” అన్నాడు.

విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘస, భాసకర్ణ అనే 5 సేనా నాయకులు వెళ్ళి హనుమంతుడితో యుద్ధం మొదలుపెట్టారు. వాళ్ళల్లో దుర్ధరుడు వేసిన మూడు ఇనుప బాణములు హనుమంతుడి తలలో తగిలాయి. ఆగ్రహించిన హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి తన శరీరాన్ని పెంచాడు. ఆకాశంలోకి హనుమంతుడు ఎగిరాడని ఆ సేనా నాయకులు అలా చూశారు అంతే, ఆయన గబుక్కున ఆ దుర్ధరుడి రథం మీద పడిపోయాడు.

హనుమంతుడి శరీరం కింద దుర్ధరుడు, ఆయన రథం అన్నీ పచ్చడైపోయి ఉన్నాయి. మిగిలిన వారిలో ఇద్దరు ఆయన వైపు పరుగులు తీశారు, అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద చెట్టును పెకలించి దానితో ఆ ఇద్దరినీ కొట్టాడు. ఆ దెబ్బకి ఆ ఇద్దరూ మరణించారు. తరువాత మిగిలిన ఇద్దరినీ సంహరించాడు.

అక్ష కుమారుడి మరణం

ఈ వార్త విన్న రావణుడు సభలో అటూ ఇటూ తేరిపారి చూసి తన చిన్న కుమారుడైన అక్ష కుమారుడి మీద ఆయన చూపులు ఆగింది. తండ్రి తన వంక చూడగానే ఆ అక్ష కుమారుడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలా పైకి లేచి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు.

ఆ పిల్లవాడిని చూడగానే ‘ఈ పిల్లవాడు ఎంత బావున్నాడు రా, చిన్నవాడే కాని చూస్తుంటే అగ్నిహోత్రంలా ఉన్నాడు. కాసేపు వీడిని యుద్ధం చెయ్యనిద్దాము’ అని హనుమంతుడు అనుకున్నాడు. అక్ష కుమారుడు వేసిన బాణ పరంపర నుండి హనుమంతుడు సూక్ష్మ రూపంలో దొరకకుండా తిరుగుతున్నాడు.

అక్ష కుమారుడు హనుమంతుడి శరీరంలో ఖాళీ లేకుండా బాణాలతో కొట్టేశాడు. అప్పుడు హనుమంతుడు ‘దేవతలు కూడా వీడి యుద్ధాన్ని చూసి సంతోషిస్తారు, కాని ఇంట్లో అగ్ని ఉందని చూస్తూ ఊరుకుంటే ఇల్లు అంటుకుంటుంది. ఇక వీడిని చంపవలసిందే’ అనుకొని, ఆకాశంలోకి ఎగిరి శరీరాన్ని పెద్దగా చేసి కింద పడ్డాడు.

అప్పుడు గుర్రాలు, రథం, సారథి చనిపోయారు కాని అక్ష కుమారుడు మాత్రం ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయి, ఆకాశం నుండి యుద్ధం చేశాడు. అప్పుడు హనుమంతుడు గాలిలోకి ఎగిరి ఆ అక్ష కుమారుడి పాదాలను పట్టుకొని వేగంగా కిందకి లాగి నేలకేసి బాదాడు.

ఆ దెబ్బకి అక్ష కుమారుడి కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయాయి, తలకాయి వెయ్యి ముక్కలయ్యింది, కడుపు బద్దలయిపోయి పేగులు బయటకి వచ్చాయి.

ఇంద్రజిత్తు రాక మరియు బ్రహ్మాస్త్రం

తన చిన్న కుమారుడు మరణించాడన్న వార్త విన్న రావణుడికి జీవితంలో మొదటిసారి బాధ అంటే ఏమిటో, భయం అంటే ఏమిటో తెలిసొచ్చింది. అప్పుడాయనకు ఎవరిని పంపాలో అర్థం కాక ఇంద్రజిత్తు వంక చూసి, “నిన్ను పంపకూడదు, కాని ఇవ్వాళ నిన్ను పంపక తప్పడం లేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళు, లంకా పట్టణం భద్రత అంతా నీ చేతులలో ఉంది.

ఒకసారి అస్త్రాలన్నిటినీ మననం చేసుకుంటూ వెళ్ళు. ఎలాగైనా సరే ఆ వానర వీరుడి వేగం తగ్గించి పట్టుకో, అవకాశం దొరికితే వాడిని సంహరించు” అని చెప్పి పంపాడు. ఇంద్రజిత్తు రావణుడికి ప్రదక్షిణ చేసి బయలుదేరాడు.

ఇంద్రజిత్తు, హనుమంతుడు ఒకరికి ఒకరు దొరకకుండా యుద్ధం చేసుకుంటున్నారు. ఈ వానరం యొక్క వేగాన్ని ముందు తగ్గించాలి అనుకొని ఇంద్రజిత్తు హనుమ మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.

ఆ సమయంలో హనుమంతుడికి పూర్వం బ్రహ్మగారు ఇచ్చిన వరం (ఏ అస్త్రము నిన్ను ఏమీ చెయ్యలేదు) జ్ఞాపకం వచ్చి ‘ఇది బ్రహ్మాస్త్రం, బ్రహ్మగారి పేరు మీద ఉన్న అస్త్రం, నేను దీనిని గౌరవించాలి. నేను ఆయనను తలుచుకొని నమస్కరించగానే ఇది నన్ను వదిలేస్తుంది.

కాని నేను దీనికి కొంతసేపు కట్టుబడి ఉంటాను’ అనుకున్నాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం వలన హనుమంతుడు నేల మీద పడిపోయాడు.

హనుమంతుని బంధనం

ఈలోగా అక్కడున్న రాక్షసులు పరిగెత్తుకుంటూ వచ్చి కనపడ్డ గుడ్డ ముక్కలతో హనుమంతుడి కాళ్ళు, చేతులు కట్టేసి, కర్రలతో కొట్టారు. అప్పుడు హనుమంతుడు ‘ఇలా ఈ రాక్షసులను ఎంతసేపు చంపుతాను, ఒకసారి రావణుడిని చూస్తాను’ అనుకొని అలా ఉండిపోయాడు.

కాని ఇంద్రజిత్తు అనుకున్నాడు ‘ఈ రాక్షసులు బుద్ధిహీనులు. బ్రహ్మాస్త్రంతో నేను కడితే వీళ్ళు వెళ్ళి తాడులతో కట్టారు. బ్రహ్మాస్త్రం చేత నిర్భంధింపబడ్డ వ్యక్తిని వేరొకదానితో కడితే ఆ బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది. ఒకసారి బ్రహ్మాస్త్రం వెయ్యబడ్డ వ్యక్తి మీద ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం మళ్ళీ సూర్యోదయం అయ్యేవరకు పనిచెయ్యదు.

ఇప్పుడీయన తలచుకుంటే ఏమైనా చెయ్యగలడు. కాని ఆ వానరానికి అస్త్రం వదిలేసిందన్న విషయం తెలియలేదు, వీళ్ళు కట్టేయడం వలన ఇంకా ఆ బ్రహ్మాస్త్రమే పట్టుకుని ఉందనుకుంటున్నాడు’ అని అనుకొని సంతోషపడ్డాడు.

వాళ్ళు హనుమంతుడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి రావణుడి దగ్గర నిలబెట్టారు.

రావణుడితో సంభాషణ

ఒక నల్లని మబ్బును గానీ, ఒక కాటుక కొండను గానీ తీసుకొచ్చి సింహాసనం మీద పెడితే ఎలా ఉంటుందో, రావణుడు అలా రత్న, వజ్ర, స్ఫటికాలతో తాపడం చేయబడిన ఒక పెద్ద ఉత్తమమైన వేదికపై కూర్చుని ఉన్నాడు.

వానరమైన హనుమంతుడితో మాట్లాడడానికి సిగ్గుపడి, తన మంత్రి అయిన ప్రహస్తుడి వంక చూసి ఇలా అన్నాడు: “ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఎవరి వాడు? నాకు ఇష్టమైన అశోక వనాన్ని ఎందుకు నాశనం చేశాడు? సీతతో ఎందుకు మాట్లాడాడు? ఏమి మాట్లాడాడు? ఈ విషయాలు మీరు ఆ వానరాన్ని అడిగి తెలుసుకోండి. నిజం చెబితే వాడి ప్రాణాలు ఉంటాయి, అబద్ధం చెబితే ప్రాణాలు పోతాయి.”

అప్పుడు ప్రహస్తుడు లేచి, “నువ్వేమీ భయపడకు. మా ప్రభువు ధర్మాత్ముడు. నిజం చెప్పు, నిన్ను పంపించేస్తాము. నిన్ను అగ్ని పంపించాడా? యముడు పంపించాడా? కుబేరుడు పంపించాడా? విష్ణువు పంపించాడా? ఎవరి ప్రేరణతో నువ్వు ఈ లంకా పట్టణానికి వచ్చావు? ఎందుకు అశోక వనాన్ని నాశనం చేశావు?” అని ప్రశ్నించాడు.

అప్పుడు హనుమంతుడు రావణుడి వంక చూసి ఇలా అనుకున్నాడు: “ఏమి కాంతి, ఏమి తేజస్సు, ఏమి పరాక్రమం! నిజంగా వీడి దగ్గరే కానీ మహా పతివ్రత అయిన స్త్రీని అపహరించి తెచ్చిన పాపం లేకపోతే వీడు మూడు లోకాలను శాసించగలిగినవాడు కదా!”

హనుమంతుడిని చూసిన రావణుడు భయపడి ఇలా అనుకున్నాడు: “ఇది ఒక వానరుడికి ఉండవలసిన తేజస్సు కాదు. ఇంతకుముందు నేను జాంబవంతుడిని, వాలిని, సుగ్రీవుడిని, సుషేణుడిని, నీలుడిని చూశాను, కానీ వాళ్ళెవరికీ ఇంత పరాక్రమము, సామర్థ్యం లేవు. బహుశా ఆనాడు నేను కైలాస పర్వతాలను కదిలిస్తున్నప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు, ‘వానరులు నా కొంప ముంచుతారని’. బహుశా నందీశ్వరుడే వచ్చాడేమో!”

హనుమంతుని సమాధానం

అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడు: “నేను రామ దూతగా ఇక్కడికి వచ్చాను. నా నిజమైన రూపం వానర రూపమే. నన్ను హనుమ అంటారు, సుగ్రీవుడి సచివుడిని. కిష్కింధ రాజ్యాన్ని పరిపాలించే వాలి నీకు తెలుసు కదా, ఆ వాలిని ఒక బాణంతో రాముడు చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు.

నీకు వాలికి ఉన్న స్నేహబంధం వల్ల సుగ్రీవుడు నీకు సోదరుడి వరుస అవుతాడు. ఆ సుగ్రీవుడు నీ క్షేమ సమాచారాలు అడిగాడని చెప్పమన్నాడు. నేను రాక్షసుడిని కాదు, రాముడిలా నరుడిని కాదు. నేను తటస్థమైన వాడిని, వానరుడిని. అందుకని నీ మంచి కోరి నాలుగు మంచి మాటలు చెబుతాను, వింటే బాగుపడతావు, లేకపోతే నాశనమైపోతావు.

నిన్ను చూడడానికి వేరొక ఉపాయం లేదు, అందుకని దండోపాయంతో అశోక వనాన్ని నాశనం చేశాను. అప్పుడు నీ వాళ్ళు నా మీదకి యుద్ధానికి వచ్చారు, శరీరాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో నాలుగు గుద్దులు గుద్దాను, వాళ్ళు చనిపోయారు.

పూర్వకాలంలో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన నలుగురు కుమారులలో పెద్దవాడైన రాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి లక్ష్మణుడు, సీతమ్మతో కలిసి దండకారణ్యానికి వచ్చాడు. రాముడి భార్య అయిన సీతమ్మను నువ్వు అపహరించి తీసుకొచ్చి లంకలో పెట్టావు. సీతమ్మ ఎవరో నాకు తెలియదు, నేను చూడలేదు అని అబద్ధాలు చెప్పమాకు. నేను సీతమ్మను అశోకవనంలో చూశాను, నువ్వే సీతమ్మను అపహరించి తెచ్చావు. సీతమ్మ అయిదు తలల పాము వంటిది, నీ మృత్యువును నువ్వు తెచ్చుకున్నావు.

రాముడి తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. నిన్ను చంపడానికి రాముడి దాకా ఎందుకు, సుగ్రీవుడు నిన్ను చంపేస్తాడు. రాముడికి సుగ్రీవుడికి అగ్ని సాక్షిగా స్నేహం ఉంది, కనుక రాముడి శత్రువు సుగ్రీవుడికి శత్రువే. నువ్వు ఆనాడు ‘నర వానరములతో తప్ప’ అని బ్రహ్మగారిని వరం అడిగావు కదా, సుగ్రీవుడు గంధర్వుడు కాదు, కిన్నెరుడు కాదు, యక్షుడు కాదు, దేవత కాదు, రాక్షసుడు కాదు, ఆయన కేవలం వానరుడు. మనం చేసిన పుణ్యపాపాలకు సంబంధించిన ఫలితాలను పరమాత్మ ఒకేసారి ఇస్తాడు. నువ్వు చేసిన పుణ్యాలకు కాంచన లంకను పొందవు, వేల మంది కాంతలతో సుఖాలను అనుభవించావు, ఇంతమంది రాక్షసులకు ప్రభువుగా నిలబడ్డావు. కానీ నువ్వు ఇవ్వాళ పరాయి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు, ఆ పాపం వల్ల నువ్వు శరీరాన్ని వదిలిపెట్టబోతున్నావు.

రాముడికి ధనుర్వేదంలో సమస్త అస్త్ర శస్త్రములు తెలుసు, ఋషుల దగ్గర శిక్షణ పొందినవాడు, మహా ధర్మాత్ముడు. అటువంటి రాముడు లంకలో నిలబడి కోదండాన్ని పట్టుకొని బాణాలు విడిచిపెడితే నువ్వు నిలబడలేవు. ఆ సమయంలో నీలాంటి రావణులు లక్ష మంది వచ్చినా రాముడి ముందు నిలబడలేరు.

ఒకనాడు నువ్వు కైలాస పర్వతాన్ని ఎత్తబోతుంటే, శివుడు తన కాలి బొటన వేలితో ఆ పర్వతాన్ని తొక్కగా నీ 20 చేతులు ఆ పర్వతం కింద ఉండిపోయాయి. అటువంటి శివుడి ధనుస్సును రాముడు తేలికగా విరిచేశాడు. నిన్ను ముప్పతిప్పలు పెట్టిన వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టేశాడు. ఈ ప్రపంచంలో ఉన్న క్షత్రియులందరినీ ఓడించిన పరశురాముడికి గర్వభంగం చేశాడు.

14,000 మంది రాక్షసులను జనస్థానంలో రాముడొక్కడే సంహరించాడు. అటువంటి రాముడు వస్తే నువ్వు బతకగలవా? అయినా నిన్ను చంపడానికి రాముడు ఎందుకు, నేను చాలు. మర్యాదగా సీతమ్మను రాముడికి అప్పగిస్తే బతికిపోతావు, లేదా చచ్చిపోతావు” అని అన్నాడు.

రావణుడి ఆగ్రహం మరియు విభీషణుడి హితవు

ఒక నిండు సభలో హనుమంతుడు తనను ఇంతలా నిందించి మాట్లాడేసరికి రావణుడికి ఆగ్రహం వచ్చి, “ఈ వానరాన్ని చంపేయండి” అని ఆజ్ఞాపించాడు.

అప్పుడు విభీషణుడు లేచి, “అన్నయ్య! నువ్వు వేదాలు చదువుకున్నావు, ధర్మాలు చదువుకున్నావు. ఇలా దూతను చంపమని నువ్వు అనడం సరికాదు. దూతకు వేయబడే శిక్షలు కొన్ని ఉన్నాయి, అవి తల గొరిగించడం, అవయవాన్ని తీసేయడం, వాత పెట్టడం. అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతలి వారికి ఎలా తెలుస్తుంది? అందుకని వచ్చిన దూతను చంపవద్దు” అని అన్నాడు.

తోకకు నిప్పు పెట్టమని రావణుడి ఆజ్ఞ

విభీషణుడి మాటలు విన్న రావణుడు, “వానరాలకు తమ తోక అంటే చాలా ఇష్టం. అందుకని వీడి తోకకు నిప్పు పెట్టండి. కాలిపోయిన తోకతో ఈ వానరం తనను పంపిన వారి దగ్గరికి వెళుతుంది, అప్పుడు ఈ వానరం యొక్క మిత్రులు, బంధువులు చుట్టూ చేరి ‘తోకలేని కోతి, తోకలేని కోతి’ అని ఏడిపిస్తారు” అని అన్నాడు.

హనుమంతుని తోకకు నిప్పు మరియు లంక వీధుల్లో ఊరేగింపు

అప్పుడు వాళ్ళు పాత బట్టలు పట్టుకొచ్చి హనుమంతుడి తోకకు చుట్టి, నెయ్యి పోసి మంట వెలిగించారు. హనుమంతుడిని కట్టేసి, రథం ఎక్కించి నాలుగు కూడళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి కర్రలతో కొడుతూ ‘గూఢచారి, గూఢచారి’ అని ప్రకటించారు. ఆ లంకా పట్టణంలో మేడల మీద, మిద్దెల మీద అందరూ నిలబడి చూస్తున్నారు.

అప్పుడు హనుమంతుడు ఇలా అనుకున్నాడు: “వీళ్ళు నన్ను కొడితే కొట్టారులే కానీ, రాత్రి వేళల్లో ఈ లంకా పట్టణాన్ని అన్వేషించాను. ఒకసారి పగటిపూట ఈ రావణుడి బలం ఏమిటో, లంక యొక్క గొప్పతనం ఏమిటో చూసి సుగ్రీవుడికి చెబుతాను.” వాళ్ళు హనుమంతుడిని ఆ లంకా పట్టణం అంతా తిప్పాక ఆయన ఒక్కసారి కట్లను విడిపించుకొని ఎగిరి రాజద్వారం మీదకి దూకి తన చేతితో మండుతున్న తోకను పట్టుకున్నాడు.

సీతమ్మ ప్రార్థన మరియు అగ్ని చల్లారడం

అప్పుడు కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళి, “నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి తోకకు రావణుడు నిప్పు పెట్టించాడు” అన్నారు.

సీతమ్మ వెంటనే అగ్నిదేవుడికి ప్రార్థన చేస్తూ ఇలా అంది: “నేను సర్వకాలములయందు రాముడికే సేవ చేసిన దాననైతే, రాముడినే మనస్సులో పెట్టుకున్న దాననైతే, నాకు భాగ్య విశేషం మిగిలి ఉంటే, రాముడికి నా మీద ప్రేమ ఉంటే, సుగ్రీవుడు నన్ను తీసుకెళ్ళి రాముడితో కలపడం నిజమైతే, హనుమ యొక్క తోకకు నిక్షేపింపబడిన అగ్ని చల్లబడుగాక!”

వెంటనే హనుమంతుడి తోకకు ఉన్న అగ్ని వెన్నముద్దలా చల్లగా అయిపోయింది.

హనుమంతుని సంకల్పం మరియు లంకా దహనం

అప్పుడాయన అనుకున్నాడు: “అవునులే, నేను వస్తుంటే మైనాకుడు నాకు ఆతిథ్యం ఇచ్చాడు, సముద్రుడు నమస్కారం చేశాడు. రాముడి పేరు, సీతమ్మ పేరు చెబితే ప్రకృతిలో ఉపకరించనిది ఏముంటుంది? నా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు, అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు.” అని అనుకుని, “ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిదేవుడికి తర్పణం చేసి వెళ్ళిపోతాను” అని నిశ్చయించుకున్నాడు.

మొదట ప్రహస్తుడి ఇంట్లో నిప్పు పెట్టాడు. అలా అన్ని ఇళ్ళ మీదికి దూకుతూ నిప్పు పెడుతూ వెళ్ళిపోయాడు. రావణుడి ప్రవర్తన వల్ల ఇంతకాలం కడుపు మండిపోయి ఉన్న దిక్పాలకులు అవకాశం దొరికిందని ఆనందపడ్డారు. హనుమ అలా నిప్పు పెట్టగానే అగ్ని దేవుడు కాల్చేస్తున్నాడు, వాయుదేవుడు వేగంగా వీచి అగ్నిని పట్టుకెళ్ళి అన్ని ఇళ్ళ మీద వేసేశాడు. కొన్ని చోట్ల ఆకుపచ్చగా, కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల ఎర్రగా ఆ లంక అంతా కాలిపోతుంది.

ఆ లంకలో అందరూ “హా తాత, హా పుత్ర, హా తల్లి” అని అరుచుకుంటూ దిక్కులు పట్టి పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు సంతోషంగా వెళ్ళి త్రికూటాచల పర్వతం మీద నిలబడి చూసేసరికి, ఎదురుగా లంక లంకంతా కాలిపోతూ కనిపించింది.

హనుమంతుని విచారం మరియు చారణుల మాటలు

అప్పుడాయన ఇలా అనుకున్నాడు: “అరరే! ఎంత పని చేశాను! అగ్నిని తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేసినట్టు కోపాన్ని విడిచిపెట్టిన వాడు ధన్యుడు. పాము కుబుసాన్ని విడిచినట్టు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకను కాల్చేశాను. ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది. ఏ సీతమ్మ తేజస్సు చేత నా తోకను అగ్ని కాల్చలేదో, అటువంటి సీతమ్మను అగ్ని కాలుస్తుందా? సీతమ్మే అగ్ని, అగ్నిని అగ్ని కాలుస్తుందా?”

ఇంతలో అటుగా వెళుతున్న చారణులు (భూమికి దగ్గరగా ఆకాశంలో ఎగురుతూ శుభవార్తలు చెప్పే దేవ గాయకులు) ఇలా అన్నారు: “ఏమి ఆశ్చర్యం! ఇవ్వాళ ఒక వానరుడైన హనుమ 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకా పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ లంక అంతా కాలిపోతుంది, కానీ శింశుపా వృక్షము, ఆ వృక్షము కింద కూర్చున్న సీతమ్మకు ఎటువంటి అపకారమూ జరగలేదు. అలాగే విభీషణుడి ఇల్లుకు కూడా ఏమీ జరగలేదు.”

సీతమ్మతో వీడ్కోలు మరియు హనుమంతుని తిరుగు ప్రయాణం

అప్పుడు హనుమంతుడు శింశుపా వృక్షం కింద కూర్చున్న సీతమ్మ దగ్గరికి వచ్చి, “అమ్మా! లంక అంతా కాల్చేశాను. రావణుడికి చెప్పవలసిన మాట చెప్పేశాను, నువ్వేమీ బెంగ పెట్టుకోకు. వాడు ఇప్పటికే భయంతో సగం చచ్చిపోయాడు. రాముడి కోసం వాడిని వదిలేశాను, లేకపోతే వాడి పది తలకాయలు గిల్లేసేవాడిని.

అమ్మా! నేను బయలుదేరతాను, తొందరలోనే నీకు పట్టాభిషేకం జరుగుతుంది, శోకమునకు గురికాకు” అని సీతమ్మతో చెప్పి ఒక్క దూకు దూకి ఆకాశంలోకి ఎగిరి నల్లటి వనాలతో, ఎర్రటి మచ్చలు కలిగిన ఏనుగులతో ఉన్న అరిష్టం అనే పర్వతం మీద దిగి, అక్కడి నుంచి బయలుదేరాడు. హనుమ ఆ పర్వతం మీద నుంచి ఎగిరేసరికి అది భూమిలోకి నొక్కుకుపోయింది.

ముగింపు

ఈ ఘట్టం హనుమంతుని పరాక్రమం, ధైర్యం, భక్తి, మరియు ధర్మానికి నిలువెత్తు ఉదాహరణ. ఆయన చేసిన విధ్వంసం ఒక్కొక్కడిగా కాకుండా ధర్మరాజ్య స్థాపనకు ముందు న్యాయ పోరాటం.

MS Rama Rao Sundarakanda Telugu

  • Related Posts

    Ramayanam in Telugu-రామాయణం 63-కిష్కిందకు తిరుగు ప్రయాణం

    హనుమంతుని ఉత్సాహపూరిత ఆగమనం Ramayanam Story in Telugu- ఆకాశంలోని మేఘాలను తాగుతున్నాడా అన్నట్లుగా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిన హనుమంతుడు, ఉత్తర దిక్కున తన కోసం ఎదురుచూస్తున్న వానరుల వద్దకు చేరుకోగానే ఒక పెద్ద ధ్వని చేశాడు. ఆ శబ్దం విన్న…

    భక్తి వాహిని

    భక్తి వాహిని
    Ramayanam Story in Telugu – రామాయణం 61

    కల వచ్చింది అనుకుంటే… Ramayanam Story in Telugu- ఒకరోజు సీతమ్మకి కలలో ఒక కోతి కనపడిందట. కలలో వానరము కనపడితే కీడు జరుగుతుందని అంటారు కదా!). దాంతో సీతమ్మ భయపడి “లక్ష్మణుడితో ఉన్న మా రాముడికి అంతా మంచే జరగాలి.…

    భక్తి వాహిని

    భక్తి వాహిని