Ramayanam Story in Telugu – రామాయణం 64

రాముని ఆలోచన

Ramayanam Story in Telugu- రాముడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు: “నూరు యోజనముల సముద్రమును ఎవరు దాటగలరు? ఇంత పెద్ద వానర సైన్యంతో ఆ సముద్రాన్ని ఎలా దాటగలం? అక్కడ భయంకరమైన రాక్షసులు, తిమింగలాలు, మొసళ్ళు వంటి ఎన్నో జీవులు ఉంటాయి కదా!”. శ్రీరామ కథలు @ భక్తివాహిని

అప్పుడు సుగ్రీవుడు రామునితో అన్నాడు: “ఓ రామా! మీరు దుఃఖించవద్దు. మీ యొక్క ఉత్సాహమును, శౌర్య పరాక్రమములను ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు కోదండం పట్టుకొని నిలబడినప్పుడు మీ ముందు నిలబడగలిగిన మొనగాడు ఎవరు? మీరు సమస్త బ్రహ్మాండములను శాసించగల శక్తిమంతులు. మీరు ఆజ్ఞాపిస్తే ఈ సమస్త వానర సైన్యము మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నది. ఒక్కసారి వానర సైన్యం లంకా పట్టణంలో అడుగు పెడితే రావణుడు చనిపోయినట్లే. కాబట్టి, సముద్రాన్ని దాటడం ఎలా అనే విషయంపై మీ దృష్టిని కేంద్రీకరించి మాకు ఒక మంచి మార్గాన్ని ఉపదేశించండి.”

రాముని సంకల్పం మరియు హనుమంతుని ప్రశ్న

సుగ్రీవుని మాటలకు ఉత్సాహం పొందిన రాముడు ఇలా అన్నాడు: “నిజమే! నేను తలుచుకుంటే నా తపఃశక్తితో ఈ వానరులను సముద్రాన్ని దాటించగలను. నా అస్త్ర ప్రయోగంతో సముద్రాన్ని ఇంకింపజేస్తాను.”

అనంతరం రాముడు హనుమంతుని వైపు తిరిగి ఇలా అడిగాడు: “హనుమా! ఆ లంకా పట్టణం యొక్క బలం ఏమిటో చెప్పగలవా? అక్కడ ఎంత సైన్యం ఉంటుంది? ద్వారములు మరియు దుర్గములు ఎలా ఉంటాయి?”

హనుమంతుని సమాధానం – లంకా పట్టణం యొక్క దుర్భేద్యత

హనుమంతుడు బదులిచ్చాడు: “శత్రువులకు దుర్భేద్యమైన లంకా పట్టణం నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళితే త్రికూట పర్వత శిఖరాల మధ్యన ఉంటుంది. దేవతలు మరియు దానవులు కూడా దానిని ఆక్రమించలేరు. లంకా పట్టణం చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. దానిలో ఒక విశాలమైన కందకం నిర్మించారు. దానిపై నాలుగు వైపులా నాలుగు వంతెనలు ఉన్నాయి. ఈ వంతెనల మీద ఎల్లప్పుడూ కొన్ని వందల శతఘ్నులు సిద్ధంగా ఉంచబడి ఉంటాయి. దానితో పాటు ఆ లంకకు నాలుగు దుర్గములు ఉన్నాయి. అడవిలో ఉన్న దుర్గాన్ని అరణ్య దుర్గం అని, నదిచే రక్షింపబడుతున్న దుర్గాన్ని నదీ దుర్గం అని, పర్వతం చేత రక్షింపబడుతున్న దుర్గాన్ని పర్వత దుర్గం అని, కృత్రిమంగా నిర్మించిన దుర్గాన్ని కృత్రిమ దుర్గం అని అంటారు.

లంకా పట్టణం ఈ నాలుగు దుర్గములతో శోభిల్లుతున్నది. లంకకు నాలుగు వైపులా నాలుగు ద్వారములు ఉన్నాయి. తూర్పు ద్వారం దగ్గర పదివేల మంది రాక్షసులు ఆయుధాలు పట్టుకొని గుర్రాల మీద, ఏనుగుల మీద తిరుగుతూ కాపలా కాస్తుంటారు. దక్షిణ ద్వారమును లక్ష మంది సైనికులు కాపలా కాస్తుంటారు. పది లక్షల మంది పశ్చిమ ద్వారమును కాపలా కాస్తుంటారు. కోటి మంది సైనికులు ఉత్తర ద్వారమును కాపలా కాస్తుంటారు. ఆ రాక్షసులకు యుద్ధం చేయడమంటే చాలా ఇష్టమైన విషయం. రాజ ద్వారమునకు భయంకరమైన ఇనుప గడియలు మరియు పరిఘలు బిగించి ఉంటాయి. లంకను చేరుకొని యుద్ధం చేయడం అంత సులభమైన విషయం కాదు.”

అంశంవివరాలు
లంక స్థానంనూరు యోజనాల సముద్రాన్ని దాటి త్రికూట శిఖరాల మధ్య
రక్షణ నదీ వలయంలంక చుట్టూ నది ప్రవహిస్తూ ఉంటుంది
వంతెనలునాలుగు దిశల్లో వంతెనలు
దుర్గములుఅరణ్యదుర్గ, నదీదుర్గ, పర్వతదుర్గ, కృత్రిమ దుర్గం
ద్వారాల సైన్యంతూర్పు – 10,000 రాక్షసులు; దక్షిణం – లక్ష మంది; పశ్చిమం – పదిలక్షలు; ఉత్తరం – కోటిమంది

హనుమంతుని ధైర్యం మరియు సూచన

“మీరు ఆజ్ఞాపిస్తే సుషేణుడు, గంధమాదనుడు, నీలుడు, నలుడు, ద్వివిదుడు, మైందుడు, సుగ్రీవుడు, అంగదుడు వంటి బలవంతులు లంకను సర్వనాశనం చేస్తారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న మొత్తం రాక్షస సైన్యంలో ఒక వంతు సైన్యాన్ని నాశనం చేశాను. అక్కడున్న అనేక వంతెనలలో ఒక వంతెనను పూర్తిగా విరిచేశాను. అనేక ప్రాసాదాలను కూల్చాను. ప్రస్తుతం లంక చెదిరిపోయిన శోభతో ఉన్నది. రాక్షసులు భయాందోళనలో ఉన్నారు. వారితో యుద్ధం చేయడానికి ఇది చాలా అనువైన సమయం అని నేను అనుకుంటున్నాను” అని హనుమంతుడు అన్నాడు.

సుగ్రీవుని శుభ సూచనలు మరియు ముహూర్త నిర్ణయం

సుగ్రీవుడు అన్నాడు: “నాకు అన్నీ శుభ నిమిత్తములు కనపడుతున్నాయి. నా మనస్సులో ఉత్సాహం ఉప్పొంగుతున్నది. మనం ఆ సముద్రాన్ని సేతువు కట్టి దాటితే రావణుడు చనిపోయినట్లే. మనం బయలుదేరడానికి మంచి ముహూర్తం నిర్ణయించండి.”

రాముడు బదులిచ్చాడు: “మనం ఈ ఆలోచన చేస్తున్న సమయంలో సూర్యుడు ఆకాశంలో మధ్యన ఉన్నాడు. మా ఇక్ష్వాకు వంశీయులందరిదీ ఈ రోజున ఉన్న విశాఖ నక్షత్రము. ఆ నక్షత్రము పునర్వసు నక్షత్రమునకు సాధన తార అవుతుంది. ఈ రోజున ఉన్న ముహూర్తాన్ని విజయము అని పిలుస్తారు. ఈ ముహూర్తం చాలా బాగున్నది. మనం తక్షణమే సైన్యంతో బయలుదేరుదాము.”

వానరుల ఉత్సాహం మరియు బయలుదేరుటకు సంసిద్ధత

రాముడు ఈ మాట అనగానే అక్కడున్న వానరులందరూ సంతోషం పొంది “జై శ్రీరాం, జై జై రామ! బయలుదేరదాము – లంక చేరిపోదాము – రావణుడిని సంహరిద్దాము!” అని నినాదాలు చేశారు.

రాముని సైనిక వ్యూహం మరియు మార్గదర్శకాలు

రాముడు సుగ్రీవుడితో ఇలా అన్నాడు: “వృద్ధులైన వారు, శరీరంలో శక్తి లేనివారు, దెబ్బలు తిని ఉన్నవారు, నిస్సత్తువతో ఉన్నవారు అయినటువంటి వానరులను తీసుకొని రావద్దు. మొదట నీలుడు వెళ్ళాలి. ఆయనతో పాటుగా విశేషమైన బలం కలిగిన లక్ష వానరులు వెళ్ళాలి. మిగతా వానరులందరూ రావడానికి కావలసిన త్రోవను వారు నిర్ణయించాలి. అందరూ వెళ్ళడానికి అనువైన రీతిలో ఉన్న రహదారిని నిర్మించాలి. కొన్ని గంటలు ప్రయాణం చేశాక అందరూ బడలిపోతారు. విశ్రాంతి తీసుకోవడానికి చక్కని వృక్ష సముదాయం ఉండాలి.

తాగడానికి మంచి నీరు దొరకాలి. పళ్ళు, తేనె దొరకాలి. అటువంటి అరణ్య మార్గమును నీలుడు నిర్ణయించాలి. ఈ సైన్యం అంతా వెళుతున్నప్పుడు గజుడు, గవాక్షుడు, గవయుడు సైన్యానికి ముందు నడుస్తూ వెళ్ళాలి. ఈ సైన్యాన్ని కుడి పక్కన ఋషభుడు చూస్తూ వారిని రక్షించాలి. ఎడమ పక్కన గంధమాదనుడు కొన్ని లక్షల మంది వానరులతో ఆ సైన్యాన్ని రక్షించాలి. వెనుక కూడా కొన్ని లక్షల వానరులు రక్షిస్తూ రావాలి.

మధ్య మధ్యలో సరస్సులు ఉంటాయి. అటువంటి సరోవరములలో శత్రువులు విషం కలిపి నాశనం చేస్తారు. ఆ విషపూరిత జలాలను తాగితే వానరులందరూ కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చాలా ముందుగా వెళ్ళి అటువంటి నీటి సరోవరాలకి, సరస్సులకి ప్రమాదం కలగకుండా కాపలా కాయాలి.

నేను సైన్య మధ్య భాగంలో హనుమ భుజాల మీద కూర్చుని వస్తాను. అంగదుడి భుజాల మీద లక్ష్మణుడు బయలుదేరతాడు. జాంబవంతుడు మొదలైన వారు ఈ వానర సైన్యాన్ని అన్ని వైపులా రక్షిస్తూ ఉండాలి.”

వానర సైన్యం యొక్క ప్రయాణం మరియు ప్రతాపాలు

వానర సైన్యం అంతా బయలుదేరింది. అప్పుడు ఆ సైన్యంలో కొంతమంది వెనుక నడవకుండా ముందుకొచ్చి నడుస్తున్నారు. రాముడికి పక్కన నడుస్తున్నవారు అంటున్నారు: “ఒరేయ్! చూడరా లంకకి వెళ్ళగానే రావణుడిని ఏమి చేస్తానో” అని ఒకడు, “నేను ఒక్క గుద్దు గుద్దానంటే వాడి తలకాయలు పగిలిపోతాయి. చూడరా నా కండ” అని రాముడికి వినపడేటట్టుగా తమ ప్రతాపాలు చెప్పుకుంటున్నారు.

ఆ సైన్యంలో బలంగా ఉన్నవాళ్ళు మెల్లగా నడుస్తున్నవారిని ఎత్తి పక్కకు పారేసి ముందుకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది తొందరగా వెళ్ళాలని పర్వతాల మీద ఎక్కి వెళుతున్నారు. కొంతమంది చెట్లని పీకేసి వాటిని గొడుగులుగా పట్టుకొని వెళుతున్నారు. వాళ్ళందరూ అలా వెళుతుంటే అరణ్యం అరణ్యమే వెళ్ళిపోతున్నదా అన్నట్టుగా ఉన్నది.

వాళ్ళందరూ బయలుదేరి దక్షిణ దిక్కున ఉన్న సహ్యాద్రి పర్వత శిఖరముల మీదకు చేరుకుని అక్కడ ఉన్న రకరకాల పళ్ళను తిని కాలం గడిపారు. అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ముందుకి వెళ్ళగా వారికి సముద్రం కనపడింది. వారు సముద్రాన్ని చేరుకునేసరికి చీకటి పడింది.

రాముని ఆదేశం మరియు వానర సైన్యం యొక్క విడిది

రాముడు అన్నాడు: “మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ సైన్యాన్ని విడిది చేయించి, రాక్షసుల బారిన పడకుండా ఈ వానరులను మూడు భాగాలుగా చేయండి.” కొన్ని కోట్ల వానరులను ఒక వైపు నిలబెట్టారు. కొండముచ్చులను ఒక వైపు నిలబెట్టారు. భల్లూకాలను ఒక వైపు నిలబెట్టారు.

సముద్రం యొక్క రమణీయ దృశ్యం

చంద్రుని కాంతి కెరటాల మీద కదులుతున్న నీటిమీద పడి మెరుస్తుంది. చంద్రుడిని చూసి పొంగుతున్న సముద్రమును, పైనున్న చంద్రుడిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉన్నది. గాలి చేత తోయబడుతున్న నీరు చంద్రుని కాంతికి మెరుస్తూ వెండి పళ్ళెంలా ఉన్నది. పైన ఆకాశంలో ఉన్న నక్షత్రాలు సముద్రం మీద ప్రతిఫలిస్తూ, అగ్ని చూర్ణం తీసుకొచ్చి సముద్రం మీద ఎవరో చల్లినట్టు ఉన్నాయి.

ఆకాశము సముద్రం వలే, సముద్రము ఆకాశం వలే ఉన్నాయి. రెండింటికీ తేడా తెలియడం లేదు. రెండూ కలిసిపోయినట్టు ఉన్నాయి. ఆకాశంలో తారలు ఉన్నాయి. సముద్రంలో రత్నాలు ఉన్నాయి. ఆకాశం కదులుతున్న మేఘాలతో ఉన్నది. కదులుతున్న తరంగములతో సముద్రము ఉన్నదని వాల్మీకి మహర్షి తనదైన శైలిలో వర్ణించారు.

రాముని విచారం మరియు ప్రకృతితో సంభాషణ

రాముడు సముద్రం వైపు చూస్తూ అన్నాడు: “సీత లంకలో ఉండిపోయింది. నేను ఇక్కడ ఉండిపోయాను. చంద్రుడా! సీత నిన్ను చూసుంటుంది. అలా చూడబడిన నువ్వు నా వంక చూస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది. అటువైపు నుంచి వస్తున్న గాలి సీతకి తగిలి వస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది.”

రావణుని ఆందోళన మరియు మంత్రుల సమావేశం

లంకలో మంత్రులతో కూర్చుని దీనంగా తల దించుకుని రావణుడు ఉన్నాడు. అప్పుడాయన వారితో ఇలా అన్నాడు: “జరగకూడని పని జరిగిపోయింది. నేను సీతను అపహరించిన విషయం మీ అందరికీ తెలుసు కదా! రాముడు నా మీదకు యుద్ధానికి వస్తున్నాడు.

నిన్న హనుమంతుడు ఒక్కడే వచ్చి ఈ లంకా పట్టణమును ఎంత బాధించాడో మీరు చూశారు. ఈ మాట చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉన్నది. రాముడు సముద్ర తీరమునకు వచ్చేశాడు. ఎలాగో అలా సముద్రాన్ని దాటుతాడు. మనం రామలక్ష్మణులతో, వానరులతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. మీరందరూ కలిసికట్టుగా నాకు ఒక ఆలోచన చెప్పండి. మంత్రులందరూ ఏకాభిప్రాయంగా చెప్పినది ఉత్తమమైన మాట.

మంత్రులు తమలో తాము విభేదించుకుని, తమ విభేదములు పక్కకు పెట్టి కలిసి ఒక్కటిగా చెప్పిన మాట మధ్యమమైన మాట. మంత్రులు విడిపోయి ఎవరికి తోచిన మాట వారు చెబితే అది అధమమైన మాట. అందుకని నాకు ఒక మంచి మాట చెప్పండి.”

మంత్రుల యొక్క గర్వం మరియు ప్రగల్భాలు

మంత్రులు బదులిచ్చారు: “ప్రభూ! మీరు దేనికి ఇంత బెంగ పెట్టుకుంటున్నారు. మీరు ఒకనాడు హిమాలయాలలో ఉన్న మీ అన్న కుబేరుడితో యుద్ధం చేసి ఆయనను ఓడించి పుష్పక విమానమును ఎత్తుకొచ్చారు. ఆయన ఉన్న ఇంట్లో నుంచి ఆయనను తరిమేసి ఈ లంకా పట్టణమును స్వాధీనం చేసుకున్నారు. మీ చెల్లెలైన కుంభీనస యొక్క భర్త అయిన మధువుని ఓడించి అక్కడి నుంచి తెచ్చుకోవలసిన వస్తువులన్నీ తెచ్చుకున్నారు.

పాతాళ లోకములోకి వెళ్ళి అక్కడున్న నాగులైన తక్షకుడు, జటి మొదలైన వారిని ఓడించి అపారమైన కీర్తి గడించారు. దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడిని ఓడించారు. తరువాత యమలోకానికి వెళ్ళి యముడిని ఓడించారు. యముడు మిమ్మల్ని చూసి పారిపోయాడు. ఇంత మందిని కొట్టిన మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ దగ్గర ఇంద్రజిత్ ఉన్నాడు. ఇంద్రజిత్ ముందు ఆ రాజకుమారులు ఎంత?”

మంత్రులలో ఒకడైన ప్రహస్తుడు లేచి అన్నాడు: “రావణా! నువ్వు భయపడవద్దు, నేను ఒక్కడిని యుద్ధానికి వెళితే చాలు. ఆ రామలక్ష్మణులిద్దరినీ సంహరించి వస్తాను. నిన్నటి రోజున అజాగ్రత్తగా ఉండడం వలన ఆ వానరాన్ని పట్టుకోలేకపోయాము.”

దుర్ముఖుడనే మంత్రి అక్కడికి రక్తంతో తడిసిన పరిఘను పట్టుకొచ్చి అన్నాడు: “నేను ఒక్కడినే వెళ్ళి ఈ పరిఘతో వారిని కొట్టి వచ్చేస్తాను.”

వజ్రదంష్ట్రుడు ఇలా అన్నాడు: “రాముడిని మోసం చేసి గెలిచే ఒక గొప్ప ప్రణాళిక నీకు చెబుతాను. మన దగ్గర కామరూపులైన రాక్షసులు ఉన్నారు. వారందరినీ భరతుడి సైన్యంలా రూపం మార్చమని చెప్పి రాముడి దగ్గరికి పంపి ‘అయోధ్యలో ముఖ్యమైన పని వచ్చింది, భరతుడు చాలా కష్టంలో ఉన్నాడు అందుకని నిన్ను తొందరగా రమ్మన్నాడు’ అని రాముడితో చెబుతారు.

భరతుడి మీద ఉన్న ప్రేమ చేత రాముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మన సైన్యం సముద్రాన్ని దాటి రాముడిని కొట్టేస్తుంది. అప్పుడు వానరులందరూ దిక్కులు పట్టి పారిపోతారు. మీరు అనుమతిస్తే ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాము.”

నికుంభుడు (కుంభకర్ణుడి కుమారుడు) అన్నాడు: “దీనికి ఇంత మోసం ఎందుకు? నేను వెళ్ళి వారిని చంపేసి రామలక్ష్మణులను తినేసి వస్తాను.”

విభీషణుని నీతియుక్తమైన ఉపదేశం

విభీషణుడు అన్నాడు: “మూడు బలహీనతలు ఉన్న శత్రువు విషయంలోనే యుద్ధానికి సిద్ధపడాలి. ఆ రాజు ఏమరపాటుతో ఉంటే యుద్ధానికి వెళ్ళడం తేలిక. మరొక శత్రువుతో బాధపడుతున్న రాజు మీదకు వెళ్ళడం తేలిక. దైవం ప్రతికూలంగా ఉన్న రాజు మీదకు వెళ్ళడం తేలిక. ఈ మూడు లోపాలు ఉన్న రాజు మీదకు దండయాత్ర చేయడం తేలిక. మీరందరూ రాముడిని చంపేస్తాము, కొట్టేస్తాము అని గొప్పలు చెప్పుకుంటున్నారు.

రాముడు అంత బలహీనుడిలా కనపడుతున్నాడా! రాముడు ఈరోజు యుద్ధానికి వచ్చాడు, అప్రమత్తంగా ఉన్నాడు. దైవం ఆయన పట్ల అనుకూలంగా ఉన్నది. మీరు భరతుడి సైన్యం వేషాలు కట్టుకొని వెళితే తెలుసుకోలేనంత మూర్ఖుడు కాదు. నదులకు (తూర్పు దిక్కుకు ప్రవహించే వాటిని నదులు అంటారు), నదములకు (పశ్చిమ దిక్కుకు ప్రవహించే వాటిని నదములు అంటారు) భర్త అయిన నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు హనుమ వచ్చి లంకా పట్టణమంతటినీ కాల్చేశాడు. మరి నిన్న మీరు హనుమని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇన్ని కోట్ల మంది ఇక్కడికి వచ్చిన వాడిని పట్టుకోలేకపోయారు.

మీరందరూ ఈరోజు ప్రభువు దగ్గర నిలబడి నేను కొట్టేస్తాను, నేను చంపేస్తాను, నేను తినేస్తాను అంటున్నారు. ఇవి మంత్రులు చెప్పవలసిన మాటలేనా? మీ మాటలకు ఆలోచన కానీ, విచక్షణ కానీ ఉన్నదా! యుద్ధానికి వెళ్ళే ముందు శత్రు సైన్యం యొక్క బలం ఎంత ఉంది అని జాగ్రత్తగా అంచనా వేయాలి. అందులో పక్షపాత బుద్ధి ఉండకూడదు.

విభీషణుని విజ్ఞప్తి మరియు రావణుని తిరస్కారం

శత్రువు కన్నా మనకే ఎక్కువ బలం ఉంటేనే యుద్ధానికి వెళ్లాలి. అసలు శత్రువు బలం ఏమిటో, ఎంతమంది వస్తున్నారో, ఎవరు ఎటువంటివారో మీరు అంచనా వేశారా? రాముడు యుద్ధానికి రావడానికి కారణం ఏమిటంటే, మీ తమ్ముడు రావణుడు ఆయన భార్య సీతను అపహరించి అశోక వనంలో ఉంచాడు.

రాముడు తన భార్యను విడిపించుకోవడానికి వస్తున్నాడు. ధర్మం రాముడి వైపు ఉంది. ధర్మం ఎక్కడ ఉంటే దేవతలు అక్కడ ఉంటారు. దేవతల అనుగ్రహం రాముడికి ఉంటుంది. మీరు రాముడి మీదకు యుద్ధానికి వెళ్లాలని ఎలా అనుకుంటున్నారు? ఏ విధంగా చూసినా రాముడిదే పైచేయి. లంకకు, రాక్షసులకు, రావణుడికి కీడు జరగకూడదనుకుంటే, ఏ సీతమ్మ కారణమో ఈ కలహానికి, ఆ సీతమ్మను రాముడికి అప్పగిస్తే రాముడు యుద్ధానికి రాడు. తప్పు చేసింది మనం, ఆ తప్పును సమర్థించుకోవడానికి ఇన్ని కోట్ల మందిని పణంగా పెట్టడం మంచిది కాదు. నా మాట విని సీతమ్మను ఇచ్చేయండి.

విభీషణుడు చెప్పిన మంచి మాటలు రావణుడికి చెవికెక్కలేదు. రావణుడు తన మంత్రులను ఆ సభ నుండి వెళ్ళమని చెప్పి, తాను కూడా వెళ్ళిపోయాడు.

విభీషణుని ఆందోళన మరియు దుశ్శకునాలు

మరునాడు ఉదయం విభీషణుడు రావణుడు ఉన్న ఇంటికి వెళ్ళాడు. అక్కడ కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు. బ్రాహ్మణులు స్వస్తి వాచకాలు చెబుతున్నారు. పూజలు, అగ్ని కార్యములు జరుగుతున్నాయి. రావణుడు ఒక మంచి పరుపు మీద కూర్చుని ఉండగా విభీషణుడు అక్కడికి తలవంచి నమస్కరిస్తూ వెళ్ళి అన్నాడు: “అన్నయ్యా! నిన్న నీకు సభలో కొన్ని విషయాలు చెబుతుంటే వెళ్ళిపోయావు కదా! నీకు కొన్ని విషయాలు రహస్యంగా చెబుదామని అనుకున్నాను. ఈ విషయాలు లంకలో అందరికీ తెలుసు.

నీ మంత్రులకు కూడా తెలుసు. కానీ నీకు భయపడి ఎవరూ నీతో చెప్పడం లేదు. నేను కూడా చెప్పకపోతే నా అన్నను రక్షించుకోని వాడిని అవుతానని నీ మీద ప్రేమతో చెప్పడానికి వచ్చాను.

నువ్వు ఏనాడైతే సీతమ్మను అపహరించి లంకకు తీసుకొచ్చావో, ఆనాటి నుండి నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఎప్పుడైనా హోమం చేద్దామని నాలుగు పుల్లలు ఆ హోమగుండంలో వేస్తే ప్రారంభం నుండి కూడా అగ్ని పెద్దగా పైకి రావడం లేదు. పొగ చుట్టుముట్టి ఉంటున్నది. అన్ని హోమగుండములలోని అగ్ని కూడా పొగతోనే ఉంటుంది, నిప్పు రవ్వలు బయటికి కనపడుతున్నాయి. అగ్నిశాలలోకి, వేదశాలలోకి, పూజా గృహంలోకి ఎక్కువగా పాములు వస్తున్నాయి. అన్నిటినీ మించి తెల్లవారుజామున హోమం చేద్దామని పాయసం కానీ, తేనె కానీ పెట్టుకుంటే, వాటి నిండా చీమలు పట్టి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అశుభ శకునములు.

ఆవుపాలు తీసుకొచ్చి పెట్టగానే అవి విరిగిపోతున్నాయి. ఏనుగులకు మదజలాలు కారకుండా అలా నిలబడి ఉంటున్నాయి. గుర్రాలు ఉత్సాహంగా సకిలించడం లేదు. దీనంగా సకిలిస్తూ కళ్ళ వెంట నీరు కారుస్తున్నాయి. గాడిదలు, కంచర గాడిదలు, ఒంటెలు మొదలైన జంతువుల మీద ఉన్న వెంట్రుకలు తమంతట తాముగా ఊడి పడిపోతున్నాయి.

పశు వైద్యులను తీసుకొచ్చి వాటికి వైద్యం చేయించినా, ఈ జాతి జంతువుల మీద వెంట్రుకలు నిలబడడం లేదు. కాకులు గుంపులు గుంపులుగా వచ్చి ఇళ్ళ మీద కూర్చుని అదే పనిగా అరుస్తున్నాయి. ప్రతిరోజు గ్రద్దలు ఇళ్ళ మీద కూర్చుంటున్నాయి. అడవిలో ఉండే నక్కలు పగటివేళ, రాత్రివేళ ఊరి పొలిమేరలకు వచ్చి పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి. క్రూరమైన మృగాలు భయంకరమైన ధ్వనులు చేస్తున్నాయి. అందుకని సీతమ్మను తీసుకెళ్ళి మనం రాముడికి అప్పచెప్పుదాము.”

రావణుని ఆగ్రహం మరియు తిరస్కారం

రావణుడు విభీషణుడి వైపు కోపంగా చూసి అన్నాడు: “ఇవన్నీ నీకు ఎక్కడ కనపడుతున్నాయి? నాకు ఎక్కడా కనపడడం లేదు. రాముడు యుద్ధానికి దేవేంద్రుడిని తీసుకొచ్చినా సరే, సీతను ఇవ్వను. ఇక నువ్వు వెళ్ళవచ్చు.” విభీషణుడు తల వంచుకొని వెళ్ళిపోయాడు.

రావణుని క్షీణత

తన మనస్సు నిరంతరం పరాయి స్త్రీ యందు ఉండటం చేత, సోదరుడు చెప్పిన మంచి మాట వినకపోవడం చేత రావణాసురుడు రోజురోజుకీ కృశించిపోతున్నాడు.

రావణుని సభ మరియు కుంభకర్ణుని పిలుపు

రావణుడు ఒక గొప్ప రథం ఎక్కి అందరినీ సభా మండపానికి రమ్మన్నాడు. అందరూ సభలో కూర్చున్నాక ఆయన ఇలా అన్నాడు: “నేను సీతను అపహరించి తీసుకొచ్చిన మాట నిజం. ఆ సమయంలో కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు కనుక నేను వాడికి చెప్పలేదు. ప్రహస్తా! వెళ్ళి కుంభకర్ణుడిని తీసుకురా.”

రావణుని కామంతో కూడిన మాటలు

ఆ సభను ఉద్దేశించి రావణుడు అన్నాడు: “మూడు లోకములలో సీత కన్నా అందగత్తె లేదు. నేను ఆమెను అపహరించి తీసుకొచ్చాను. ప్రతిరోజు సన్నటి నడుము కలిగిన సీతను చూస్తుంటే నాలో కామ కోరిక పెరిగిపోయి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ కామం ఎక్కువ అవ్వడం వల్ల నేను నీరసించిపోతున్నాను. నేను సీతను అపహరించి తీసుకొచ్చాక ‘రాముడు ఒకవేళ తిరిగి వస్తాడేమో ఒక సంవత్సరం చూద్దాము’ అని సీత నన్ను అడిగింది. ఒక సంవత్సరం వరకు నా మంచం ఎక్కను అన్నది. పోనీలే ఒక సంవత్సరమే కదా! అని గడువు ఇచ్చాను.”

కుంభకర్ణుని ఆగ్రహం మరియు ప్రగల్భాలు

అక్కడికి వచ్చిన కుంభకర్ణుడు అన్నాడు: “నువ్వు చేసిన పని చాలా తప్పు. ఇప్పుడు మమ్మల్ని అందరినీ పిలిచి, ఏమి చేయను అని అంటావేమిటి? ఈ మాట నువ్వు మమ్మల్ని అపహరించే ముందు అడగాలి. రాజు ఒక నిర్ణయం చేసే ముందు న్యాయాన్యాయాలను బాగా ఆలోచించాలి. మంచి చెడు విచక్షణ లేకుండా తొందరపాటుతో రాజు కాని నిర్ణయం చేస్తే, ఆ నిర్ణయం నుండి బయట ఉన్నవారు ప్రయోజనం పొందుతారు.

నువ్వు తొందరపడి సీతను తీసుకొచ్చావు, నీ అదృష్టం బాగుంది కాబట్టి ఇంకా రాముడి చేతిలో చచ్చిపోకుండా బ్రతికి ఉన్నావు. ఏదో తప్పు చేశావు. ఇంక బెంగ పెట్టుకోవద్దు. హాయిగా లోపలికి వెళ్ళి మద్యం తాగి, నీ భార్యలతో సుఖంగా విహరించు. నేను ఉన్నాను కదా! నేను వెళ్ళి రామలక్ష్మణులను సంహరించి వానరులందరినీ తినేసి వస్తాను.”

మహాపార్శ్వుని నీచమైన సూచన

మహాపార్శ్వుడు అనే మంత్రి అన్నాడు: “ఒక కోడిపుంజుకు కోరిక కలిగితే కోడిపెట్టను తరిమి, బలాత్కారంగా దానిని అనుభవిస్తుంది. అలా నువ్వు కూడా సీతను అనుభవించు.”

రావణుని శాపం

రావణుడు ఆ మహాపార్శ్వుడిని దగ్గరికి పిలిచి అన్నాడు: “ఎంత గొప్ప ఆలోచన చెప్పావు. నాకు ఒక శాపం ఉన్నది. ఒకనాడు నేను బ్రహ్మ సభకు వెళుతున్నప్పుడు పుంజకస్థల అనే అప్సరస నన్ను చూసి దాక్కుంది. అప్పుడు నేను ఆమెను వెంట తరిమి, వివస్త్రను చేసి అనుభవించాను. బహుశా ఆవిడ బ్రహ్మగారికి చెప్పి ఉంటుంది. బ్రహ్మగారు నన్ను పిలిచి ‘ఇక ముందు నీ యందు మనస్సు లేని స్త్రీని నువ్వు బలాత్కారంగా అనుభవిస్తే, తక్షణమే నీ తల నూరు ముక్కలవుతుందని’ శపించారు. అందుకని నేను సీత జోలికి వెళ్ళలేదు.”

విభీషణుని హెచ్చరిక

విభీషణుడు అన్నాడు: “మీ అందరికీ రాముడంటే చాలా తేలికగా ఉన్నది. సీతమ్మ అంటే మీకు చాలా చులకనగా ఉన్నది. ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, కుంభకర్ణుడు కానీ, ఇంద్రజిత్ కానీ, రావణాసురుడు కానీ, మహాపార్శ్వుడు కానీ, మహోదరుడు కానీ, నికుంభుడు కానీ, వీరెవ్వరు కూడా రాముడి జోలికి వెళ్ళలేరు.”

ప్రహస్తుని అహంకారం

ప్రహస్తుడు అన్నాడు: “ఏమిటి విభీషణా! అలా మాట్లాడుతున్నావు? మన ప్రభువు దేవదానవులను ఓడించాడు. అసలు మనకు భయమన్న మాట ఇప్పటి వరకు తెలియదు. నువ్వు ఎందుకు రాముడిని చూసి భయపడుతున్నావు?”

విభీషణుని ధర్మబోధ

విభీషణుడు అన్నాడు: “ఇక్ష్వాకు వంశస్తుడైన ఆ రాముడు పరమ ధర్మాత్ముడు. మీకు లేనిది ఆయనకు ఉన్నది ధర్మం ఒక్కటే. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది.

ప్రహస్త! నీకేమి తెలుసని మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా గద్ద రెక్కలు కట్టబడిన రామబాణాలు నీ వక్షస్థలంలో నాటుకుని నీ గుండెలు చీల్చి ఉంటే నువ్వు ఇలా మాట్లాడి ఉండేవాడివి కాదు. నీకు రామ బాణం యొక్క రుచి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నావు.

మీరందరూ బతకాలనుకుంటే, అందరూ కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం చేయండి, రావణుడి మీద తిరగబడండి. ఆయనకు బుద్ధి చెప్పండి. సీతమ్మను ఇచ్చేయండి. అలా చేస్తే మీరు బ్రతికి ఉంటారు లేకపోతే నశించిపోతారు.”

ఇంద్రజిత్తు యొక్క గర్వం

ఆ సభలోనే ఉన్న ఇంద్రజిత్ పైకి లేచి అన్నాడు: “వీర్యంలో కానీ, పరాక్రమంలో కానీ, బలంలో కానీ, తేజస్సులో కానీ మా తండ్రి రావణాసురుడు, ఆయన తమ్ముడు కుంభకర్ణుడు సాటిలేనివారు. నువ్వు ఇంత బలహీనుడిగా ఎలా పుట్టావు పినతండ్రీ! ‘రాముడు వచ్చేస్తాడు’ అని మాట్లాడుతున్నావు ఎందుకంత భయం నీకు? ఏం చేస్తాడు రాముడు వస్తే?”.

విభీషణుని ఆగ్రహం మరియు హెచ్చరిక

విభీషణుడు అన్నాడు: “నువ్వు బాలుడివి, నీకేమీ తెలియదు. నిన్ను ఈ సభలోకి తీసుకొచ్చిన వాడిని నిన్ను చంపాలి. నీకేమి తెలుసని ఇక్కడికి వచ్చావు. ఈ సభలో మీ నాన్న పరాయి స్త్రీ యందు తనకున్న కామం గురించి మాట్లాడుతుంటే వినడానికి నీకు సిగ్గుగా లేదా! నీ పౌరుషం, నీ పరాక్రమం రాముడి ముందు నిలబడలేదు. లేనిపోని గర్వం తెచ్చుకొని విర్రవీగకు ఇంద్రజిత్, కూర్చో.”

రావణుని నిందారోపణ

రావణుడు అన్నాడు: “ఇంట్లో పగబట్టిన పాము తిరుగుతుంటే ఆ పాముతో కలిసి ఇంట్లో ఉండవచ్చు. శత్రువని తెలిసి ఆ శత్రువు ఉన్న చోట ఉండవచ్చు. మిత్రుడి రూపంలో ఉండి శత్రువుగా ప్రవర్తిస్తున్న వాడితో కలిసి ఉండకూడదు. పూర్వం కొన్ని ఏనుగులు సరోవరంలో ఉండేవి. ఆ ఏనుగులు చెప్పిన మాటలు నీకు చెబుతాను జాగ్రత్తగా విను విభీషణా! ఆ ఏనుగులు అన్నాయి ‘మనకు అగ్ని వల్ల భయం లేదు, పాశముల వల్ల భయం లేదు, నీటి వల్ల భయం లేదు, మనకు మన జాతి వల్లే భయం’ అన్నాయి. నిన్ను చూస్తే నాకు ఆ మాట నిజం అనిపిస్తోంది.

ఆవులే ఐశ్వర్యం, బ్రాహ్మణులే తపస్సు, స్త్రీలదే చంచల బుద్ధి, బంధువుల వల్ల భయం కలుగుతాయి. నాకు నీ వల్లే భయమేస్తున్నది. ఈరోజు నన్ను అందరూ కీర్తిస్తుంటే నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు నాకు తమ్ముడివి కాదు, నువ్వు నా శత్రువువి.”

  1. 🔗 Hanuman crosses the ocean – Ramayana Short
  • Related Posts

    Ramayanam Story in Telugu – రామాయణం 76

    భరతుడి విన్నపం – రాముడి అంగీకారం Ramayanam Story in Telugu- భరతుడు శ్రీరాముడి శిరస్సుపై చేతులు జోడించి “అన్నయ్యా, మా అమ్మ కైకేయి గతంలో రెండు వరాలను కోరింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా జన్మించి, రాజ్యం పొందడానికి అన్ని అర్హతలు…

    భక్తి వాహిని

    భక్తి వాహిని
    Ramayanam Story in Telugu – రామాయణం 75

    శివుని ఆశీర్వచనం Ramayanam Story in Telugu- దేవతలందరితో కలిసి అక్కడకు విచ్చేసిన శివుడు రాముడితో ఇలా పలికాడు: “నాయనా రామా! నీ తమ్ముడు భరతుడు అయోధ్యలో దీనమైన స్థితిలో ఉన్నాడు, అతడిని ఓదార్చు. నీ తల్లి కౌసల్యను ఊరడించు. కైకేయికి,…

    భక్తి వాహిని

    భక్తి వాహిని