Karthika Puranam
తృతీయాధ్యాయము: వశిష్ఠుడు – జనక సంవాదం కొనసాగింపు
బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి, రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగారు: ‘రాజా! ఈ కార్తీక మాసంలో స్నానం, దానం, జపం, తపస్సు – వంటి వాటిలో ఏ కొద్దిపాటి ఆచరించినా, అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది.
శరీర కష్టానికి భయపడి, సుఖాలకే లాలస పడి కార్తీక వ్రతాన్ని ఆచరించని వారు , వంద జన్మలు కుక్కలుగా పుడతారు.
|| శ్లో॥ పౌర్ణమ్యాం కార్తీ కేమాసి స్నానాందీస్తు నాచరన్
కోటిజన్మసు చండాలయోనౌ సంజాయతే నృప
|| శ్లో॥ క్రమాద్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః
అత్రై వోదాహరంతీ మ మితిహాసం పురాతనమ్
కార్తీక పౌర్ణమినాడు స్నానం, దానం, జపం, ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్లు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి , చివరకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. దీనికి ఉదాహరణగా ఒక పాత గాథను చెబుతాను, విను.
తత్త్వనిష్ఠుని ఆఖ్యానం (బ్రహ్మరాక్షసుల కథ)
బ్రాహ్మణుడు – రాక్షసులు: చాలా పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్త్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సకల శాస్త్ర పారంగతుడు, అసత్యాలు పలకనివాడు, అన్ని భూతముల యందు దయ గలవాడు, తీర్థయాత్రలు చేసే ప్రియమైన వాడు. ఆ విప్రుడు ఒక తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ , మార్గమధ్యంలో గోదావరీ తీరాన ఉన్న ఒక ఎత్తైన మర్రిచెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు.
వారు ఎలా ఉన్నారంటే:
- కారు నలుపు
- ఎండిన డొక్కలు (పొట్టలు)
- ఎర్రని కళ్లూ, గడ్డాలూ
- గుచ్చబడిన ఇనుప తీగల్లా పైకి నిక్కబొడుచుకున్న తలవెంట్రుకలు
- వికృతమైన ముఖాలు
- కత్తులూ, కపాలాలూ ధరించి
- సర్వజీవులకు భయంకరంగా
ఆ రాక్షసుల భయం వలన ఆ మర్రిచెట్టుకు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ల దూరంలో ఎక్కడా ఏ ప్రాణీ సంచారం ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను దూరం నుంచే చూసిన తత్త్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. వారు కూడా తనను చూడటంతో మరింత భయపడినవాడై , శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు.
శ్లో॥ త్రాహి దేవేశ లోకేశ! త్రాహి నారాయ ణావ్యయ
సమస్త భయవిధ్వం సిన్! త్రాహిమాం శరణాగతం
వ్యాసం పశ్యామి దేవేశ! త్వతోహం జగదీశ్వర ||
భావము: “దేవతలకు, లోకాలకూ కూడా యజమానివైనవాడా! నారాయణా! అవ్యయా! నన్ను కాపాడు. అన్నిరకాల భయాలనూ అంతము చేసేవాడా! నిన్నే శరణుకోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వరా! నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను. నన్ను కాపాడు, రక్షించు” అని ఎలుగెత్తి స్మరిస్తూ , రాక్షస భయంతో అక్కడి నుంచి పారిపోసాగాడు.
జ్ఞానోదయం: ఆ రాక్షస త్రయం (ముగ్గురు రాక్షసులు) అతనిని పట్టి వధించాలనే తలంపుతో అతని వెనుకనే పరిగెత్తసాగారు. ఆ బ్రాహ్మణుడికి దగ్గరవుతున్న కొద్దీ , సాత్వికమైన విప్ర తేజస్సు వారికి కనబడటం వలనా , తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామము చెవులబడటం వలనా , వెంటనే వారికి జ్ఞానోదయమైంది.
ఆ వెంటనే ఆ బ్రాహ్మణుడికి ఎదురుగా చేరుకుని , దండ ప్రణామాలను ఆచరించి , తమ వలన అతనికి కీడు కలుగబోదని నమ్మబలికి , ‘ఓ బ్రాహ్మణుడా! నీ దర్శనముతోనే మా పాపాలు నశించిపోయాయి ‘ అని మరల మరల నమస్కరించారు.
వారి నమ్రతకు తత్వనిష్ఠుడి హృదయం కుదుటపడింది. ఆయన ఇలా అన్నాడు: “మీరు ఎవరు? చేయరాని ఏ పనులను చేయడం వలన ఇలా అయిపోయారు? మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరముగా చెప్పండి. మీ భయబాధలన్నీ తొలగే దారిని చెబుతాను”.
బ్రహ్మరాక్షసుల పూర్వజన్మ కథలు
బ్రాహ్మణుడి మాటలకు, ఆ రాక్షసులలో ఒకడు తన కథను ఇలా వినిపించడం మొదలుపెట్టాడు:
- ద్రావిడుని కథ:
“విప్రోత్తమా! నేను ద్రావిడుడను. ద్రవిడ దేశంలో మంధరం అనే గ్రామానికి అధికారిని. కులానికి బ్రాహ్మణుడినే అయినా , గుణానికి మాత్రం కుటిలుడిని, వంచనామయమైన మాటలతో చమత్కరించేవాడిని. నా కుటుంబ శ్రేయస్సు కోసం , అనేకమంది విప్రుల ధనాన్ని హరించాను. బంధువులకు గానీ, బ్రాహ్మణులకు గానీ ఏనాడూ పట్టెడన్నమైనా పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా ఏడు తరాల వాళ్లు అధోగతి పాలైపోయారు. మరణానంతరం దుస్సహమైన నరకయాతనలు అనుభవించి చివరకు ఇలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. దయతో నాకు ముక్తినిచ్చే ఉపాయాన్ని చెప్పండి”. - ఆంధ్రదేశీయుని గాథ:
రెండవ రాక్షసుడు ఇలా విన్నవించుకోసాగాడు : “ఓ పవిత్రుడా! నేను ఆంధ్రుడను. నిత్యమూ నా తల్లిదండ్రులతో కలహించుచు, వారిని దూషించుచు ఉండేవాడిని. నేను నా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ , తల్లిదండ్రులకు మాత్రం చద్ది కూటిని పడవేసేవాడిని. బంధువులకు గానీ, బ్రాహ్మణులకు గానీ ఏనాడూ ఒక పూటయినా భోజనం పెట్టక , విపరీతంగా ధనార్జన చేసి, ఆ కావరంతో బ్రతికేవాడిని. ఆ శరీరం పోయాక నరకంలో పడి ఘోరాతి ఘోరమైన బాధలనుభవించి చివరకు ఇక్కడ ఇలా పరిణమించాను. ఆ ద్రావిడునికివలెనే, నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము” అని అన్నాడు. - పూజారి కథ:
అనంతరం మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి ఇలా మొరపెట్టుకోవడం మొదలుపెట్టాడు : “ఓ సదాచార సంపన్నుడా! నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విష్ణ్వాలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడనూ, అహంభావినీ, కఠినవచస్కుడనీ అయిన నేను , భక్తులు స్వామి వారికి అర్పించే కైంకర్యాలన్నిటినీ నా వేశ్యలకు అందజేసి , విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని. చివరకు గుడి దీపాలలో నూనెను కూడా దొంగిలించి , వేశ్యలకు ధారపోసి, వారితో సంభోగ సుఖాలను అనుభవిస్తూ పాపపుణ్య విచక్షణ లేకుండా ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవి చూసి , ఆ తర్వాత ఈ భూమిపై నానావిధ హీన యోనులలోనూ, నానా నీచ జన్మలనూ ఎత్తి కట్టకడకు భయంకరమైన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా! నన్ను మన్నించి , మళ్లీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని దయచేసి చెప్పవయ్యా” అని ప్రార్థించాడు.
బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట
తమ పూర్వ జన్మలలో చేసిన మహా పాపాల గురించి ఆ రాక్షసులు ఎంతగానో పశ్చాత్తాపపడుతూ ఉండగా , తత్త్వనిష్ఠుడు వారికి అభయమిచ్చి ఇలా అన్నాడు: “భయపడకండి. నాతో కలిసి కార్తీక స్నానానికి రండి. మీ సమస్త దోషాలూ నశించిపోతాయి” అని చెప్పి , వారిని తన వెంట తీసుకుని బయలుదేరాడు.
అందరూ కలిసి కావేరీ నదిని చేరుకున్నారు. అక్కడ తత్త్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి , తాను స్వయంగా ముందు స్నానం చేశాడు. ఆ తర్వాత రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు.
అనంతరం,
శ్లో॥ అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం
అస్యాం కావేర్యాం – ప్రాతః స్నాన మహం కరిష్యే ||
అనే సంకల్పములతో అతడు విధివిధానముగా స్నానం చేసి , ఆ ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా , వారు దోషాలు లేనివారుగా (విగతదోషులూ) , దివ్యమైన వేషధారణతో (దివ్యవేషులూ) అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు.
కార్తీక స్నాన మహిమపై వశిష్ఠుడి ఉపదేశం: విదేహరాజా (జనకా)! అజ్ఞానం వలన కాని, మోహం, ప్రలోభాలు వలన గాని, ఏ కారణం చేతనైనా గాని , కార్తీక మాసంలో సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానం చేసి , విష్ణువును పూజించిన వారికి నిస్సందేహంగా పది వేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది.
అందువల్ల , ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానాన్ని తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యం కాకపోతే , గోదావరిలోనైనా, మరెక్కడైనా సరే ప్రాతః స్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానం చేయరో , వాళ్లు పది జన్మలు చండాలపు యోనులలో పుట్టి , ఆ తర్వాత ఊరపందులుగా జన్మిస్తారు సుమా!
కాబట్టి , ఎటువంటి అనుమానాలకు (మీమాంసకు) నిమిత్తం లేకుండా స్త్రీలు గానీ, పురుషులు గానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతః స్నానం ఆచరించాలి.
చతుర్థాధ్యాయము: దీపారాధన మహిమ
జనకుడు అడుగుతున్నాడు: “హే బ్రహ్మర్షీ! నువ్వు ఇంతవరకూ కార్తీక మహాత్మ్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో , ఏ ఏ దానాలు చేయాలో కూడా దయచేసి తెలియజేయి”.
వశిష్ఠుడు చెప్పాడు (వశిష్ఠ ఉవాచ): అన్ని పాపాలనూ మట్టిచేసేది (మన్ను చేసేదీ) , పుణ్యాలను లెక్కించలేనన్నిగా (అగణ్యాలుగా) మార్చేదీ అయిన ఈ కార్తీక వ్రతానికి, ఫలానా ‘సంకల్పము’ అనేది హాస్యాస్పదమైన విషయము. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఈ ప్రపంచంలో ఇంకా పుట్టనే లేదు. అందువల్ల వ్రత ధర్మాలనూ, తత్ఫలాలనూ చెబుతాను విను.
దీపారాధన ప్రాముఖ్యత:
- కార్తీక మాసపు సాయంకాలము శివాలయములో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది.
- శివాలయ గోపురద్వారాల, శిఖరాల యందుగానీ , శివలింగ సన్నిధిని గానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలూ అంతరించిపోతాయి.
- ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవునేతితో గాని, నువ్వుల నూనెతో గాని, ఇప్ప-నారింజ నూనెలతో గాని దీప సమర్పణ చేస్తారో , వాళ్లు ధర్మవేత్తలు అవుతారు.
- ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్లు అత్యంత పుణ్యవంతులు అవుతారు.
- కనీసము, కాంక్షతో గాని , నలుగురి నడుమా గొప్పదనం (బడాయి) కోసం గానీ దీపాన్నిచ్చే వాళ్లు కూడా శివప్రియులు అవుతారు.
దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను.
కార్తీక దీపారాధనా మహిమ: శత్రుజిత్తు కథ
శత్రుజిత్తు జననం: పూర్వం పాంచాలదేశాన్ని పరిపాలించే ఒక మహారాజు , కుబేరుడిని మించిన సంపద కూడబెట్టుకుని ఉన్నా , కుమారులు లేని కారణంగా క్రుంగిపోయినవాడై , కురంగపాణి (శివుడు) కోసం తపస్సుకు కూర్చున్నాడు.
ఆ సమయంలో అటుగా వచ్చిన పిప్పలుడు అనే ముని , అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకుని, ‘ఓ రాజా! ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పని లేదు. కార్తీక మాసములో శివప్రీతిగా వ్రతమాచరించి , బ్రాహ్మణులను దీపదానం, దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుంది’ అని చెప్పాడు.
ఋషి వాక్యాన్ని శిరసావహించి , ఆ పాంచాలుడు తన పట్టణానికి చేరి , కార్తీక వ్రతమాచరించి , శివప్రీతి కోసం బ్రాహ్మణులకు దీపదానాలు చేశాడు. తత్ఫలంగా మహారాణి నెల తప్పి, తగిన కాలంలో పురుష శిశువును ప్రసవించింది. రాజ దంపతులు ఆ శిశువుకి ‘శత్రుజిత్తు‘ అని పేరు పెట్టారు.
శత్రుజిత్తు దుర్మార్గం: ఆ శత్రుజిత్తు రోజు రోజుకూ పెరిగి , యువకుడై, వీరుడై, వేశ్యాంగనా లోలుడై , అప్పటికీ తృప్తి చెందక , పరస్త్రీరక్తుడై , యుక్తాయుక్త విచక్షణ లేని నాస్తికుడై , శాస్త్రాలను ధిక్కరించేవాడై , వర్ణసంకర కారకుడై , హితం చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరిస్తూ స్వేచ్ఛాచారిగా ప్రవర్తించసాగాడు.
పాపం – పుణ్యం: అటువంటి సందర్భంలో , సౌందర్యరాశి, సన్నని నడుము గలది (సింహమధ్యమా) , అరటి దోనెల వంటి తొడలు గలది , పెద్ద పిరుదులు, కుచాలు, కన్నులు గలది , చిలుకవలె చక్కని పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసపడింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అసమానమైన సౌందర్యం, శౌర్యం, తేజస్సు గల ఈ యువరాజు పట్ల ఆ బ్రాహ్మణ స్త్రీకి కూడా మోజు కలిగింది.
ఆ కారణంగా , ఆమె రోజూ రాత్రి తన భర్త నిద్రపోగానే , ఒక సంకేత స్థలంలో రాజకుమారుడిని కలిసి సురత క్రీడలలో సుఖించేది. ఈ సంగతి ఆ బ్రాహ్మణుడి భర్తకు ఏదో విధంగా తెలిసిపోయింది. అది మొదలు అతనొక కత్తిని ధరించి , ఈ జంటను ప్రత్యక్షంగా చూసి, వారి గొంతులు కోయాలని తిరుగుతున్నాడు.
కార్తీక పౌర్ణమి సోమవారం: రోజులు ఇలా గడుస్తుండగా , ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి , ఆ కాముకులు తమ సురత క్రీడల కోసం ఒక శిథిలమైన శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు.
అపరరాత్రి వేళ వాళ్లు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బ్రాహ్మణ స్త్రీ తన చీర చెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదాన్ని తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెంటినీ వేసి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలు ఒకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు.
ఈ విషయం ఆ బ్రాహ్మణ స్త్రీ మొగుడికి ఎలాగో తెలిసిపోయింది. కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తునీ, ఆ తర్వాత తన భార్యనూ తెగనరికి , తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కైలాసానికి – నరకానికి: ఆ విధంగా వాళ్లు ముగ్గురూ ఆ రాత్రి అక్కడికక్కడే విగతజీవులు (ప్రాణం లేనివారు) కాగానే , పాశహస్తులైన యమదూతలు మరియు పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరుకున్నారు.
శివదూతలు రాజకుమారుడినీ, ఆ రంకులాడినీ తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలు అమాయకుడైన బ్రాహ్మణుడిని తమతో నరకము వైపు లాగుకొని పోసాగారు.
అందుకై ఆశ్చర్యపడిన బ్రాహ్మణుడు (భర్త), “ఓ శివదూతలారా! కాని పని చేసిన వారికి కైలాసభోగమా? నా వంటి సదాచారుడికి నరకయోగమా?” అని ప్రశ్నించగా , ఆ శివదూతలు ఇలా బదులిచ్చారు : “వీరు ఎంత పాపాత్ములయినా…
- ఈ రోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి,
- శివాలయంలో,
- అందునా శిథిలాలయంలో,
- శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు గనక,
వారి పాపాలూ, నేరాలూ నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసములో, అందునా పౌర్ణమినాడు, పైగా సోమవారమునాడు దేవాలయములో దీపారాధన చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్లని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే, నీకు నరకము – వీరికి కైలాసము” అని చెప్పారు.
శత్రుజిత్తు వాదన: బ్రాహ్మణుడికీ, శివపారిషదులకూ జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని, ‘అయ్యలారా! దోషులము మేమై యుండగా , మాకు కైవల్యం ఇచ్చి, మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యము కాదు. కార్తీక మాసము గొప్పదైతే , అందునా పౌర్ణిమ గొప్పదయితే , సోమవారము మరీ ఘనమైనది అయితే , దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే , మాతో బాటే కలిసి మరణించిన ఆ బ్రాహ్మణునికి కూడా కైలాసం ఈయక తప్పదు‘ అని వాదించడం జరిగింది.
ఫలితం: తత్ఫలంగా , శత్రుజిత్తు తానూ, తన ప్రియురాలూ ఆచరించిన వత్తి, తైలముల పుణ్యమును తాము ఉంచుకుని , ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు ధారపోశాడు. శివదూతలు ఆ విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్లారు.
కాబట్టి, ఓ మిథిలానగరాధీశ్వరా (జనకా)! కార్తీక మాసములో తప్పనిసరిగా శివాలయంలో గాని, విష్ణ్వాలయంలో గాని దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్లు జ్ఞానులై, తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందునా, శివాలయములో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసము నెల పొడుగునా నువ్వు శివాలయములో దీపారాధన చెయ్యి.
ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు చతుర్ధాధ్యాయ స్సమాప్తః
రెండవరోజు పారాయణము సమాప్తము