Karthika Puranam Telugu
విష్ణువు దూర్వాసుడితో ఇలా పలికాడు:
“ఓ దూర్వాసా! బ్రాహ్మణుడవైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై, ప్రాయోపవిష్ణునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు. రాజు అయినందుకు గాను, గో, బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా, విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు.
రాజు ధర్మం: బ్రాహ్మణుడిని దండించరాదు
రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనమును చేయాలి. కానీ, బ్రాహ్మణుని మాత్రం దండించగూడదు.
బ్రాహ్మణో బ్రాహ్మణై రేవ నిగ్రాహ్యో వేదవాదిభిః
సత్య ధర్మాది నిరతైః లోభ దంభ వివర్జితైః
దోషియైన బ్రాహ్మణుని – వేదవిదులు, సత్యధర్మనిరతులు, లోభదంభ శూన్యులూ అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపమును చేసి, ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు – ధనహరణము లేదా వస్త్రహరణము, స్థానభ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప, రాజు శిక్షించగూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మ హత్యాపాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
దూర్వాసునితో విష్ణువు మాట
అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు – బ్రాహ్మణుడవైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్లు. తద్వారా మీ ఇద్దరికి కూడా శుభం జరుగుతుంది” అని విష్ణువు చెప్పగానే, దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు.
మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది. భయగ్రస్తుడైన దూర్వాసునిని, అతని మీదికి రానున్న సుదర్శనాన్నీ చూడగానే, అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్లి – ‘ఓ సుదర్శన చక్రమా! నన్ను మన్నించు. భయభ్రాంతుడైన వానిని, అందునా బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు’ అంటూనే ధనుర్ధారియై, ఇంకా ఇలా చెప్పసాగాడు:
‘ఆగు! ఓ విష్ణు చక్రమా, ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపడమే ప్రధానమనుకుంటే నన్ను చంపు. ఈ దూర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధముగానే ఉన్నాను. రాజులకి యుద్ధమే ధర్మముగాని, యాచన చేయడం ధర్మము కాదు. విష్ణ్వాయుథానివైన నీవు నాకు దైవస్వరూపానివే. గనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు. నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియును. అయినా, నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు. మరి కొన్నాళ్లపాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలచుకుంటే శరణాగతుడైన దూర్వాసుని వదిలి పెట్టి వెళ్లిపో. లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను’.
సుదర్శన చక్రం పరీక్ష
అని క్షాత్రధర్మపాలనకై, తనకీ దూర్వాసునికీ మధ్య ధనుర్థారియై నిలబడిన అంబరీషుణ్ని ఆప్యాయంగా చూసి, అతని ధర్మనిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది:
“అంబరీషా! నాతో యుద్ధమంటే సంబరమనుకుంటున్నావా? మహాబల మదమత్తులైన మధుకైటభుల్నీ – దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్నీ అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా, సమస్త ప్రపంచమూ కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తియైన ఈ దూర్వాసుడిప్పుడు ఇలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే – అది నా ప్రతాపమేనని మర్చిపోకు. ఉభయ తేజస్సంపన్నుడై దూర్వాసుడే నాకు భయపడుతూండగా, కేవలము క్షత్రియాహంకార కారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు. నువ్వు నన్నేం చెయ్యగలవు? క్షేమం కోరుకునే వాడు బలవంతుడితో సంధి చేసుకోవాలేగాని, ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణుభక్తుడివి కాబట్టి ఇంతవరకూ నిన్ను సహించాను. లేనిపోని బీరాలకు పోయి, వృథాగా ప్రాణాలను పోగొట్టుకోకు”.
ఈ మాటలతో అంబరీషుడి కళ్లు ఎరుపెక్కాయి.
“‘ఏమిటి సుదర్శనా? ఎక్కువగా మాట్లాడుతున్నావు. నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నానుగాని, లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండే వాణ్ని. దేవబ్రాహ్మణులైనా, స్త్రీలూ – శిశువుల మీదా, ఆవుల మీదా నేను బాణప్రయోగం చెయ్యను. నువ్వు దేవతవైన కారణంగా నీవింకా నా క్రూర నారాచఘాతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష – ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి (క్షాత్ర) ధర్మయుతంగా పురుషరూపుడివై యుద్ధము చెయ్యి” అంటూ ఆ సుదర్శనము యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబరీషుడు.
సుదర్శన చక్రం అనుగ్రహం
అతని పౌరుషానికీ, ధర్మరక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికీ సంతోషించిన సుదర్శన చక్రం సరూపితమై దరహాసమును చేస్తూ ఇలా పలికింది:
“రాజా! శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకలా ప్రసంగించానే గాని, విష్ణుభక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దుర్వాసుణ్ని వదిలివేస్తున్నా” నని చెప్పి, అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు.
అంతటితో అంబరీషుడు ఆనందితుడై – ‘సుదర్శనా! నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ, రాక్షసులను సంహరించడంలోనూ, విష్ణుతుల్య ప్రకాశమానమూ ప్రాణప్రయాణ కష్టహరణ శీలము అయిన నీ ఉత్కృష్టతకివే నా నమస్కారాలు’ అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు.
సంతసించిన సుదర్శనుడు, అంబరీషుని లేవనెత్తి అభినందించి, దీవించి, అదృశ్యమయ్యాడు.
కలియుగ కార్తీకములో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా, విన్నా – అనేక భోగాలను అనుభవించి – అంత్యాన ఉత్తమగతులను పొందుతారు.
(ఇరువది ఏడు – ఇరువది ఎనిమిది అధ్యాయములు) పదమూడవ (త్రయోదశి దిన) రోజు పారాయణము సమాప్తము