Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 23వ రోజు పారాయణ

Karthika Puranam Telugu

బృంద శాప వృత్తాంతము

అప్పుడు ఆ ముని కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆకాశం వంక చూశాడు. వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు. ముని వారికి కనుబొమలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులూ మళ్లా ఆకాశానికి ఎగిరి – అతి స్వల్ప కాలంలోనే – తెగవేయబడిన జలంధరుడి చేతులనూ, మొండెమునూ, తలనూ తెచ్చి వారి ముందుంచాయి. తన భర్త ఖండితావయవాలను చూసి బృంద ఘొల్లుమని ఏడ్చింది. అక్కడే వున్న ఋషి పాదాల పై పడి – తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది.

అందుకా ముని నవ్వుతూ ‘శివోపహతులైన వాళ్లని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు, అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను’ అంటూనే అంతర్హితుడయ్యాడు. అతనలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని, అతడు సజీవుడయ్యాడు. ఖిన్నురాలై వున్న బృందను కౌగిలించుకుని, ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్తపట్ల అనురాగంతో బృంద పులకరించి పోయింది. వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు.

మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో — బృంద – వెంటనే గుర్తు పట్టలేక పోయినా – ఒకానొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది. మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది.

‘ఓ విష్ణుమూర్తీ! పర స్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడును గాక! నీ మాయతో ఇతః పూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదరుగాక! నువ్వు భార్యా వియోగ దుఃఖితుడవై, నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో, పడి తిరుగుతూ – వానర సహాయమే గతియైన వాడివి ఆగురువుగాక!’ అని శపించి, తన నభిలషిస్తూ చేరువవుతూన్న శ్రీహరి నుండి తప్పుకుని, అగ్నిని కల్పించుకుని, అందులో పడి బూడిదై పోయింది.

అందుకు చింతించిన విష్ణువు మాటి మాటికీ ఆ బృందనే స్మరించసాగాడు. నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకుని విలపింపసాగాడు. సిద్ధులు, ఋషులు – ఎందరెన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు.

ఇరువది మూడవ (బహుళ అష్టమి) రోజు పారాయణము సమాప్తము

  • Related Posts

    Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 30వ రోజు పారాయణ

    Karthika Puranam Telugu రావిచెట్టు మరియు దరిద్రదేవత కథ సూత ప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు ఈ విధంగా ప్రశ్నించారు: “ఓ మునిరాజా! రావిచెట్టు ఎందువలన అంటరానిదయ్యింది? అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది?” అని ప్రశ్నించగా, సూతర్షి…

    భక్తి వాహిని

    భక్తి వాహిని
    Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 29వ రోజు పారాయణ

    Karthika Puranam Telugu ధనేశ్వరునకు యమదూత ఉపదేశం నారదుని హితవు మేరకు, రవంత చింతించిన రవిసుతుడు (యముడు) ధనేశ్వరునకు మోక్షం కలిగించే ఉద్దేశంతో ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి, నరకాన్ని తరింపజేయవలసినదిగా ఆదేశించాడు. ఆ యమదూత, ధనేశ్వరుని వెంటబెట్టుకుని వెళుతూ…

    భక్తి వాహిని

    భక్తి వాహిని