Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 15వ రోజు పారాయణ

Karthika Puranam Telugu

కార్తీక పౌర్ణమి: వనభోజన సంబరం

ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన, నైమిశారణ్యంలోని మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు. వారు ధాత్రీ వృక్షసంయుతమైన చక్కటి ప్రదేశాన్ని (ఉసిరిచెట్లు ఉన్న మంచి చోటును) చేరారు.

ఉసిరిచెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమని ఏర్పరచారు. వారు ఉసిరికలతో హరిని పూజించారు. అనంతరం ‘గోవింద’ నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు.

వనభోజనం తరువాత చేయవలసిన ఇతర కర్మలను నిర్వహించుకుని, సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్నవారై , మునులు తులసీ బృందావనాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడ విష్ణువును తిరిగి కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు. ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠాదుల్ని కూడా చేశారు.

మునులందరూ ‘ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః’ అంటూ నమస్కరించి , దీపారాధనలను చేశారు.

షోడశోపచార పూజ, దీప సమర్పణ

వారు విష్ణువును షోడశోపచారాలతోనూ పూజించారు. ఆ ఉపచారాలు ఏవనగా: ధ్యానావాహన, ఆసన, ఆర్ఘ్య, పాద్య, ఆచమన, మథుపర్క, స్నాన, వస్త్ర, ఆభరణ, గంధ, పుష్పాక్షత, ధూపదీప నైవేద్యాదులు, పుష్పహారాలంకరణ, నమస్కారాలు.

అంతేకాకుండా, వారు విష్ణువుకు ఎదురుగా చిలవలు పలవలు లేని మంచి కలపస్తంభాన్ని నాటి , దాని మీద శాలివ్రీహి ధాన్య తిలాదుల (వరి, నువ్వులు మొదలైన ధాన్యాల) ను పోసి , ఆ పైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు.

కథా స్మరణ, దానధర్మాలు

అనంతరం, వారు కార్తీక మాసాదిగా తాము చెప్పుకొనిన స్కాంద పురాణాంతర్గత విశేషాలను తిరిగి గుర్తుచేసుకున్నారు. ఆ విశేషాలు, సోమవార వ్రత, కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్యసంచయ కథా స్వరూపాలైన:

  • తత్త్వనిష్టోపాఖ్యానము
  • శత్రుజిచ్ఛరితము
  • వనభోజన మహిమ
  • దేవదత్తోపాఖ్యానము
  • అజామిళోపాఖ్యానము
  • మంధరోపాఖ్యానము
  • శ్రుత కీర్త్యుపాఖ్యానము
  • అంబరీషోపాఖ్యానము

మొదలైన వానిని పునః పునః మననం చేసుకున్నారు.

తదుపరి, మునులందరూ కూడి , యజ్ఞ దర్శనార్థమూ, సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థమూ నైమిశారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు:

  • ఉసిరికలనూ
  • కార్తీక దీపాలనూ
  • దక్షిణ తాంబూలాదులతో సహా

సమర్పించారు.

హరినామ సంకీర్తనతో రాత్రి గడిపారు

ఆ రాత్రి కాలాతిక్రమణాన్నీ కూడా లెక్క చేయకుండా (ఎంత సమయం గడిచిందో పట్టించుకోకుండా) , మునులు హరినామ స్మరణలతో, సంకీర్తనతోనూ, నృత్యగానద్యుపచార సమర్పణలతోనూ గడిపారు. భక్తి పారవశ్యంతో తన్మయులై, జన్మసాఫల్య సంతృప్తులయ్యారు సౌతశౌనకాది ముని ప్రవరులు.

పదునైదవ (పౌర్ణమి) రోజు పారాయణము సమాప్తము.

  • Related Posts

    Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 22వ రోజు పారాయణ

    Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరీ వేయించాడు. కోట్లాది సేనలతో అతడు కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న…

    భక్తి వాహిని

    భక్తి వాహిని
    Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 21వ రోజు పారాయణ

    Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు. సర్వదేవతా కృత విష్ణుస్తోత్రం నమో మత్స్య కూర్మాది నానా స్వరూపాయసదాభక్త కార్యద్యతా యార్తి హంత్రేవిధాత్రాధి సర్గస్థితి ధ్వంసకగదాశంఖ పద్మాది…

    భక్తి వాహిని

    భక్తి వాహిని