Karthika Puranam
సప్తదశాధ్యాయము – ఉద్భూత పురుషుడికి అంగీరసుడి ఆత్మజ్ఞానబోధ
పూర్వం చెప్పబడిన ఉద్భూత పురుషుడికి అంగీరసుడు ఉపదేశిస్తున్నాడు. నాయనా! ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను.
ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞానబోధ
కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యంకారణ మేవ చ
స్థూలసూక్ష్మం తథా ద్వంద్వ సంబంథో దేహముచ్చతే
కర్మబంధము, ముక్తి, కార్యము, కారణము, స్థూల సూక్ష్మము – ఈ ద్వంద్వ సంబంధితమే దేహమనబడుతుంది.
అత్రబ్రూమ స్సమాధానం కోన్యోజీవస్త్వమేవహి
స్వయం పృచ్ఛసిమాంకోహం బ్రహ్మైవాస్మి న సంశయః
జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు – ‘నేనెవర్ని?’ అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే ‘నేనే బ్రహ్మనై వున్నాను. ఇది నిశ్చయము’ అనే సమాధానమే వస్తుంది.
పురుషుడి ప్రశ్న: బ్రహ్మ జ్ఞానంపై సందేహం
పురుషుడు అంగీరసుడితో ఇలా అన్నాడు: ‘అంగీరసా! నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేనే ‘బ్రహ్మను’ అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి వుండాలి గదా!. ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడనైన నాకు – మరింత వివరముగా చెప్పమని కోరుతున్నాను.
అంగీరసుడి సమాధానం: ఆత్మ లక్షణం
అంగీరసుడు ఇలా అన్నాడు: అంతఃకరణానికీ, తద్వ్యాపారాలకీ, బుద్ధికీ సాక్షి – సత్, చిత్, ఆనందరూపీ అయిన పదార్థమే ఆత్మ అని తెలిసికొనుము.
- దేహము కుండ వలె రూపాదివత్గా వున్న పిండ శేషమూ – ఆకాశాది పంచభూతాల వలన పుట్టినదీ అయిన కారణముగా – ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప – ‘ఆత్మ’ మాత్రము కాదు.
- ఇదే విధముగా ఇంద్రియాలుగాని, అగోచరమైన మనస్సుగాని, అస్థిరమైన ప్రాణముగాని – ఇవేవీ కూడా ‘ఆత్మ’ కాదు – అని తెలుసుకో.
- దేని వలనైతే దేహింద్రియాదులన్నీ భాసమానాలవుతున్నాయో అదే ‘ఆత్మ’గా తెలిసికొని ఆ ‘ఆత్మపదార్థమే నేనై వున్నాను’ అనే విచికిత్సను పొందు.
- ఏ విధంగానైనా అయస్కాంతమణి తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా – ఇనుమును తానాకర్షిస్తుందో – అదే విధంగా – తాను నిర్వికారియై బుద్ధ్యాదులను సైతము చలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన ‘నేను’గా గుర్తించు.
- దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు భాసమానాలౌతున్నాయో – అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు.
- ఏదైతే నిర్వికారమై – నిద్రాజాగ్రత్ స్వప్నాదులనూ, వాటి ఆద్యంతాలనూ గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు.
- ఘటాన్ని ప్రకాశింప చేసే దీపం ఘటితమైనట్లే – దేహేతరమై ‘నే’నబడే ఆత్మ చేతనే దేహాదులన్నీ భాసమానాలవుతాయి.
- సమస్తమూ పట్లా ఏర్పడుతూండే అనూహ్, అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో.
- దేహేంద్రియ మనఃప్రాణాహంకారాల కంటే విభిన్నమైనదీ – జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా – అదే నీవుగా ఆ నీవే నేనుగా – నేనే నీవుగా ‘త్వమేవాహం’గా భావించు.
‘తత్త్వమసి’ వాక్యం యొక్క వివరణ
ఈ విధంగా ‘త్వం’ (నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది, తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విధిముఖంగా తచ్ఛబ్దార్థాన్ని గ్రహించాలి (‘తత్’ శబ్దానికి ‘బ్రహ్మ’ అని అర్థము).
అతద్వ్యవృత్తిరూపేణ సాక్షాద్విధి ముఖేన చ
వేదాంతానాం ప్రవృత్తిః స్యాత్ ద్విరాచార్య సుభాషితమ్
- ‘అతః’ శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచమని అర్థం. ‘వ్యావృత్తి’ అంటే – ఇది కాదు – ఇదీ కాదు – (నేతి-న+ఇతి, న+ఇతి ఇదీకాదు) అనుకుంటూ – ఒకటొకటిగా ప్రతిదానినీ కొట్టిపారవేయడం. అంటే, ఈ చెయ్యి ‘బ్రహ్మ (ఆత్మ)’ కాదు. ఈ కాలు ‘ఆత్మ (బ్రహ్మ)’ కాదు. అనుకుంటూ – ‘ఇది కాక పోతే మరి అది’ ఏది? అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే ‘బ్రహ్మ’ (ఆత్మ) అని అర్థం.
- ఇక – సాక్షా ద్విధిముఖాత్ అంటే ‘సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ’ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాలవల్లనే ‘ఆత్మ’ను అరయగలగాలి అని అర్థము.
- ఆ ‘ఆత్మ’ సంసార లక్షణావేష్టితం కాదనీ, సత్యమనీ, దృష్టిగోచరము కాదనీ, చీకటిని ఎరుగనిదనీ – లేదా – చీకటికి అవతలిదనీ, పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమనీ, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమనీ, పరిపూర్ణమనీ – పూర్వోక్త సాధనల వలన తెలుసుకో.
అబ్బాయీ! దేనినైతే ‘సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతం’ గా, వేదాలు కీర్తిస్తున్నాయో – ఆ బ్రహ్మ ‘నేనే’నని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో – అదే ఆత్మ. అదే నువ్వు. అదే నేను.
‘తదనుప్రవిశ్య’ ఇత్యాది వాక్యాల చేత జీవాత్మరూపాన జగత్ప్ర్పవేశమూ – ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము – కర్మ ఫలప్రదత్వమూ – సర్వజీవ కారణ కర్తృత్వమూ – దేనికైతే చెప్పబడుతూ వుందో – అదో ‘బ్రహ్మ’గా తెలుసుకో.
‘తత్వమసి’ – తత్ అంటే బ్రహ్మ, లేదా ఆత్మ – త్వం అంటే నువ్వే – అనగా – నువ్వే పరబ్రహ్మమని అర్థం.
ఓ జిజ్ఞాసూ! అద్వయానంద పరమాత్మయే ప్రత్యగాత్మ. ఈ ప్రత్యగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో – అప్పుడు మాత్రమే ‘తత్’ శబ్దార్థం తనేననీ, ‘త్వం’ శబ్ధము సాధనమే గాని ఇతరం గాదనీ తేలిపోతుంది.
నీకు మరింత స్పష్టముగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను. తత్త్వమసి (తత్త్వం+అసి). ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్వము అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞతా విశిష్టులైన జీవేశ్వరులను ప్రక్కనబెట్టి – లక్ష్యార్ధాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే ‘తాదాత్మ్యము’ సిద్ధిస్తుంది.
‘అహం బ్రహ్మ2స్మి’ అనే వాక్యార్థబోధ స్థిరపడే వరకూ కూడా శమ దమాది సాధన సంపత్తితో – శ్రవణమనదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శ్రుతివల్లనో, గురు కటాక్షము వల్లనో తాదాత్మ్యబోధ స్థిరపడుతుందో, అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటము దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంత కాలము ప్రారబ్ధకర్మ పీడిస్తూనే వుంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాము. దానినే ముక్తి – మోక్షము అంటారు.
అందువల్ల, ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా వుండి, తత్ఫలాన్ని దైవార్పణము చేస్తూండడం వలన ప్రారబ్ధాన్ననుసరించి ఆ జన్మలోనే గాని, లేదా – ప్రారబ్ధ కర్మ ఫలము అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్షవిద్యాభ్యాసపరులై, జ్ఞానులై, కర్మబంధాల్ని త్రెంచుకుని ముక్తులవుతారు.
నాయనా! బంధించేవి – ఫలవాంఛిత కర్మలు. ముక్తినిచ్చేవి – ఫలపరిత్యాగ కర్మలు’ అని ఆపాడు అంగీరసుడు.
అష్టాదశాధ్యాయము
ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో –
అంగీరసుడు ఇలా చెబుతున్నాడు: చక్కటి విషయాన్ని అడిగావు. శ్రద్ధగా విను. సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికేగాని, తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి, తద్వారా చిత్తశుద్ధిని పొందిన వాడై ఆత్మజ్ఞాని కావాలి.
నిత్యకర్మలు: స్నానము యొక్క ప్రాధాన్యత
దేహధారియైన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలయిన స్నానశౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి.
స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్థవత్
ప్రాతః స్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శ్రుతిచోదితమ్
స్నానము చేయకుండా చేసే ఏ కర్మ ఐనా సరే – ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందునా – బ్రాహ్మణులకు ప్రాతః స్నానము వేదోక్తమై వుంది.
కార్తీకమాస స్నానం
ప్రతి రోజునా ప్రాతః స్నానం చెయ్యలేని వాళ్లు – సూర్యసంచారము కల తులా-కార్తీక, మకర-మాఘ, మేష-వైశాఖాలలోనైనా – చెయ్యాలి. జీవితంలో ఈ మూడు మాసాలైనా ప్రాతః స్నానాలు చేసే వాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు.
చాతుర్మాస్యాది పుణ్యకాలాలలోగాని, చంద్ర సూర్యగ్రహణ పర్వాలలోగాని – స్నానము చాలా ప్రధానము. గ్రహణాలలో – గ్రహణకాల స్నానమే ముఖ్యము. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు – స్నాన సంధ్యా, జప, హోమ, సూర్యనమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి వున్నాయి. స్నానాన్ని వదలిన వాడు రౌరవ నరకగతుడై – పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు.
ఓ వివేకవంతుడా! పుణ్యకాలాలన్నింటా సర్వోత్తమమైనదీ కార్తీకమాసము. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటికంటే వెలుగు – లేనట్లుగానే కార్తీకమాసముతో సమానమైన పుణ్యకాలము గాని, కార్తీక దామోదరునికన్నా దైవముగాని లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకములో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు.
చాతుర్మాస్య వ్రతము
నాయనా! విష్ణువు లక్ష్మీసమేతుడై, ఆషాడశుక్ల దశమ్యంతంలో – పాలసముద్రాన్ని చేరి నిద్రా మిషతో శయనిస్తాడు. పునః హరిబోధినీ అనబడే కార్తీకశుక్ల ద్వాదశినాడు నిదురలేస్తాడు. ఈ నడుమ నాలుగు మాసాలనే చాతుర్మాస్య (వ్రతము) అంటారు. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ నాలుగు నెలలూ కూడా ఎవరైతే హరి ధ్యానమును, పూజలను చేస్తుంటారో వాళ్ల పుణ్యాలు అనంతమై, విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను.
నారదుడి విన్నపం, విష్ణువు పర్యటన
ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మీతో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి వుండగా – నారదుడు అక్కడకు వెళ్లి వారికి మ్రొక్కి ఇలా విన్నవించాడు: ‘హే శ్రీహరీ! భూలోకంలో వేదవిధులు అడుగంటాయి. జ్ఞానులు సైతము గ్రామ్యసుఖాలకు లోనై పోతున్నారు. ప్రజలంతా వికర్ములై వున్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడనవుతున్నాను’.
నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు, సతీసమేతుడై, వృద్ధ బ్రాహ్మణ రూపధారియై తీర్థక్షేత్రాదులలోనూ, బ్రాహ్మణ పరిషత్పట్టణాలలోనూ పర్యటించసాగాడు.
- కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు.
- కొందరు హేళన చేశారు.
- ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు.
కొందరు అభక్ష్యాలను పాపాచరణులనీ చూచిన శ్రీహరి – ప్రజోద్ధరణ చింతనామానసుడై చతుర్భుజాలతో, కౌస్తుభాది ఆభరణాలతో యధారూపాన్ని పొంది వుండగా – జ్ఞాన సిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనని ఆరాధించాడు. అనేక విధాలుగా స్తుతించాడు.
ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే సప్తదశ, అష్టాదశాధ్యాయౌ, (పది హేడు – పద్దెనిమిదీ అధ్యాయములు) తొమ్మిదవ రోజు (నవమి) నాటి పారాయణము సమాప్తము