Categories: రామాయణం

Ramayanam Story in Telugu – రామాయణం 31

రాముడు, సీత, లక్ష్మణుడు – కైకేయి మందిరానికి ప్రయాణం

Ramayanam Story in Telugu- రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు రాచవీధుల్లో నడుచుకుంటూ దశరథ మహారాజు ఉన్న కైకేయి మందిరానికి బయలుదేరారు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రజలందరూ కన్నీరు పెట్టుకున్నారు.

  • ఎక్కడో హంసతూలికా తల్పాలపై ఉండవలసిన జనకుడి కుమార్తె, దశరథుడి పెద్ద కోడలు, రాముడి భార్య సీతమ్మ, నేడు రాచవీధుల్లో పాదచారియై నలుగురూ చూస్తుండగా రాముడి వెనకాల నడుచుకుంటూ వెళ్తోంది.
  • నిన్న రాత్రి పట్టాభిషేకం జరగాల్సిన రాముడికి, నేడు అరణ్యవాసం చేయవలసిన దుస్థితి ఏర్పడింది.

ప్రజలంతా గౌరవ భావంతో చూస్తుండగా వారు దశరథ మహారాజు ఉన్న ప్రాసాదానికి చేరుకున్నారు.

రాముని విన్నపం, దశరథుని ఆవేదన

రాముడు సుమంత్రుడితో ఇలా అన్నాడు, “నేను సీతాలక్ష్మణులతో వచ్చానని నా తండ్రిగారికి తెలియజేయండి. నా ప్రాసాదంలోని సమస్త వస్తువులనూ దానం చేసి వచ్చాను. ఒక్కసారి వారిని దర్శించుకుని బయలుదేరాలనుకుంటున్నాను.”

రాముని మాటలను సుమంత్రుడు దశరథుడికి చెప్పగా, దశరథుడు ఇలా అన్నాడు:

  • “సుమంత్రా! రాముడిని లోపలికి పంపవద్దు. నా భార్యలందరినీ, కౌసల్యను తీసుకుని రమ్మను.”

కౌసల్య, సుమిత్ర, ఇతర భార్యలు ప్రాసాదంలోకి వచ్చాక, దశరథుడు సుమంత్రుడిని పిలిచి రాముడిని లోపలికి తీసుకురమ్మన్నాడు. రాముడు, లక్ష్మణుడు లోపలికి వస్తుండగా దశరథుడు వారిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళబోయి మధ్యలోనే కళ్ళు తిరిగి నేలపై పడిపోయాడు.

రాముని అభ్యర్థన, దశరథుని నిస్సహాయత

దశరథుడు తేరుకున్నాక రాముడు ఇలా అన్నాడు:

  • “తండ్రీ! మీరు కోరినట్లు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి దండకారణ్యానికి బయలుదేరుతున్నాను. నాతో పాటు సీత, నన్ను విడిచి ఉండలేక లక్ష్మణుడు కూడా వస్తున్నారు. మీరు మాకు తండ్రి, ఈ భూమికి ప్రభువులు. మాకు అనుమతినిచ్చి దండకారణ్యానికి వెళ్ళడానికి అనుగ్రహించండి.”

దశరథుడు రాముడిని పైకి లేపి, “నన్ను కైక వంచించి, ఆ రెండు వరాలు ఇవ్వకపోతే వీలు లేదని సత్యమనే పాశంతో కట్టేసింది. నేను ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. నువ్వు నన్ను ఖైదు చేసి ఈ రాజ్యాన్ని తీసుకుని రోజూ నన్ను చూస్తూ ఉండు. నిన్ను చూడకుండా నేను ఉండలేను రామా!” అన్నాడు.

రాముడు, “మీరు ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. నన్ను ఆశీర్వదించండి. నేను అరణ్యాలకు వెళ్తాను” అన్నాడు.

దశరథుడు, “సరే రామా! నువ్వు అలాగే వెళ్ళు. కానీ ఈ ఒక్క రాత్రి ఇక్కడే ఉండు. నీకు కావలసిన భోగాలన్నీ అనుభవించు. నేను కౌసల్యతో ఈ రాత్రంతా నిన్ను చూస్తూనే గడుపుతాను” అన్నాడు.

రాముడు, “ఈ రాత్రి నన్ను భోగాలు అనుభవించమంటున్నారు. కానీ పద్నాలుగు సంవత్సరాలు నేను అరణ్యవాసం చేయాలి కదా! అప్పుడు నాకు వీటిని ఎవరు ఇస్తారు? అరణ్యవాసం ముందు ఒక్క రాత్రి భోగాలు ఎందుకు? మీరు కైకకు ఇచ్చిన మాట నిలబెట్టి భరతుడికి పట్టాభిషేకం చేయించండి. నేను సంపాదించిన పుణ్యం ఏదైనా ఉంటే దాని మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. నేను ఏమీ ఆక్రోశంతో వెళ్ళడం లేదు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అవసరమైతే రాజ్యాన్ని, సీతను, సుఖాన్ని, స్వర్గాన్ని కూడా వదిలేస్తాను. నేను ఎవరికైతే పుట్టానో, ఆ తండ్రి సత్యం నిలబెట్టుకోవడంలో నా ప్రవర్తన వల్ల ఇబ్బంది పడకూడదు” అన్నాడు.

ఈ మాటలు విన్న దశరథుడు కైక వైపు అసహ్యంగా చూశాడు. కైక మాత్రం వారిని అక్కడి నుండి తొందరగా పంపించమని సైగ చేసింది.

సుమంత్రుని ఆగ్రహం, కైక తల్లి చరిత్ర

సుమంత్రుడు ఆగ్రహంతో, “ఛీ దుష్టురాలా! మహాపాపి! పర్వతాలను కదపలేనంత ధీరుడు, సముద్రంలాంటి గంభీర్యం కల మహారాజు నిన్నటి నుండి ఏడుస్తున్నాడు. నిన్ను బతిమాలుతున్నాడు. అయినా నీ మనసు కరగలేదు. నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తోంది. ఆడపిల్ల తల్లిని పోలి ఉంటుంది. కానీ నీకు నీ తల్లి పోలిక రాలేదు. నీ తల్లి గురించి మాకు తెలుసు. నీ తండ్రికి అన్ని ప్రాణుల మనసులోని విషయాలు, వాటి భాషలు అర్థం చేసుకునే విద్య తెలుసు. ఒకసారి మీ తల్లితో కలిసి పడుకొని ఉండగా, పక్కనుండి ఒక చీమ వెళ్ళిపోతూ మరో చీమతో ఏదో చెప్పింది. ఆ మాటలు విన్న కైకేయ మహారాజు నవ్వాడు. ఎందుకు నవ్వావని మీ తల్లి అడిగితే, ఆ చీమల మాటలు వింటే నాకు నవ్వొచ్చిందని చెప్పాడు. కానీ, ఆవిడ నమ్మలేదు. ఆ చీమ తనను పరిహసించిందని, ఆ మాటలు చెప్పమని పట్టుబట్టింది. ఆ విషయం చెబితే తన తల వెయ్యి ముక్కలవుతుందని రాజు చెప్పినా వినలేదు. చివరకు, రాజు ఆవిడను వదిలేశాడు. అంత మంకుపట్టు పట్టిన స్త్రీ నీ తల్లి. అందుకే నీకు ఆవిడ పోలికే వచ్చింది” అన్నాడు.

దశరథుడు, “కైకకు ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు. సుమంత్రా! కొన్ని వందల రథాలు, చతురంగ బలాలు, ఏనుగులు, గాయకులు, నాట్య బృందాలను సిద్ధం చేయండి. రాముడు ఎక్కడ విడిది చేస్తే అక్కడ మధురమైన అన్నం వండగలిగే వంటవాళ్ళను సిద్ధం చేయండి. పద్నాలుగు సంవత్సరాలు రాముడు హాయిగా గడిపి రావడానికి కావలసిన ధనరాశులు, పట్టుచీరలు, రాత్రి విడిది చేయడానికి డేరాలు పంపండి. రక్షించడానికి సైన్యాన్ని పంపండి. ఇవన్నీ రాముడు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలి” అని శాసించాడు.

కైక, “పూర్వం నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజసుడిని కట్టుబట్టలతో అడవులకు పంపించాడు. నువ్వేమో రాముడి వెనకాల చతురంగ బలాలను పంపిస్తున్నావు. నువ్వు సారమంతా రాముడి వెనకాల పంపిస్తే, మిగిలిన పిప్పిని భరతుడికి ఇస్తున్నావు. అలా అయితే మాకు ఆ రాజ్యం అవసరం లేదు” అన్నది.

సిద్ధార్థుడు అనే మంత్రి, “అసమంజసుడు పిల్లలను సరయు నదిలో తోసేసి, వారు చనిపోతే వేడుక చేసుకునేవాడు. రాముడికి అసమంజసుడికి పోలికా? రాముడి ప్రవర్తనలో ఒక్క దోషం నువ్వు చెప్పు. అలా చెప్పగలిగితే మేమే రాముడిని అరణ్యాలకు పంపించేస్తాం” అన్నాడు.

కైక ఏమీ మాట్లాడలేకపోయింది.

దశరథుడు, “ఈ కైక రాముడిలో దోషం ఎంచగలదా? కైకా! నువ్వు నన్ను వరం అడిగినప్పుడు రాముడు అరణ్యాలకు వెళ్ళాలని అన్నావు. రాముడి వెనక ఎవరూ వెళ్ళకూడదని అడగలేదు. నేను నీకు అలా వరం ఇవ్వలేదు. నువ్వు నాకు ఎదురు చెప్పలేవు. నేను శాసించినట్లు చతురంగ బలాలు రాముడి వెనకాల వెళతాయి” అన్నాడు.

రాముడు, “నేను తపస్వినై జీవించడానికి అరణ్యాలకు వెళుతుంటే నా వెనకాల చతురంగ బలాలు, రథాలు, ఏనుగులు ఎందుకు? నాకు ఇవేమీ వద్దు. నాకు నారచీరలు పట్టుకొచ్చి ఇవ్వండి. నేను వాటిని కట్టుకుని వెళతాను” అన్నాడు.

కైక సంతోషంతో మూడు జతల నారచీరలు తెచ్చి రాముడికి ఇచ్చింది. రాముడు, లక్ష్మణుడు లోపలికి వెళ్ళి మునులు ఎలా కట్టుకుంటారో అలా నారచీరలు కట్టుకుని వచ్చారు. కైక పట్టుచీర కట్టుకొని ఉన్న సీతమ్మ చేతిలో నారచీర పెట్టింది.

వశిష్ఠుని ఆగ్రహం, సీతమ్మకు పట్టాభిషేకం

వశిష్ఠుడు, “పాపివైన కైకా! నువ్వు శృతి తప్పుతున్నావు. ఊరుకున్న కొద్దీ అవధి మించి ప్రవర్తిస్తున్నావు. ఇదే ముహూర్తానికి రాముడి ఆత్మ అయిన సీతమ్మకు నేను పట్టాభిషేకం చేస్తాను. రాముడు తిరిగి వచ్చే వరకు సీతమ్మ రాజ్యాన్ని ఏలుతుంది. సీతమ్మకు నారచీరలు ఇవ్వడానికి నీకున్న అధికారమేమిటి? నువ్వు రాముడిని అరణ్యాలకు వెళ్ళమని అడిగావు. దశరథుడు ఆ కోరికను అంగీకరించాడు. రాముని వెనకాల పతిధర్మంతో వెళుతున్న సీతమ్మకు నారచీరలు ఇచ్చి నువ్వు ఘోరమైన దోషం చేశావు. నువ్వు ఆకాశానికి ఎగిరి అక్కడి నుండి కింద పడిపో, భూమి మీద అడ్డంగా పడిపో, ఎగిరి గంతులు వెయ్యి. కానీ తన వంశమేమిటో, తన వంశంలో పుట్టిన రాజుల చరిత్ర ఏమిటో భరతుడికి తెలుసు. భరతుడు రేపు రాజ్యాన్ని తీసుకోడు. అప్రతిష్ట అంతా నీ మీద పడుతుంది” అన్నాడు.

సీతమ్మ నారచీరలు కట్టుకుందామని వెళ్ళి, అవి కట్టుకోవడం చేతకాక కన్నీరు పెట్టుకుని నిలబడితే రాముడు సీతమ్మ చీర మీదనే నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడు. కైక దురాగతాన్ని ఆపేవాడు ఎవరూ లేరా? అని దశరథుడి మూడు వందల మంది భార్యలు గుండెలు బాదుకుని ఏడ్చారు.

దశరథుడు, “కైకా! ఆమె జనకుని కూతురు, నాకు కోడలిగా వచ్చింది. సీతమ్మను అరణ్యాలకు పంపమని నేను నీకు ఎన్నడూ వరం ఇవ్వలేదు. పతిని అనుసరించి ఆమె తన పాతివ్రత్యాన్ని చాటుకుంది” అని తన కోశాధికారిని పిలిచి, పద్నాలుగు సంవత్సరాలు సీతమ్మ కట్టుకోవడానికి కావలసిన చీరలు, ఆభరణాలు తెప్పించాడు.

వశిష్ఠుడు, “రామా! సీతమ్మకు ఆ నారచీర కట్టవద్దు. ఆమె పట్టుచీరతోనే వస్తుంది” అన్నాడు.

వారు దశరథుడికి, కౌసల్యకు నమస్కారాలు చేసి వెళుతుండగా, దశరథుడు మూర్ఛపోయాడు. కొంతసేపటికి తేరుకుని, రాముడిని రాజ్య సరిహద్దులు దాటే వరకు రథం మీద తీసుకువెళ్ళమని సుమంత్రుడికి చెప్పాడు. కోశాధికారిని పిలిచి సీతమ్మ కట్టుకునే చీరలు, ఆభరణాలు రథంలో పెట్టమన్నాడు.

కౌసల్య, సుమిత్రల ఉపదేశం

కౌసల్య సీతమ్మను కౌగలించుకుని, “అమ్మ సీతా! నీకు తెలియనిది కాదు. అత్తగారిగా చెబుతున్నాను. ఈ రోజు రాముడు యువరాజ పట్టాభిషేకం పొందవలసినవాడు. కానీ నారచీర కట్టుకుని అరణ్యవాసానికి వెళుతున్నాడు. ఇలాంటి స్థితిలో రాముడిని తక్కువగా చూడవద్దు. అలాగే కుల స్త్రీకి భర్త ఒక్కడే స్వర్గం, ధనం, ధాన్యం కంటే గొప్పవాడు” అన్నది.

సీతమ్మ, “మీరు చెప్పిన విషయాలన్నీ నేను పుట్టింట్లో తెలుసుకునే అత్తవారింటికి వచ్చాను. నేను మీ అబ్బాయిని ఎన్నడూ కష్టపెట్టను. అరణ్యవాస కష్టం తెలియకుండా ఆయన్ను ఆనందింపజేయడానికే నేను వారితో వెళుతున్నాను. వీణలో తీగలు లేకపోతే వీణ లేదు, చక్రం లేకపోతే రథం లేదు. నూరుగురు కుమారులు ఇచ్చే సుఖం కంటే భార్య భర్త దగ్గర పొందే సుఖం గొప్పది” అన్నది.

లక్ష్మణుడు సుమిత్రకు ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తే, ఆవిడ, “లక్ష్మణా! నువ్వు అరణ్యవాసం కోసమే జన్మించావు. రాముడిని ప్రేమించేవారు ఇంత మంది ఉన్నా తమ సంసారాలను వదిలి ఎవరూ రాలేదు. రాముడి సేవ చేసుకునే అదృష్టం నీకే దక్కింది. నువ్వు ఏమరుపాటు లేకుండా సీతారాములను రక్షిస్తూ ఉండు. రాముడిని నీ తండ్రిగా, సీతమ్మను నీ తల్లిగా, వారు ఉన్న అడవిని అయోధ్యగా భావించి సుఖంగా వెళ్ళు” అన్నది.

ఈ కథనం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అదనపు సమాచారం కోసం మీరు ఈ లింక్‌ను చూడవచ్చు

అంశంవివరాలు
రాముడుధర్మాన్ని పాటించేందుకు సిద్ధపడ్డాడు
సీతమ్మభర్త రాముని అనుసరించి వెళ్ళడానికి సిద్ధమయ్యింది
లక్ష్మణుడుఅన్న రాముని సేవ చేసేందుకు సిద్ధపడ్డాడు

https://youtu.be/bqDv7hjsgN8

bakthivahini

Share
Published by
bakthivahini

Recent Posts

Lakshmi Ashtottara Shatanamavali in telugu | శ్రీలక్ష్మీ అష్టోత్తరం

Lakshmi Ashtottara Shatanamavali శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళిఃఓం ప్రకృత్యై నమఃఓం వికృత్యై నమఃఓం విద్యాయై నమఃఓం సర్వభూతహితప్రదాయై నమఃఓం శ్రద్ధాయై…

1 week ago

Simhachalam Giri Pradakshina 2026 | సింహాచలం గిరి ప్రదక్షిణ

Simhachalam Giri Pradakshina 2026 ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక నిలయం, విశాఖపట్నం తీరంలో వెలసిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ వరాహ…

4 weeks ago

చాతుర్మాస్య దీక్ష | Chaturmasya Deeksha 2026

చాతుర్మాస్య దీక్ష మన జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులను నింపి, మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే అత్యంత పవిత్రమైన కాలం…

4 weeks ago

Tholi Ekadasi 2026: Life Reset Secrets in Telugu

Tholi Ekadasi 2026 మన సనాతన ధర్మంలో పండుగలకు, వ్రతాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందులోనూ ఆషాఢ శుద్ధ ఏకాదశి…

4 weeks ago

Varahi Navaratri 2026 | వారాహి దేవి నవరాత్రులు

Varahi Navaratri 2026 జీవితంలో ఎంత కష్టపడినా ఫలితం కనిపించనప్పుడు, ఇంట్లో ప్రశాంతత కరువై ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నప్పుడు మనసు…

1 month ago

సంకష్టహర చతుర్థి 2026 ప్రత్యేకం – గణపతి ఆశీస్సులతో విజయం వైపు అడుగులు

సంకష్టహర చతుర్థి 2026 జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలను తొలగించి, ధైర్యాన్ని, తెలివితేటలను ప్రసాదించే దేవుడు గణపతి. ప్రతి నెలా…

2 months ago