Categories: రామాయణం

Ramayanam Story in Telugu – రామాయణం 32

అయోధ్య నుండి చిత్రకూటం వరకు

Ramayanam Story in Telugu- రాముడు సీతమ్మ, లక్ష్మణుడితో కలిసి రథమెక్కి అడవికి బయలుదేరాడు. రాముడు వెళ్ళిపోతున్నాడని తెలుసుకున్న అయోధ్య నగరవాసులంతా దుఃఖంతో మునిగిపోయారు. యజ్ఞాలు చేస్తున్నవారు వాటిని మధ్యలోనే ఆపి, రాముడిని అనుసరించారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు “రామా! రామా!” అంటూ దుఃఖంతో రోదించారు. పక్షులు తమ పిల్లలకు ఆహారం తీసుకురావడం మరచిపోయి, తమ గూళ్ళలో కన్నీళ్ళు కారుస్తూ నిలబడ్డాయి. అశ్వశాలలోని గుర్రాలు, గజశాలలోని ఏనుగులు కన్నీరు కారుస్తూ, సకిలిస్తూ, గర్జిస్తూ ఉన్మాదంతో అటూ ఇటూ తిరిగాయి. సమస్త జీవరాశి ఒక విధమైన సంక్షోభానికి గురైంది.

అయోధ్య వాసుల విషాదం

రథం వెళుతుండగా, కౌసల్య దేవి గాలిలోకి చేతులు ఊపుతూ, పెద్దగా అరుస్తూ, తన పవిటకొంగు జారిపోయినా పట్టించుకోకుండా, ఆపుదామని వచ్చిన వారిని తోసేస్తూ రథం వెనుక పరుగెత్తింది. మరోవైపు, దశరథుడు “ఆగు! ఆగు!” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. తన తల్లిదండ్రులను అలా చూడలేక, రాముడు రథం నడుపుతున్న సుమంత్రుడిని వేగంగా నడపమని చెప్పాడు.

“నేను చక్రవర్తిని ఆజ్ఞాపిస్తున్నాను, సుమంత్రా! రథం ఆపు!” అని దశరథుడు అన్నాడు. రెండు చక్రాల మధ్యలో పడిన ప్రాణి పరిస్థితి ఎలా ఉంటుందో, సుమంత్రుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. రాముడు సుమంత్రుడితో, “నువ్వు తిరిగి వెళ్ళాక, రథం ఎందుకు ఆపలేదని దశరథుడు అడిగితే, చక్రాల శబ్దం వల్ల మీ మాటలు వినపడలేదని చెప్పు. ఇప్పుడు రథం వేగంగా నడుపు” అని చెప్పాడు. రథం ముందుకు సాగిపోయింది.

అందరూ రాముడి వెనకాలే వెళ్ళి ఆయనతోనే ఉందామని, పిల్లలు, వృద్ధులు, ఆవులను కూడా తీసుకెళ్దామని అనుకున్నారు. అందరూ వెళ్ళిపోతే దశరథుడు, ఆయన భార్యలు, చతురంగ బలగాలు కూడా వస్తారని అనుకున్నారు. అందరూ అడవులకు వెళితే, అడవి అయోధ్య అవుతుందని, అందరినీ చూసి భయపడిన జంతువులు అయోధ్యకు వస్తాయని, కైకేయి తన కుమారుడితో ఆ క్రూరమృగాలను పాలిస్తుందని అనుకున్నారు. అందరూ రాముడి వెంట బయలుదేరారు. రాముడి రథం వేగాన్ని అందుకోలేక చాలామంది వెనుదిరిగారు.

తమసానది తీరంలో విశ్రాంతి

తన వెనుక వృద్ధులైన బ్రాహ్మణులు పరుగెత్తుకుంటూ వస్తున్నారని తెలుసుకున్న రాముడు, రథం దిగి వారితో కలిసి నడవడం ప్రారంభించాడు. అందరూ తమసానది తీరానికి చేరుకుని, ఆ రాత్రి అక్కడే గడిపారు. అంత దూరం నడిచి రావడంతో అందరూ గాఢంగా నిద్రపోయారు. రాముడు వెళ్ళిన తరువాత స్పృహ కోల్పోయిన దశరథుడు నెమ్మదిగా తేరుకున్నాడు. సేవకులను పిలిచి తనను కౌసల్య మందిరానికి తీసుకువెళ్లమని చెప్పాడు.

“సకల గుణాలు కలిగిన కౌసల్య ఉండగా, కామమోహంతో కైకేయిని తెచ్చుకున్నాను. ఈరోజు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాను” అని ఏడ్చి ఏడ్చి ఆయన కళ్ళు కనిపించకుండా పోయాయి. ఆయన కౌసల్యతో, “నేను ఎక్కువసేపు బతకను, నేను చనిపోయేలోపు రాముడు నన్ను తాకలేడు. రాముడితో పాటే నా చూపు పోయింది. కాబట్టి, రాముడి తల్లివైన నువ్వు నన్ను ఒకసారి తాకు. రాముడు తాకినట్లు ఉంటుందేమో, నన్ను ఒకసారి తాకు కౌసల్యా” అని అన్నాడు.

“అవునులే, కన్న కొడుకుని అడవులకు పంపావు. ఈరోజు నన్ను ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో పడేశావు. నీ వల్ల దేశమంతా బాధపడుతోంది. ఇప్పటికైనా నీకు సంతోషంగా ఉందా రాజా?” అని కౌసల్య అంది.

“పడిపోయిన గుర్రాన్ని ఎందుకు పొడుస్తావు కౌసల్యా? నీ దగ్గర ఉపశమనం పొందుదామని వచ్చాను. నువ్వు కూడా ఇలా అన్నావా?” అని దశరథుడు మళ్ళీ మూర్ఛపోయాడు.

రాముని ప్రణాళిక

తెల్లవారుతుండగా, రాముడు సుమంత్రుడిని పిలిచి, “ఈ వృద్ధ బ్రాహ్మణులంతా నా మీద ప్రేమతో నా వెనకాల వచ్చారు. వీరు నాతో పద్నాలుగు సంవత్సరాలు అడవికి వస్తే బాధపడతారు. కాబట్టి, నేను కనిపించకపోతే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉండగానే మనం వెళ్ళిపోవాలి. వీళ్ళు వెనక్కి వెళ్ళకుండా రాముడు ఎటు వెళ్ళాడో గుర్తుపట్టడానికి రథచక్రాల వెనక వస్తారు. కాబట్టి, రథాన్ని ముందు ఉత్తర దిక్కుకు పోనివ్వు. ఉత్తర దిక్కున అయోధ్య ఉంది. అలా కొంత దూరం పోనిచ్చాక, రథాన్ని వెనక్కి తిప్పి గడ్డి మీద, పొదల మీద నుంచి పోనిచ్చి తమసానదిని దాటించు. అప్పుడు వారికి రథచక్రాల గుర్తులు కనిపించక, వారంతా అయోధ్యకు వెళ్ళిపోతారు” అని చెప్పాడు.

తెల్లవారగానే, నిశ్శబ్దంగా ఉత్తర దిక్కుకు రథాన్ని పోనిచ్చి, మళ్ళీ అదే దారిలో వెనక్కి వచ్చి తమసానదిని దాటి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. తెల్లవారగానే బ్రాహ్మణులందరూ నిద్రలేచి, “రాముడు ఎక్కడ?” అని అడిగారు. రాముడు కనిపించకపోవడంతో, రథచక్రాల గాడిని బట్టి వెళదామని బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక, రథచక్రాల జాడలు ఆగిపోయాయి. చేసేదేమీ లేక, బాధపడుతూ అయోధ్యకు వెళ్ళారు.

అయోధ్యలో విషాదం

రాముడు వెళ్ళిపోయాడని అయోధ్య పట్టణంలో ఒక్కరు కూడా అన్నం వండుకోలేదు. ఏ ఇంటి ముందు కూడా కళ్ళాపి జల్లలేదు. ఎవరూ ముగ్గు వేయలేదు. ఆ రాజ్యంలో ఏ ఒక్క జీవి కూడా ఆనందంగా లేదు. ఆ రాజ్యంలో సంతోషంగా ఉన్న ఏకైక జీవి కైకేయి. రాముడు తమసానదిని దాటాక, వేదశృతి, గోమతి మొదలైన నగరాలను దాటి, కోసల రాజ్య సరిహద్దుకు చేరుకున్నాడు. అక్కడ రథం దిగి అయోధ్య నగరానికి నమస్కరించి, “ఓ అయోధ్య! పూర్వం మా కాకుత్స వంశంలోని ఎందరో రాజులు నిన్ను పాలించారు. అలాంటి అయోధ్య నగరాన్ని విడిచి, ధర్మానికి కట్టుబడి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకు వెళుతున్నాను. తిరిగి నేను ఈ అయోధ్య నగరంలో ప్రవేశించి మా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించే అదృష్టాన్ని నాకు ప్రసాదించు” అని వేడుకున్నాడు.

వారు కోసల దేశ సరిహద్దులను దాటి గంగానది తీరానికి చేరుకున్నారు. అక్కడ ఒక ఇంగుదీ (గార) వృక్షం నీడలో అందరూ కూర్చున్నారు.

గుహుని ఆతిథ్యం

రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకుని, ఆ ప్రాంతాన్ని (శృంగిబేరపురం) పాలిస్తున్న రాముని స్నేహితుడు గుహుడు పరుగుపరుగున వచ్చి రాముడిని కౌగలించుకుని, “రామా! ఇది కూడా నీ రాజ్యమే, నీ అయోధ్య అనే అనుకో. నీ కోసం రకరకాల పదార్థాలు, అన్నరాశులు తెచ్చాను, తీసుకో” అని అన్నాడు.

రాముడు, “గుహా! మా అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు. కానీ, నువ్వు నా కోసం పరుగెత్తుకుంటూ వచ్చి, ఈ రాజ్యం కూడా అయోధ్యే అన్నావు కదా! అప్పుడే నా కడుపు నిండిపోయింది. మా నాన్నగారికి ఈ గుర్రాలు అంటే చాలా ఇష్టం. అవి మమ్మల్ని ఇంత దూరం తీసుకువచ్చి అలసిపోయాయి. వాటికి కావలసిన గడ్డి, మొదలైనవి ఇవ్వమని” అన్నాడు.

గుర్రాలు విశ్రాంతి తీసుకున్నాక, సీతారాములు ఆ ఇంగుదీ వృక్షం కింద పడుకున్నారు. గుహుడు లక్ష్మణుడిని కూడా పడుకోమనగా, “రాముడు నేల మీద పడుకుని ఉండగా, నాకు నిద్ర ఎలా వస్తుంది? దేవతలు, రాక్షసులు కలిసి యుద్ధానికి వస్తే వారిని నిగ్రహించగల మొనగాడు మా అన్నగారు, మా అన్నయ్య, సీతమ్మతో కలిసి ఇలా పడుకుని ఉంటే నేను ఎలా పడుకోగలను?” అన్నాడు.

గంగానదిని దాటడం, జటలు ధరించడం

మరునాడు ఉదయం గుహుడు తెచ్చిన పడవ ఎక్కి సీతారామలక్ష్మణులు గంగను దాటడానికి సిద్ధమయ్యారు. సుమంత్రుడు రాముడిని “నేను ఏం చేయాలి?” అని అడగగా, రాముడు, “నువ్వు తిరిగి అయోధ్యకు వెళ్ళి మా తండ్రిగారికి, ముగ్గురు తల్లులకు నా నమస్కారాలు చెప్పు. కౌసల్యను ఎల్లప్పుడూ దశరథుడిని సేవించమని చెప్పు. భరతుడిని కుశలమా అని అడిగానని చెప్పు. వృద్ధుడైన చక్రవర్తిని ఏ కారణం చేత బాధపెట్టవద్దని చెప్పు. తండ్రి మనసుకు అనుగుణంగా పాలించమని చెప్పు” అన్నాడు.

సుమంత్రుడు, “రామా! నేను మీతోనే వస్తాను, మీ సేవ చేసుకుంటాను. ఏ రథం మీద మిమ్మల్ని అడవులకు తీసుకువచ్చానో, అదే రథం మీద మిమ్మల్ని పద్నాలుగు సంవత్సరాల తరువాత అయోధ్యకు తీసుకువెళ్తాను” అన్నాడు. “నువ్వు నాతో వస్తే కైకేయికి అనుమానం వస్తుంది. రాముడు అరణ్యవాసం చేయకుండా రథం మీద తిరుగుతున్నాడు అనుకుంటుంది. కాబట్టి, నువ్వు ఖాళీ రథంతో వెనక్కి వెళ్ళి, రాముడు గంగను దాటి అరణ్యాలకు వెళ్ళాడని చెప్పాలి. అప్పుడు ఆమె సంతోషిస్తుంది. కాబట్టి, నువ్వు బయలుదేరాలి” అని రాముడు అన్నాడు. వెంటనే సుమంత్రుడు అయోధ్యకు బయలుదేరాడు.

రాముడు గుహుడిని పిలిచి, “నేను ఒక తపస్విలా బతకాలి. కాబట్టి, నా కోసం మర్రి పాలు తీసుకురా” అని అన్నాడు. రాముడు గుహుడిని మర్రి పాలను తన తల మీద, లక్ష్మణుడి తల మీద పోయమన్నాడు. మర్రి పాలు పోశాక, జిగురుతో ఉన్న ఆ జుట్టును జడలుగా కట్టుకున్నాడు. అక్కడ ఉన్నవారందరూ రాముడి ధర్మనిష్ఠకు ఆశ్చర్యపోయారు. రాముడు, “నేను ఈ పద్నాలుగు సంవత్సరాలు నా క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ బ్రహ్మచర్యంతో కూడిన అరణ్యవాసం చేస్తాను” అన్నాడు. రాముడు లక్ష్మణుడిని పిలిచి, “నీ వదినను ముందు పడవ ఎక్కించి, నువ్వు ఎక్కు” అని చెప్పి, వారు పడవ ఎక్కాక ఆయన కూడా పడవ ఎక్కాడు. సీతారామలక్ష్మణులు గంగను దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళారు. అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళాక, చీకటి పడేసరికి వారందరూ ఒక చెట్టు కింద విడిది చేశారు.

లక్ష్మణుని భక్తి

రామలక్ష్మణులు వెళ్ళి మూడు మృగాలను సంహరించి, వాటిని అగ్నిలో కాల్చి ముగ్గురూ ఆ మాంసాన్ని తిన్నారు. తరువాత అక్కడే పడి ఉన్న ఎండుటాకుల మీద పడుకున్నారు. రాముడు లక్ష్మణుడిని పిలిచి, “భరతుడు యువరాజ పట్టాభిషేకం చేసుకున్నాక కౌసల్యను, సుమిత్రను బంధిస్తాడు. కాబట్టి, నువ్వు బయలుదేరి అయోధ్యకు వెళ్ళిపో” అన్నాడు.

రాముడి మాటలు విన్న లక్ష్మణుడు, “తప్పకుండా వెళ్ళిపోతాను అన్నయ్యా! ఈ మాట నాకు చెప్పినట్టు నిద్రపోతున్న సీతమ్మకు కూడా చెప్పు. సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదు. ఆ విషయం నీకు తెలుసు కనుక సీతమ్మను వెనక్కి వెళ్ళి కౌసల్య, సుమిత్ర, దశరథులకు సేవ చేయమని నువ్వు ఆజ్ఞాపించవు. నిన్ను విడిచిపెట్టి నేను ఉండగలనని అనుకుంటున్నావు. అందుకే నన్ను వెళ్ళిపోమంటున్నావు. నీటిలో ఉన్న చేపపిల్లని పైకి తీసి ఒడ్డున పారేస్తే తన ఒంటికి తడి ఉన్నంతవరకు ప్రాణములతో ఉండి, ఒంటి తడి ఆరిపోగానే ఎలా ప్రాణాలను వదులుతుందో, అలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ నిన్ను చూస్తూ నువ్వు ఎంతసేపు కనిపిస్తావో అంతసేపు ప్రాణములతో ఉండి, నువ్వు కనిపించడం మానేయగానే ఈ ప్రాణాలను విడిచిపెడతాను” అన్నాడు.

“లక్ష్మణా! అరణ్యవాసంలో మళ్ళీ నిన్ను ఈ మాట అడగను, నువ్వు నాతోనే ఉండు” అని రాముడు అన్నాడు.

భరద్వాజ ఆశ్రమం, చిత్రకూటం

మరునాడు ఉదయం కొంత దూరం ప్రయాణించగా, వారికి అక్కడ భరద్వాజ ముని ఆశ్రమం కనిపించింది. ఆశ్రమంలో త్రికాలవేది అయిన భరద్వాజుడు శిష్యులకు వేద పాఠాలు చెబుతూ కాలం గడుపుతున్నాడు. రాముడు ఆశ్రమంలోకి ప్రవేశించి, తనను తాను పరిచయం చేసుకుని, తన భార్యను, సోదరుడిని పరిచయం చేసి, భరద్వాజునికి నమస్కారం చేసి, కుశల ప్రశ్నలు అడిగాడు. ఆ రాత్రి ఆశ్రమంలో గడిపాక, మరునాడు ఉదయం భరద్వాజుడు రాముడిని అరణ్యవాసం తన ఆశ్రమంలోనే గడపమని చెప్పాడు.

రాముడు, “మీ ఆశ్రమం మా రాజ్యానికి దగ్గరలోనే ఉంది. నేను ఇక్కడే ఉంటే జానపదులు నన్ను చూడడానికి వస్తుంటారు. నేను రాజ్యానికి దగ్గరలోనే ఉండిపోయానని కైకేయికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి, నిర్జనమై ఎవరూ లేని చోటుకు వెళ్ళిపోతాను. క్రూరమృగాల వల్ల, రాక్షసుల వల్ల ప్రమాదం లేని ఒక యోగ్యమైన ప్రదేశాన్ని మీరు నిర్ణయిస్తే, మేము అక్కడ పర్ణశాల నిర్మించుకుంటాము” అన్నాడు.

భరద్వాజ మహర్షి, “ఇక్కడి నుంచి బయలుదేరి యమునానదిని దాటాక కొంచెం ముందుకు వెళితే మీకు ఒక గొప్ప మర్రిచెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుకు ఒకసారి నమస్కారం చేసి ముందుకు వెళితే నీలం అనే వనం కనిపిస్తుంది. ఆ వనంలో మోదుగ చెట్లు, రేగు చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వెళితే ఎక్కడ చూసినా నీళ్ళు, చెట్లు కనిపిస్తాయి. అక్కడ నుంచి చూస్తే చిత్రకూట పర్వతాల శిఖరాలు కనిపిస్తాయి. మీరందరూ ఆ చిత్రకూట పర్వతాలను చేరుకోండి. అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది. ఆ పక్కన మీకు అనువైన స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించుకోండి. ఆ ప్రదేశంలో ఏనుగులు, కొండముచ్చులు, కోతులు, బంగారు చుక్కలు గల జింకలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది. స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ అరణ్యాలకు నేను చాలాసార్లు వెళ్ళాను. అక్కడ కార్చిచ్చు పుట్టదు. మీరు అక్కడ పర్ణశాల నిర్మించుకోండి” అని అన్నాడు.

Ramayanam Story in Telugu- మరింత సమాచారం కోసం

https://youtu.be/bqDv7hjsgN8

bakthivahini

Share
Published by
bakthivahini

Recent Posts

Chandanotsavam 2026 Date, Timings, Darshan Details & Significance – Complete Guide

Chandanotsavam 2026 ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన సింహాచలం ఆలయంలో జరిగే 'చందనోత్సవం' వేడుక, భక్తులకు అత్యంత…

2 weeks ago

Akshaya Tritiya 2026 Date, Time, Pooja Vidhanam & Benefits | Complete Guide

Akshaya Tritiya 2026 Date, Time మన భారతీయ సంస్కృతిలో కొన్ని రోజులు సాధారణంగా కాకుండా, ఆధ్యాత్మికంగా చాలా గొప్ప…

2 weeks ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 39 శ్లోకం

Bhagavath Geetha Telugu సాధారణంగా మనకు ఒక అలవాటు ఉంటుంది; మన దగ్గర ఉన్న వంద మంచి విషయాలను వదిలేసి,…

3 weeks ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 38 శ్లోకం

Bhagavath Geetha Telugu చాలామంది నిత్యం ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉంటారు, కానీ రోజు చివరలో "నేను…

3 weeks ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 37 శ్లోకం

Bhagavath Geetha Telugu జీవితంలో మనం తరచుగా మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటాం. ఇతరుల విజయాలతో మనల్ని పోల్చుకుంటూ,…

3 weeks ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 36 శ్లోకం

Bhagavath Geetha Telugu కొంతమంది వ్యక్తులు ఒక గదిలోకి రాగానే అక్కడ ఉన్న వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. అందరి…

4 weeks ago