Categories: రామాయణం

Ramayanam Story in Telugu – రామాయణం 34

భరతుడికి కలలో దర్శనం

Ramayanam Story in Telugu- భరతుడు మేల్కొన్న వెంటనే ఒక భయంకరమైన కల అతడిని కలవరపెట్టింది. ఆ కల అతడి మనస్సును అశాంతికి గురిచేసింది, అతని ముఖంలో తేజస్సును తగ్గించింది. అతని స్నేహితులు ఈ మార్పును గమనించి కారణం అడిగినప్పుడు, భరతుడు తన కలను వివరించాడు: “తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. మా తండ్రిగారైన దశరథ మహారాజు ఒక కొండపై నుండి క్రింద పడిపోయారు. అలా పడుతూ, నేరుగా పేడతో నిండిన ఒక పెద్ద గుంటలో పడ్డారు. అందులో తేలుతూ, దోసిళ్లతో నూనెను తాగుతున్నారు మరియు శరీరం అంతా పూసుకుంటున్నారు. తరువాత, ఆయన తల క్రిందికి వాల్చి ఉండగా, నేను కలలో ఒక వింత దృశ్యాన్ని చూశాను. సముద్రం పూర్తిగా ఎండిపోయి భూమిగా మారింది. ఆకాశంలోని చంద్రుడు భూమిపై పడిపోయాడు. ఈ భూమండలం అంతా బద్దలైపోయింది. అకస్మాత్తుగా చీకటి వ్యాపించింది. రాజు ఎక్కే ఏనుగు యొక్క దంతం విరిగిపోయింది. హోమంలోని అగ్ని ఒక్కసారిగా ఆగిపోయింది. దానితో పాటు, మా తండ్రిగారు ఒక ఇనుప బల్లపై కూర్చుని, ఎర్రటి వస్త్రాన్ని ధరించి, ఎర్ర చందనం రాసుకొని, ఎర్రటి పూలమాలలు వేసుకొని పూజ చేస్తున్నారు. అటువంటి సమయంలో, ఎక్కడి నుంచో నల్లటి మరియు ఎర్రటి రంగు వస్త్రాలు ధరించిన స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు. అప్పుడు మా నాన్నగారు గాడిదలు పూన్చిన రథాన్ని ఎక్కారు. ఈ స్త్రీలు ఆయన మెడలో తాడు వేసి, ఆ రథాన్ని దక్షిణ దిక్కుకు లాక్కెళుతున్నారు. తెల్లవారుజామున ఎవరు గాడిదల రథం మీద కూర్చున్నట్లు కనపడ్డాడో, వాడు చితి మీద పడుకొని ఉండగా, ఆ శరీరం కాలిపోతున్న ధూమాన్ని కొద్ది రోజుల్లోనే చూడవలసి వస్తుంది. నాకు నా తండ్రిగారి మీద బెంగ పట్టుకుంది. దానితో పాటుగా నా మీద నాకు ఎందుకో అసహ్యం వేస్తోంది. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం జరిగిందని అనిపిస్తోంది.”

దూతల రాక మరియు భరతుని ప్రశ్నలు

అయోధ్య నుండి వచ్చిన దూతలు లోపలికి వచ్చారు. వారిని చూసిన భరతుడు ఇలా అడిగాడు

  • రామమాత కౌసల్య ఆరోగ్యం: సర్వకాలములయందు ధర్మాన్ని అనుష్టానం చేస్తూ, ధర్మం తెలిసిన రామమాత కౌసల్య ఆరోగ్యంగా ఉన్నారా?
  • సుమిత్ర ఆరోగ్యం: శత్రుఘ్నుడికి, లక్ష్మణుడికి తల్లి అయిన సుమిత్ర ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉన్నారా?
  • కైక ఆరోగ్యం: కోరికలతో తిరిగే, కోప స్వభావం కలిగిన మీ తల్లి కైకకు ఎటువంటి అనారోగ్యం లేదు కదా?
  • దశరథుడు మరియు రామలక్ష్మణుల క్షేమం: దశరథుడు మరియు రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారా?

దూతలు బదులిస్తూ, “నువ్వు ఎవరెవరు క్షేమంగా ఉండాలని కోరుకున్నావో, వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు. నిన్ను తొందరలో లక్ష్మి వరించబోతున్నది. నువ్వు వెంటనే బయలుదేరి రావాలని వశిష్ఠుడు ఆదేశించాడు” అని చెప్పారు.

అయోధ్యకు భరతుని ప్రయాణం

భరతుడు తన తాతగారైన కైకేయ రాజు (ఆయన అసలు పేరు అశ్వపతి) వద్దకు వెళ్ళి తన తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకున్నాడు. కైకేయ రాజు భరతుడికి ఏనుగులు, మృగ చర్మాలు, రెండువేల బంగారు హారాలు, పదహారువందల గుర్రాలు బహుకరించాడు. మేనమామ అయిన యుధాజిత్, ఐరావతం వంశంలో జన్మించిన ఏనుగుల్ని, కంచరగాడిదల్ని, వేటకుక్కల్ని బహుకరించాడు. భరతుడు బహుమానాలన్నిటినీ వెనుక పరివారానికి అప్పగించి, తాను మాత్రం తొందరగా వెళ్లాలని కొంతమందితో కలిసి అయోధ్యకు బయలుదేరాడు. దూతలు అసలు విషయం చెప్పలేదు కనుక ఆయన వారు వచ్చిన మార్గంలో వెళ్లలేదు.

అతను సుదామ, హ్లాదిని, శతద్రువు, శిలావహ అనే నాలుగు నదులను దాటాడు. అక్కడి నుండి శల్యకర్తన నగరం, చైత్రరథ నగరం దాటాడు. సరస్వతి, గంగా నదులను దాటాడు. తరువాత వీరవత్సము అనే దేశానికి వచ్చాడు, కుళింద నదిని దాటాడు. తరువాత మహారణ్యంలోకి ప్రవేశించాడు, అక్కడి నుండి భాగీరథీ నదిని దాటాడు. తరువాత ప్రాగ్వటము అనే పట్టణానికి చేరుకున్నాడు, తరువాత కుటికోష్ఠికము అనే నదిని దాటాడు. అక్కడి నుండి ధర్మవర్ధనము, తోరణము, వరూథి అనే గ్రామాలు దాటాడు. తరువాత ఉజ్జహానము అనే నగరంలోకి వచ్చాడు. తదనంతరం సరస్వతి తీర్థం అనే గ్రామానికి వచ్చి అక్కడ ఉత్తానిక అనే నదిని దాటాడు. అక్కడి నుండి హస్తిపృష్ఠకము అనే గ్రామంలోకి ప్రవేశించి కుటిక నదిని దాటాడు. తరువాత కపివతీ అనే పట్టణానికి చేరుకున్నాడు. అక్కడి నుండి ఏకశాల అనే గ్రామానికి వచ్చాడు, తరువాత స్థాణుమతి అనే ఊరిని దాటాడు. తరువాత గోమతీ అనే నదిని దాటి ఒక రాత్రి అంతా ప్రయాణం చేసి అయోధ్యా పట్టణానికి చేరుకున్నాడు. తాతగారి దగ్గరి నుండి బయలుదేరి అయోధ్యకు రావడానికి భరతుడికి ఎనిమిది రాత్రులు పట్టాయి.

అయోధ్యలో విషాదకర వాతావరణం

ఆయన అయోధ్యకు రాగానే అక్కడున్న ప్రజల పరిస్థితిని చూసేసరికి ఆయన మనస్సు మరింత బరువెక్కింది. భరతుడిని చూడగానే అందరూ తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎవరూ సంతోషంగా కనపడలేదు. తిన్నగా దశరథ మహారాజు మందిరానికి వెళ్ళాడు. దశరథుడి కోసం అన్ని గదులు వెతికాడు. అక్కడ ఉన్న వారెవరూ సంతోషంగా లేరు. రాజు ఇక్కడ లేకపోతే మా అమ్మ కైక మందిరంలో ఉంటాడని గబగబా కైక మందిరంలోకి వెళ్ళాడు. కైకకు నమస్కారం చేశాడు. కైక భరతుడిని సంతోషంగా తన పక్కన కూర్చోబెట్టుకొని ‘చాలా సంతోషంగా గడిపావా! అందరూ ఆనందంగా ఉన్నారా! అక్కడి విశేషాలు ఏమిటో నాకు చెప్పమ’ని అన్నది.

కైక చేత దశరథుని మరణ వార్త

భరతుడు ‘అమ్మా! నాకు ఇక్కడికి రావడానికి ఎనిమిది రాత్రులు పట్టింది. అక్కడ అందరూ బాగానే ఉన్నారు. నా తండ్రిగారైన దశరథ మహారాజుగారి పాదములకు నమస్కారం చెయ్యాలని నా మనస్సు కోరుకుంటున్నది. నీ మందిరములోని ఈ తల్పము మీద వారు పడుకొని ఉండేవారు కదా! ఇప్పుడు ఇక్కడ లేరు. తండ్రిగారు కౌసల్య మందిరంలో ఉన్నారా?’ అని అడిగాడు.

ఈ మాటలు విన్న కైక చాలా తేలికగా ఇలా చెప్పింది:

యా గతిః సర్వ భూతానాం తాం గతిం తే పితా గతః
రాజా మహాత్మా తేజస్వీ యాయజూకః సతాం గతిః

“చిట్టచివరికి అన్ని ప్రాణులు ఎక్కడికి వెళ్ళిపోతాయో మీ నాన్న కూడా అక్కడికి వెళ్ళిపోయాడు.”

భరతుని దుఃఖం మరియు కైకను నిందించడం

అప్పటిదాకా తల్లి ఒడిలో కూర్చున్న భరతుడు ఈ మాట వినగానే ఒక మదించిన ఏనుగు నేల మీద పడినట్టు కిందపడిపోయి పొర్లి పొర్లి ఏడ్చాడు.

కైక ‘ఓ రాజా! నువ్వు ఇలా నేల మీద పొర్లి ఏడవచ్చా! గొప్ప గొప్ప సభలలో కూర్చోవలసిన వాడిని ఇలా నేల మీద పొర్లడమేమిటి? పైకి లేచి కూర్చో’ అన్నది.

భరతుడు “అమ్మా! నాన్నగారు చిట్టచివర ఏ వ్యాధి కలిగి వెళ్ళిపోయారు? రాముడికి పట్టాభిషేకమో లేక ఏదన్నా యజ్ఞము చేస్తున్నారేమో అందుకని నన్ను తొందరగా రమ్మన్నారని వచ్చానమ్మా! నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు రాముడు పక్కనే ఉండి ఉంటాడు. తండ్రిగారు వెళ్ళిపోతే అన్నగారు తమ్ముళ్ళకి తండ్రిలాంటి వాడని ఆర్యులు చెప్తారు కదా! నేను ఇప్పుడు రాముడి పాదములు పట్టుకుంటే దశరథ మహారాజుగారి పాదములు పట్టుకున్నంత సంతోషము కలుగుతుంది. అసలు దశరథ మహారాజు ఎలా చనిపోయారు? చనిపోయేముందు ఆయన చిట్టచివర ఏమన్నారో నాకు చెప్పమ్మా’ అన్నాడు.

కైక బదులిస్తూ, “మీ నాన్న వెళ్ళిపోయే ముందు, ‘హా! రామ, హా! లక్ష్మణా, హా! సీతా’ అంటూ చనిపోయాడు. చనిపోతూ ఈ సీతారామలక్ష్మణులు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళు ధన్యులు. నేను వాళ్ళని చూడలేను కదా! అని ఏడ్చి ఏడ్చి చనిపోయాడు” అని చెప్పింది. ఆ సమయంలో సీతారామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారు? అని భరతుడు అడుగగా, వాళ్ళ ముగ్గురూ అరణ్యములకు వెళ్ళిపోయారని చెప్పింది. అరణ్యములకు ఎందుకు వెళ్ళారు? అంటే మీ నాన్న పంపించి వేసాడని చెప్పింది.

భరతుడు ఆగ్రహంతో, ‘రాముడిని నాన్న ఎందుకు పంపించారమ్మా? రాముడు ధర్మాత్ముడు, అరణ్యములకు పంపించాలంటే కొన్ని కారణాలు ఉంటాయి. బ్రాహ్మణుల ద్రవ్యాన్ని రామచంద్రమూర్తి అపహరించాడా! పరస్త్రీని దోషబుద్ధితో చూశాడా! పరకాంతని అనుభవించాడా! యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసము చేశాడా! అప్పుడే పుట్టిన పిండాన్ని నశింప చేశాడా! రాముడు ఇలాంటి పాపములు చేసేవాడు కాదు రాముడిని అడవులకు ఎందుకు పంపించారు? రాముడితో లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడు? అసలు ఏమి జరిగిందో నాకు యధాతథముగా చెప్పు’ అన్నాడు.

కైక ఎంతో సంతోషపడిపోతూ, ‘నీకోసమే నేను ఇదంతా చేశాను. దశరథుడు రాముడికి పట్టాభిషేకము చేద్దామనుకున్నాడు. నువ్వు చెప్పిన దోషాలు రాముడియందు ఉంటాయా! పరకాంతని అనుభవించడము ఏమిటి? రాముడు పరకాంతని కన్నెత్తి చూడడు అంతటి ధర్మాత్ముడు. నీకు రాజ్యము దక్కాలని నేనే దశరథుడిని రెండు వరములు అడిగాను. పదునాలుగు సంవత్సరములు రాముడిని దండకారణ్యానికి పంపించమన్నాను. నీకు పట్టాభిషేకము చెయ్యమన్నాను. సత్యపాశములకు బద్ధుడైన నీ తండ్రి అంగీకరించాడు. రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోయాడన్న బెంగ చేత రెండు మూడు రోజులలోనే కృంగి కృశించి నశించిపోయాడు. ఇప్పుడు ఈ రాజ్యములో నిన్ను ఎదిరించగలిగే వాళ్ళు ఎవరూ లేరు. మీ నాన్నగారి శరీరము ఇంట్లోనే ఉండిపోయింది. దానిని తొందరగా తీసుకెళ్ళి ప్రేతకార్యము పూర్తి చేసి వశిష్ఠుడితో మాట్లాడి నువ్వు పట్టాభిషేకము చేయించుకో నాకు చూడాలని ఉన్నద’న్నది.

ఈ మాటలు విన్న భరతుడు కైకవంక విచిత్రంగా చూసి, ‘అమ్మా! నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను నీతో మాట్లాడేటప్పుడు ఏనాడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉందని కాని రాముడు నాకు కంటకముగా మారుతాడని కాని నీతో చెప్పానా! రాజ్యాన్ని నిన్ను ఎవరు అడగమన్నారు? నీకు మించిన భారాన్ని నెత్తి మీద వేసుకున్నావు. ఇక్ష్వాకు వంశములో కాళరాత్రి ప్రవేశించినట్టు ప్రవేశించావు, నువ్వు నాకు తల్లివి కావు. నేను నీకు కొడుకుని కాదు. నేను నిన్ను అమ్మగా విడిచిపెడుతున్నాను. ఇప్పుడే నా మొలకి ఉన్న కత్తి తీసి నీ కుత్తుక కత్తిరించాలి. కాని నిన్ను చంపేస్తే తల్లిని చంపినవాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడడు. రాముడు మాట్లాడడన్న బెంగ చేత నిన్ను వదిలేస్తున్నాను. రాముడు కౌసల్యని ఎలా చూశాడో నిన్ను అలానే చూశాడు. ఈ ఇక్ష్వాకు వంశములో రాజ్యము ఎప్పుడూ పెద్దవాడు మాత్రమే అనుభవించాలి. నేను రాజ్యము అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు? దశరథ మహారాజు కూడా రాముడి సహకారము తీసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి ఇవ్వాళ మూడు దుష్కరమైన విషయాలు జరిగాయి. నా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టాడు, ధర్మమూర్తి అయిన రాముడు పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసమునకు వెళ్ళిపోయాడు, ఏ పాపము ఎరుగని నా మీద రాజకాంక్ష ఉందన్న అపవాదు పడింది. నేను ఎంతమందికి చెప్పుకుంటే నా మీద పడ్డ అపవాదు పోతుంది. నువ్వు తల్లివి కాదు నాకు అపవాదు తెచ్చిన దౌర్భాగ్యురాలివి.

అమ్మా! నీకు ఒక విషయం చెప్తాను. ఒకానొకనాడు ఆకాశములో కామధేనువైన సురభి వెళ్ళిపోతుండగా భూమండలము మీద ఒక రైతు విపరీతమైన ఎండలో శోషించిపోతున్న రెండు ఎద్దులని నాగలికి కట్టి డొక్కలతో పొడుస్తూ సేద్యము చేయిస్తుంటే సురభి కన్నులవెంట నీరు కార్చింది (ఈ భూమండలం మీద ఉన్న ఆవులు, ఎద్దులు ఆ సురభి యొక్క సంతానమే). దేవేంద్రుడు ఐరావతము మీద వెళుతుండగా ఆయన చేతి మీద సురభి కన్నీటి చుక్కలు పడ్డాయి. దివ్యపరిమళము కలిగిన కన్నీటి బిందువులు ఎవరివి? అని ఇంద్రుడు పైకి చూసేసరికి సురభి ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఇంద్రుడు ఐరావతము దిగి అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగాడు. సురభి ‘నాకు కొన్ని కోట్లమంది బిడ్డలు ఉండచ్చు. ఈ భూమండలములో ఉన్న ఆవులు, ఎద్దులు నా శరీరమునుంచి వచ్చినవే. ఇంతమంది బిడ్డలు ఉన్నా ఈ రెండు ఎద్దులని రైతు పొడుస్తూ ఎండలో సేద్యం చేయిస్తుంటే నా బిడ్డలని ఇంత కష్టపెడుతున్నాడని దుఃఖం ఆగక ఏడిచాను’ అని కోట్ల మంది బిడ్డలు కలిగిన సురభి అన్నది. కౌసల్యకి ఒక్కగానొక్క కుమారుడు లేకలేక పుట్టినవాడు రాముడు. ధర్మాత్ముడు అటువంటి వాడిని పదునాలుగు సంవత్సరాలు అరణ్యములకు పంపావు. కొడుకు పక్కన లేడని, భర్త మరణించాడని కౌసల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావా! నువ్వు చెప్తే రాజ్యాన్ని ఏలుతాననుకున్నావా! ఒక్కనాటికి అది జరగదు. ఇక నువ్వు బ్రతికి ఉండడం అనవసరం. వెంటనే అంతఃపురానికి వెళ్ళి ఉరి వేసుకో అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తమ’ని భరతుడు అన్నాడు.

కౌసల్యను ఓదార్చడం మరియు దశరథుని అంత్యక్రియలు

ఈ మాటలు విన్న కైక మీద పిడుగు పడినట్టయ్యింది. భరతుడు వేసిన కేకలకి మంత్రులందరూ చుట్టూ చేరారు. ఈ కేకలు విన్న కౌసల్య భరతుడు వచ్చాడని గ్రహించి చూద్దామని సుమిత్రతో కలిసి బయలుదేరింది. ఇక నేను ఈ కైక మందిరములో ఉండనని భరతుడు కౌసల్య మందిరానికి బయలుదేరాడు. భరతుడి వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు. అటువైపు నుంచి కౌసల్య, సుమిత్రతో భరతుడికి ఎదురురాగా భరతుడు కౌసల్య పాదముల మీద పడి ఏడిచాడు. అప్పుడు కౌసల్య భరతుడిని పైకి లేపి ‘రాజ్యం కావాలని కోరుకున్నావు కదా! నువ్వు లేనప్పుడు రెండు వరములు అడిగి మీ అమ్మ నీ కోరిక తీర్చింది. నా కొడుకు అడవులని పట్టి వెళ్ళిపోయాడు. నీకు ఎటువంటి కంటకము లేదు. హాయిగా ఈ రాజ్యాన్ని ఏలుకో. నాకు ఒక్క ఉపకారము చెయ్యి. నా భర్త మరణించాడు ఇంక ఈ రాజ్యంలో నా అన్నవారు ఎవరూ లేరు. అందుకని నన్ను అరణ్యములో ఉన్న నా కుమారుడి దగ్గర దిగబెట్టు’ అని అన్నది.

భరతుని ప్రశ్నకౌసల్య సమాధానం
అమ్మా! నువ్వు కూడా నన్ను అలా అనుకున్నావా? నా గురించి నీకు తెలుసు కదా! నేను అటువంటి బుద్ధి ఉన్నవాడినా?నాయనా! నువ్వు ఎటువంటివాడివో నాకు తెలుసు. కాని పుత్రుడు దూరముగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా మాట్లాడాను.
నాకు నిజంగా రాముడు అరణ్యములకు వెళుతున్నాడన్న విషయము తెలిసుంటే, నేను రాజ్యం కోరుకున్నవాడినైతే, ఇటువంటి మహాపాపములు చేసిన వాడినవుదునుగాక!

భరతుడు తాను రాజ్యాన్ని కోరుకోలేదని, రాముడు అరణ్యానికి వెళ్లడం తనకు ఏమాత్రం సమ్మతం లేదని కౌసల్యతో విన్నవించుకున్నాడు. అంతేకాకుండా, ఒకవేళ తనకు ఈ విషయం తెలిసి కూడా రాజ్యాన్ని అంగీకరిస్తే, తాను ఎటువంటి పాపాలు చేసినవాడవుతానో వివరించాడు. భరతుడు చెప్పిన కొన్ని పాపాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • గురువుల చేత సమస్తమైన విద్యలు తెలుసుకొనికూడా ఆ విద్యలు ఆచరించనటువంటి కృతఘ్నుడనవుదుగాక!
  • నిద్రపోతున్న ఆవుని కాని, ఎద్దుని కాని తన్నినవాడికి వచ్చే పాపం.
  • సేవకుల చేత చాలా కష్టమైన పని చేయించుకొని ఆ పనికి తగిన వేతనము ఇవ్వని వాడికి వచ్చే పాపం.
  • ఇంట్లో సౌందర్యవతియై తనని అనువర్తించే భార్య ఉండగా ఆ భార్యతో క్రీడించకుండా పర భార్యలయందు దృష్టి కలిగిన వాడికి వచ్చే పాపం.
  • ఋతుస్నానము చేసిన భార్య ఇంట ఉండగా అటువంటి భార్యతో సంగమించనటువంటి వాడికి వచ్చే పాపం.
  • ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులకి పెట్టకుండా మధురపదార్ధాన్ని తానొక్కడే తిన్నవాడికి వచ్చే పాపం.
  • అందరూ తాగే నీళ్ళల్లో విషం కలిపిన వాడికి వచ్చే పాపం.
  • విషం, లోహం అమ్ముకున్నవాడికి వచ్చే పాపం.
  • యుక్త వయస్సు వచ్చిన తరువాత కూడా వివాహము చేసుకోనటువంటివాడికి వచ్చే పాపం.
  • ఋషుల, పితృదేవతల, దేవతల ఋణాము తీర్చుకోవడము కోసమని, వివాహము చేసుకొని సంతానము కననటువంటివాడికి వచ్చే పాపం.
  • అన్నిటినీమించి ప్రజల దగ్గర పన్ను తీసుకొని తిరిగి ఆ ప్రజలకి కావలసిన సదుపాయాలని కల్పించనటువంటి రాజుకి వచ్చే పాపం.
  • కొత్తగా ఈనినటువంటి పశువుయొక్క దూడ మళ్ళీ పాలు తాగడానికి వస్తే ఆ పొదుగులో పాలు ఉంచకుండా ఆ పాలతో జున్ను వండుకొని తిన్నవాడికి వచ్చే పాపం.
  • సూర్యుడికి, చంద్రుడికి ఎదురుగా నిలిచి మలమూత్రములు విసర్జన చేసినవాడికి వచ్చే పాపం.
  • ఇళ్ళు తగలబెట్టినవాడికి వచ్చే పాపం.

భరతుని యొక్క నిష్కల్మషమైన మాటలు విన్న కౌసల్య, అతడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఓదార్చింది.

దశరథుని అంత్యక్రియలు మరియు భరతుని నిర్ణయం

మరునాడు ఉదయం వశిష్ఠుడు మొదలైన మహర్షులు వచ్చి, దశరథ మహారాజు మరణించారని, ఆయనకు అంత్యక్రియలు నిర్వహించాలని భరతునికి తెలియజేశారు. దశరథుని పార్థివ శరీరాన్ని తైల ద్రోణి నుండి తీసి, అంత్యక్రియలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భరతుడు మరియు శత్రుఘ్నుడు అగ్నిహోత్రం వెలిగించారు. అనంతరం అందరూ సరయు నదిలో స్నానం చేశారు. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో స్త్రీలు కూడా చితి వద్దకు వచ్చేవారని తెలుస్తుంది.

పదమూడవ రోజున అసౌచము తీరిపోయిన తరువాత మంత్రులందరూ కలిసి భరతుడిని రాజ్యాన్ని పరిపాలించమని అభ్యర్థించారు. అయితే భరతుడు అందుకు నిరాకరించాడు. పట్టాభిషేకానికి సిద్ధం చేసిన సంభారాల చుట్టూ ప్రదక్షిణ చేసి భరతుడు ఈ విధంగా అన్నాడు:

రామః పూర్వో హి నో భ్రాతా భవిష్యతి మహీ పతిః
అహం త్వరణ్యే వత్స్యామి వర్షాణి నవ పంచ చ

“నాకన్నా ముందు పుట్టిన రాముడే ఈ రాజ్యానికి రాజు అవుతాడు. నేను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో ఉంటాను.”

భరతుడు రాముని తిరిగి అయోధ్యకు తీసుకువచ్చి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం మంచి వడ్రంగులను, శిల్పులను పిలిపించి, రాముడు ఉన్న దండకారణ్యం వరకు దారి వేయమని ఆదేశించాడు. అయోధ్య ప్రజలందరూ తనతో పాటు రావాలని, అంతమంది అడిగితే రాముడు కాదనలేడని భరతుడు భావించాడు.

భరతుని క్షమాగుణం

భరతుడు మరియు శత్రుఘ్నుడు రాముడు అరణ్యానికి వెళ్లడానికి గల కారణాల గురించి మాట్లాడుకుంటున్నారు. కైకేయి దుర్బుద్ధి వల్లే ఇది జరిగిందని వారు భావించారు. ఇంతలో కైకేయి ఇచ్చిన ఆభరణాలతో వెళుతున్న మంథరను భటులు పట్టుకున్నారు. రామలక్ష్మణులు అరణ్యానికి వెళ్లడానికి మంథరనే కారణమని వారు చెప్పారు. ఆగ్రహించిన శత్రుఘ్నుడు మంథరను భరతుని వద్దకు ఈడ్చుకు వచ్చాడు. శత్రుఘ్నుని భీకర రూపాన్ని చూసి కైకేయి మరియు సుమిత్ర అంతఃపురాలలోని వారు భయంతో పారిపోయారు.

సంఘటనభరతుని స్పందన
శత్రుఘ్నుడు మంథరను చంపడానికి ప్రయత్నించడం‘అయ్యయ్యో శత్రుఘ్ను ఆ మంథరని చంపుతానంటావేమిటి ? ఈ మంథర మాటలు విని ఇంత ఉపద్రవము తీసుకొచ్చింది ఆ కైక. నాకు ఆవిడని చంపెయ్యాలని ఉన్నది. కాని ఎందుకు చంపడము లేదో తెలుసా? ఆమెని చంపేస్తే మాతృఘాతకుడని రాముడు నాతో మాట్లాడడు.’
భరతుని మాట విన్న శత్రుఘ్నుడుతన మనస్సు మార్చుకొని మంథరని విడిచిపెట్టాడు.

భరతుడు మంథరను చంపవద్దని శత్రుఘ్నుడిని వారించాడు. మంథర కేవలం ఒక నిమిత్తమాత్రురాలని, అసలు కారణం కైకేయి అని భరతుడు అన్నాడు. కైకేయిని చంపితే రాముడు తనతో మాట్లాడడని, స్త్రీని చంపిన పాపం కూడా వస్తుందని భరతుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భరతుని మాట విని శత్రుఘ్నుడు మంథరను విడిచిపెట్టాడు.

వశిష్ఠునితో భరతుని వాదన

మరునాడు ఉదయం వశిష్ఠుడు సామంతరాజులు, పురోహితులు మరియు ఇతర ప్రముఖులతో ఒక సభ ఏర్పాటు చేశారు. భరతుడు కూడా ఆ సభకు హాజరయ్యాడు. వశిష్ఠుడు భరతునితో రాజ్యాన్ని స్వీకరించమని కోరాడు.

వశిష్ఠుని సూచనభరతుని సమాధానం
‘నాయనా! నీ తండ్రయిన దశరథ మహారాజుగారు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలని నిర్ణయము చేసి వెళ్ళిపోయారు. నువ్వు పట్టాభిషేకము చేసుకోవడం ధర్మం. జలకలశములు తెప్పించాను. భద్రపీఠం ఏర్పాటు చెయ్యబడింది. ఉత్తమఅశ్వములను, గజములను తీసుకొచ్చాము. నువ్వు కూర్చొని పట్టాభిషేకము చేయించుకొమ్మని’‘నాకు ఈ రాజ్యము అక్కరలేదు నేను దీన్ని ఎప్పుడూ కోరుకోలేదు’ అని నిండుసభలో అందరిముందు చంటిపిల్లవాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. ‘నువ్వు ఇది చెయ్యవలసిన పనేనా? నేను వేదము చదువుకున్నాను, నేను దశరథ మహారాజుకి పుట్టాను. నాకు ధర్మము తెలుసు. నన్ను ఇవ్వాళ వేరొకడి రాజ్యాన్ని అపహరించే దొంగగా చూస్తున్నావా? ఈ రాజ్యం రాముడిది. ఇవ్వడానికి నువ్వు ఎవరు? పుచ్చుకోవడానికి నేను ఎవరు? ఈ రాజ్యమునకు, నాకు, అందరికి ఆయనొక్కడే రాజు’

భరతుడు వశిష్ఠుని మాటలను ఖండించాడు. తనకు రాజ్యంపై ఎలాంటి కోరిక లేదని, ఈ రాజ్యం రామునిదేనని స్పష్టం చేశాడు. రాముడు మాత్రమే తమకు రాజు అని భరతుడు తేల్చి చెప్పాడు. భరతుని యొక్క ధర్మనిష్ఠను, రామునిపై ఆయనకున్న భక్తిని చూసి సభలోని వారందరూ సంతోషించారు.

రాముని దర్శనానికి ప్రయాణం

భరతుడు వెంటనే తన పరివారంతో రాముని దర్శనానికి బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. రాముడు ఉన్న అరణ్యానికి దారి వేయమని తన అనుచరులను ఆదేశించాడు. అయోధ్య ప్రజలందరూ కూడా భరతునితో పాటు రాముని చూడటానికి బయలుదేరడానికి సిద్ధమయ్యారు.

భరతుడు తన స్వార్థాన్ని విడిచిపెట్టి, ధర్మం వైపు నిలబడ్డాడు. రాజ్యాధికారం తన వద్దకు వచ్చినప్పటికీ, దానిని రామునికి తిరిగి ఇవ్వాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. భరతుని యొక్క ఈ నిస్వార్థమైన చర్య, ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుతుంది. రామాయణంలో భరతుని పాత్ర ధర్మనిష్ఠకు, సోదర ప్రేమకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది.

మరిన్ని భక్తి కథనాల కోసం భక్తివాహిని వెబ్‌సైట్ సందర్శించండి.

https://youtu.be/bqDv7hjsgN8

bakthivahini

Share
Published by
bakthivahini

Recent Posts

Bhagavad Gita 700 Slokas in Telugu – Discover the Wisdom of అధ్యాయం 7: జ్ఞాన విజ్ఞాన యోగం, శ్లోకం 13

Bhagavad Gita 700 Slokas in Telugu మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం తీసుకునే ప్రతి…

12 hours ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 22వ రోజు పారాయణ

Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 21వ రోజు పారాయణ

Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 20వ రోజు పారాయణ

Karthika Puranam Telugu తులసి మహాత్మ్యంపై పృధు చక్రవర్తి ప్రశ్న పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు: 'దేవర్షీ! తులసిని స్థాపించి,…

2 days ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 19వ రోజు పారాయణ

Karthika Puranam Telugu నారదుడు చెబుతున్నాడు: ఓ పృథు భూపాలా! కార్తీక వ్రతం పాటించే పురుషుడు తప్పకుండా ఆచరించవలసిన నియమాలను…

2 days ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 18వ రోజు పారాయణ

Karthika Puranam Telugu నారదుడు చెప్పినదంతా విన్న పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసపు గొప్పదనమును వివరించి, నన్ను ధన్యుని…

2 days ago