వాలిని శంకించిన సుగ్రీవుడు
Ramayanam Story in Telugu- సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు: “రామా! నన్ను తప్పుగా అనుకోవద్దు. మా అన్న వాలి యొక్క బలం, గొప్పతనం గురించి నీవు విన్నావు కదా! అది విన్న తర్వాత కూడా వాలిని చంపగలనని నీవు అనుకుంటున్నావా? వాలిని చంపే ధైర్యం నీకు ఉందా? వాలి ఎప్పుడూ ఎవరి చేతిలోనూ ఓడిపోలేదు. ఓటమి అంటే ఏమిటో వాలికి తెలియదు. వాలి పేరు చెబితేనే అందరూ భయపడి పారిపోతారు. వాలి గతంలో గోలభుడు అనే గంధర్వుడితో పదిహేను సంవత్సరాలు రాత్రింబగళ్లు యుద్ధం చేసి అతడిని చంపాడు.
నేను నీకు మరొక విషయం చూపిస్తాను. ఇక్కడ వరుసగా ఏడు సాల వృక్షాలు ఉన్నాయి కదా! మా వాలి ప్రతిరోజూ సంధ్యావందనం అయ్యాక ఇక్కడికి వచ్చి ఈ పెద్ద సాల వృక్షాన్ని తన చేతులతో కదిలిస్తాడు. ఆ కదలికకు లేత చిగురుటాకులు కూడా రాలిపోయి ఆ చెట్టు మోడులా నిలబడుతుంది. వాలి బలం గురించి విన్న తర్వాత కూడా నీకు వాలిని చంపగలననే నమ్మకం ఉందా?”
లక్ష్మణుడి ప్రశ్న
సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు చిన్నగా నవ్వి, “మీ వాలి చాలా గొప్పవాడని చెబుతున్నావు కదా! వాలిని మా అన్నయ్య చంపగలడని ఏమి చేస్తే నీవు నమ్ముతావు?” అని అడిగాడు.
సుగ్రీవుడి సవాలు
సుగ్రీవుడు ఇలా అన్నాడు: “మా వాలి ఈ ఏడు చెట్లను కదిలించగలడు. రాముడు అంత చేయక్కర్లేదు. బాణం వేసి ఒక్క సాల వృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను. ఒకప్పుడు దుందుభి శరీరాన్ని మా అన్నయ్య విసిరితే అది చాలా దూరం, అంటే ఒక యోజనం దూరం వెళ్ళి పడింది. రాముడు ఆ ఎముకల గూడును రెండు వందల ధనుస్సుల దూరం తన కాలితో తన్నితే నేను నమ్ముతాను.”
రాముడి అంగీకారం
రాముడు “సరే! అలాగే చేస్తాను. నీకు నమ్మకం కలిగించడం కోసం నీవు చెప్పిన పని తప్పకుండా చేస్తాను” అన్నాడు.
రాముడి శక్తి ప్రదర్శన
రాముడు దుందుభి కళేబరాన్ని తన బొటన వేలితో సునాయాసంగా తన్నాడు. అది పది యోజనాల దూరం వెళ్ళి పడింది. రాముడు సుగ్రీవుడి వైపు చూసి, నమ్మకం కలిగిందా అన్నట్లు సంజ్ఞ చేశాడు.
సుగ్రీవుడు ఇలా అన్నాడు: “ఆనాడు వాలి ఈ కళేబరాన్ని విసిరినప్పుడు అది రక్తమాంసాలతో బరువుగా, పచ్చిగా ఉంది. అప్పటికే మా అన్నయ్య దుందుభితో చాలాసేపు యుద్ధం చేసి అలసిపోయి ఉన్నాడు, పైగా మద్యం తాగి ఉన్నాడు. తన భార్యలతో సరసాలాడి బయటికి వచ్చాడు. అనేక విధాలుగా అలసిపోయిన శరీరంతో ఉన్నాడు. రాముడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మద్యం సేవించలేదు, పరీక్షకు నిలబడుతున్నాననే ధైర్యంతో ఉన్నాడు. ఆనాడు మా అన్నయ్య విసిరింది పచ్చి శరీరం.
అది ఒక యోజనం దూరం వెళ్ళింది. ఈనాడు రాముడు తన్నినది ఎండిపోయిన కళేబరం. దానిని పది యోజనాలు తన్నడంలో పెద్ద గొప్ప ఏమున్నది? ఆ సాల వృక్షాన్ని కూడా కొట్టమను, అప్పుడు నాకు కొంత నమ్మకం కలుగుతుంది. మనం వాలిని సంహరించడానికి వెళ్దాము.”
ఏడు సాల వృక్షాలను కూల్చిన రాముడు
రాముడు ఒక బంగారు బాణాన్ని తీసి వింటికి సంధించి గురి చూసి సాల వృక్షాల వైపు విడిచిపెట్టాడు. కన్ను మూసి తెరిచే లోపల ఆ బాణం ఏడు సాల వృక్షాలను పడగొట్టి ఎదురుగా ఉన్న పర్వత శిఖరాన్ని చీల్చుకుంటూ భూమిలో పాతాళలోకం వరకు వెళ్ళి తిరిగి వచ్చి రాముడి అమ్ములపొదిలో కూర్చుండిపోయింది.
సుగ్రీవుడి నమ్మకం
రాముడి శక్తిని చూసిన సుగ్రీవుడు వెంటనే రాముడి పాదాలకు తన తల ఆనేలా పడిపోయాడు. అప్పుడు ఆయన కిరీటం రాముడి పాదాల మీద పడిపోయింది. సుగ్రీవుడు “రామా! నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు. నేను ఏదో అనుకున్నాను, ఇక వాలి ఎంత? నీవు బాణ ప్రయోగం చేస్తే వజ్రాయుధం పట్టుకున్న ఇంద్రుడి తల కూడా కింద పడిపోతుంది. నీ బాణానికి ఉన్న వేగం సామాన్యమైనది కాదు. వాలి దగ్గరికి వెళ్దాము పద” అన్నాడు.
“తప్పకుండా సుగ్రీవా! బయలుదేరదాము” అని అందరూ బయలుదేరారు. ముందు సుగ్రీవుడు వేగంగా వెళుతున్నాడు. ఆయన వెనకాల రామలక్ష్మణులు, సుగ్రీవుడి మంత్రులైన హనుమంతుడు, నీలుడు, నలుడు మొదలైన వారు వెళుతున్నారు.
కిష్కింధకు ప్రయాణం
ముందు వెళుతున్న సుగ్రీవుడు కిష్కింధ పట్టణంలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన వారందరూ దట్టమైన చెట్ల చాటున పైకి కనపడకుండా దాగి ఉన్నారు. లోపలికి వెళ్ళిన సుగ్రీవుడు గట్టిగా కేకలు వేసి వాలిని బయటికి రమ్మన్నాడు.
వాలి ఆగ్రహం
సుగ్రీవుడు ఇంత ధైర్యంగా పిలిచేసరికి వాలి ఆశ్చర్యంతో బయటికి వచ్చి “ఏరా బుద్ధిలేనివాడా! మళ్ళీ వచ్చావు నా ప్రతాపం ఏమిటో చూద్దువు గాని రా!” అన్నాడు. వాలి తన పిడికిలిని బిగించి సుగ్రీవుడి తల మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు సుగ్రీవుడి తొమ్మిది రంధ్రాల నుండి రక్తం ఏరులై పారింది.
పోరాటం మరియు వెనుదిరగడం
సుగ్రీవుడు తేరుకొని వాలిని కొట్టడం ప్రారంభించాడు, వాలి కూడా సుగ్రీవుడిని కొడుతున్నాడు. ఇద్దరూ అలా మోచేతులతో పొడుచుకుంటూ, కాళ్ళతో తన్నుకుంటూ, తలలతో గుద్దుకుంటున్నారు. కొంతసేపు కొట్టుకున్నాక ఇంకా బాణం వేయడం లేదు, రాముడు ఎక్కడ ఉన్నాడని సుగ్రీవుడు అటూ ఇటూ చూశాడు కానీ రాముడు కనపడలేదు. వాలితో యుద్ధం చేయలేక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీదకు పారిపోయాడు. వాలి కూడా తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు.
సుగ్రీవుడి నిరాశ
సుగ్రీవుడు ఆ ఋష్యమూక పర్వతం మీద ఒక రాయిపై కూర్చొని ఒంటి నుండి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఆయాసపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. లక్ష్మణుడితో కలిసి రాముడు అక్కడికి వచ్చాడు. వారిని చూడగానే సుగ్రీవుడు “నేను నిన్ను వాలిని చంపమని అడిగానా? నువ్వు వాలిని చంపుతానని మాట ఇస్తేనే కదా నేను యుద్ధానికి వెళ్ళాను. నేను వాలిని చంపను అని నువ్వు ఒక్క మాట చెబితే నేను వెళ్తానా? నన్ను ఇలా ఎందుకు కొట్టించావు?” అని రాముడిని ప్రశ్నించాడు.
రాముడి వివరణ
రాముడు “సుగ్రీవా! నేను ఇంతకుముందెన్నడూ వాలిని చూడలేదు. నువ్వు వాలితో యుద్ధం చేస్తున్నప్పుడు వాలి మీద బాణం వేద్దామని అనుకొని వచ్చాను. వాలి బయటికి వచ్చాక నేను ఆశ్చర్యపోయాను. నువ్వు, వాలి ప్రతి విషయంలో ఒకేలా ఉన్నారు. మీరిద్దరూ కొట్టుకుంటుంటే అశ్వినీ దేవతలు కొట్టుకున్నట్లు ఉంది. మీలో ఎవరు వాలి? ఎవరు సుగ్రీవుడు? నాకు తెలియలేదు. కంఠస్వరంలో మార్పు ఉంటుందేమో అని చూశాను.
ఇద్దరూ ఒకేలా అరిచారు. ఇద్దరూ ఒకేలా పరిగెడుతున్నారు. ఒకేలా అలంకరించుకున్నారు. ఇద్దరూ ఒకే వేగంతో కొట్టుకుంటున్నారు. ఎలాగో నిర్ణయించుకొని ఇతడే వాలి అయ్యుంటాడని బాణ ప్రయోగం చేస్తే సుగ్రీవా! అది తగిలినవాడు ఈ లోకంలో ఉండడు. ఆ బాణం పొరపాటున నీకు తగిలితే నువ్వు నేను కూడా ఉండము.
నిన్ను వాలికన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒకటే గుర్తు ఉంది. లక్ష్మణా! అక్కడ గజపుష్ప తీగ ఒకటి పాకుతోంది. నువ్వు దానిని తీసి సుగ్రీవుడి మెడలో కట్టు. పెద్ద పెద్ద పువ్వులతో అందంగా ఉండే మాల సుగ్రీవుడికి ఉంటుంది. అటువంటి మాల లేనివాడు వాలి. అప్పుడు నేను వాలిని గుర్తుపట్టి బాణం వేయగలను. ఇప్పుడు ఆ మాల వేసుకొని మళ్ళీ యుద్ధానికి వెళ్ళు” అన్నాడు.
మళ్ళీ యుద్ధానికి సుగ్రీవుడు
సుగ్రీవుడు సరే అని బయలుదేరాడు. ఆయన వెనకాల రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మొదలైన వారు బయలుదేరారు. అలా వారు వెళుతూ లోయలను, నదులను, పర్వతాలను, చెట్లను చూసుకుంటూ వెళుతున్నారు. వారికి పక్కనుంచి అక్షరాల ద్వారా చెప్పలేని ఒక గంధర్వ గానం వినిపించింది. అది వింటున్నప్పుడు వారి మనస్సులకు ఆనందం కలిగింది. అక్కడ ఉన్న చెట్లపైకి పావురాల రంగులో పొగలు చుట్టుకొని ఉన్నాయి. రాముడు “ఈ వనం ఏమిటి?” అని సుగ్రీవుడిని అడిగాడు.
సప్తజనుల వనం
సుగ్రీవుడు ఆగకుండా ముందుకు వెళ్ళిపోతూ “రామా! ఇక్కడ సప్తజనులు అనే ఏడుగురు ఋషులు ఉండేవారు. వారు తలలు కిందకు పెట్టి, కాళ్ళు పైకి పెట్టి ఏడు వందల సంవత్సరాలు తపస్సు చేశారు. అలా తపస్సు చేస్తూ ప్రతి ఏడు రాత్రులకు ఒకసారి గాలిని మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. వారి తపస్సుకు ఇంద్రుడు ఆశ్చర్యపోయి వారిని శరీరంతో స్వర్గలోకానికి తీసుకువెళ్ళాడు. వారి తపోశక్తి ఇప్పటికీ ఈ వనంలో ఉంది. అందువలన క్రూర మృగాలు ఈ వనంలోకి వెళ్ళవు, వెళితే ఇక తిరిగి రావు. నువ్వు లక్ష్మణుడితో కలిసి నమస్కారం చెయ్యి” అన్నాడు.
లక్ష్మణుడితో కలిసి రాముడు ఆ సప్తజనుల ఆశ్రమం వైపు తిరిగి నమస్కారం చేశాడు. వారు నమస్కారం చేయగానే వారి మనస్సులో గొప్ప ఉత్సాహం కలిగింది.
వాలిని పిలిచిన సుగ్రీవుడు
వారందరూ కిష్కింధ చేరుకున్నాక సుగ్రీవుడు వెళ్ళి గట్టిగా తొడలు కొట్టి కేకలు వేసి వాలిని పిలిచాడు.
తార హెచ్చరిక
వాలి తొందరగా బయటికి వస్తుండగా ఆయన భార్య అయిన తార (తార సుషేణుడి కుమార్తె) ఆపి “ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోతున్నావు? సుగ్రీవుడు ఇప్పుడే ఒక గంట క్రితం వచ్చాడు కదా! నీవు కొడితే అతని తొమ్మిది రంధ్రాల నుండి నెత్తురు కారేటట్టుగా దిక్కులు పట్టి పారిపోయాడు కదా! నీవు ఇంట్లోకి వచ్చి ఎంతో సేపు కాలేదు. సుగ్రీవుడు వచ్చి నిన్ను యుద్ధానికి రమ్మంటున్నాడు. నీకు అనుమానం రావడం లేదా?
సుగ్రీవుడు వచ్చి ‘వాలి యుద్ధానికి రా’ అంటున్నాడంటే నాకు అనుమానంగా ఉంది. సుగ్రీవుడు నిన్ను ఇప్పుడు పిలవడంలో నీకు తేడా కనపడడం లేదా? చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు. ఇప్పుడే దెబ్బలు తిని వెళ్ళిన వాడిలో ఉండే బలహీనతలు కనపడడం లేదు. ఆ స్వరంలో ఒక ధైర్యం, ఒక గర్వం కనపడుతున్నది. సుగ్రీవుడికి వెనకాల ఎవరిదో సహాయం ఉంది. నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేసేటప్పుడు నీకు వేరొకరితో ప్రమాదం పొంచి ఉంది. సుగ్రీవుడికి స్నేహం చేయడంలో మంచి తెలివితేటలు ఉన్నాయి. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన గొప్ప శౌర్యవంతులైన దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులతో ఇవ్వాళ సుగ్రీవుడు స్నేహం చేశాడు అని నేను గూఢచారుల ద్వారా, అంగదుడి ద్వారా తెలుసుకున్నాను. నువ్వు నీ బలాన్ని నమ్ముకున్నావు, కానీ సుగ్రీవుడి బుద్ధి బలాన్ని గురించి ఆలోచించడం లేదు.
సుగ్రీవుడు నీ తమ్ముడన్న విషయాన్ని మరిచిపోయి నీ తమ్ముడి భార్యను నీ భార్యగా అనుభవిస్తున్నావు. నీ తమ్ముడిని పక్కన పెట్టుకోవడం మానేసి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నావు. మీ ఇద్దరి మధ్యలోకి మూడవ వ్యక్తి రావలసిన అవసరం ఏమిటి? ఇది నీ ఇంటి సమస్య. నా మాట విని సుగ్రీవుడిని ఆహ్వానించి యువరాజ పట్టాభిషేకం చెయ్యి. అప్పుడు నీ బలం పెరుగుతుంది. ఇవాళ నీ తమ్ముడు రాముడి నీడలో ఉన్నాడు. రాముడిలా నీడ ఇవ్వగలిగే చెట్టు ఈ ప్రపంచంలో లేదు” అన్నది.
వాలి నిర్లక్ష్యం
వాలి శరీరం పడిపోవలసిన సమయం దగ్గరపడింది. దేవుడు ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టాడు కాబట్టి ఇంతకాలం తార మాటలు వినడానికి అలవాటుపడ్డ వాలి ఆమె మాట వినడం మానేసి సుగ్రీవుడితో యుద్ధానికి వెళ్ళాడు.
భీకర యుద్ధం
ఇద్దరూ హోరాహోరీగా యుద్ధం చేసుకుంటున్నారు. ఈసారి సుగ్రీవుడు చెట్లను పెరికి వాలిని బాగా కొట్టాడు. వాలి మెడలో ఇంద్రుడు ఇచ్చిన మాల ఉండడం వలన మెల్లగా సుగ్రీవుడి శక్తి తగ్గిపోయి వాలి బలం పెరిగింది. సుగ్రీవుడు ఇంతకుముందులా పారిపోకుండా ఈసారి రాముడి కోసం అన్ని వైపులా చూశాడు.
రాముడి బాణం
సుగ్రీవుడి శక్తి తగ్గిపోవడం గమనించిన రాముడు వెంటనే బాణాన్ని తీసి వింటికి తొడిగించి వెనక్కి లాగాడు. అలా లాగడం వలన ఆ వింటి నుండి వచ్చిన ధ్వని యుగాంతంలో ప్రళయం వచ్చేటప్పుడు శివుడు చేసే శబ్దంలా ఉంది. ఆ శబ్దానికి మృగాలన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి, పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి.
రాముడి బాణం వాలి గుండెల్లోకి దూసుకుపోయింది.
వాలి పతనం మరియు నింద
రాముడి బాణం శబ్దం విని ఎక్కడి నుంచి వచ్చిందని వాలి అటువైపు తిరిగేలోగా ఆ బాణం వేగంగా వచ్చి వాలి గుండెల్లో పడింది. ఆ దెబ్బకు వాలి కింద పడిపోయాడు. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడి మంత్రులు అక్కడికి వచ్చారు. పక్కనే చేతులు కట్టుకొని సుగ్రీవుడు నిలబడ్డాడు. వాలి రాముడితో “రామా! నువ్వు చాలా గొప్పవాడివి, ధర్మం తెలిసినవాడివి, పరాక్రమం ఉన్నవాడివి అంటారు. నీతో కాకుండా ఇంకొకరితో నేను అటువైపు తిరిగి యుద్ధం చేస్తుంటే ఇంత ధర్మాత్ముడివి అయిన నువ్వు చెట్టు చాటు నుంచి నా మీద బాణం వేయడానికి సిగ్గుగా లేదా? నా చర్మం ఒలిచి వేసుకోవడానికి, మాంసం తినడానికి పనికిరావు.
యుద్ధం అంటూ వస్తే బంగారం వల్ల, వెండి వల్ల, భూమి వల్ల రావాలి. నీకు నాకు ఈ విషయాలలో తగాదా లేదు. నేను చెట్ల మీద ఉండే ఆకులను, పండ్లను తినే శాఖాహారిని. నువ్వు మనిషివి, ధర్మం అనే ముసుగు వేసుకున్న మహా పాపాత్ముడివి. చేతిలో కోదండం పట్టుకొని కనపడ్డ ప్రతి ప్రాణిని హింసించే స్వభావం ఉన్నవాడివి. నీలో కామం ఎక్కువగా ఉంది. అందుచేతనే ఏ కారణం లేకుండా నన్ను కొట్టి చంపావు. నువ్వు నాకు ఎదురుగా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్లయితే, ఆ యుద్ధంలో నేను నిన్ను యమలోకానికి పంపించి ఉండేవాడిని.
ధర్మశాస్త్రం ప్రకారం బ్రాహ్మణులు, క్షత్రియులు అయిదు రకాల జంతువుల మాంసాన్ని మాత్రమే తినాలి. (త్రేతా యుగంలో బ్రాహ్మణులు కూడా మాంసం తినేవారు, కలియుగంలో అది నిషేధం. అరణ్యకాండలో అగస్త్య మహర్షి వాతాపి, ఇల్వలుడు అనే రాక్షసులను చంపే ముందు మాంసాహారం తిన్నారు). అయిదు గోళ్ళున్న వాటిలో ముళ్ళపంది మాంసాన్ని తినవచ్చు. చెవుల పిల్లి మాంసాన్ని తినవచ్చు. ఉడుము మాంసాన్ని తినవచ్చు. తాబేలు మాంసాన్ని తినవచ్చు. కుక్కలను తరిమి చంపే ఏదుపంది మాంసాన్ని తినవచ్చు. ఇక ఆరవ దాని మాంసం తినకూడదు. ఒకవేళ అలా తిన్న రాజ్యం చేస్తున్న రాజును చంపినా, గోవును చంపినా, బ్రాహ్మణుడిని చంపినా, అలా చేసిన వారికి పాపం వస్తుంది.. నువ్వు నన్ను చంపడానికి కారణం ఏమిటి? నువ్వు చేసినవి తప్పులు కాదా? నాకు సమాధానం చెప్పు.
నీ భార్య కోసం అడవిలో వెతుక్కుంటున్నావు కదా! నీ భార్యను ఎత్తుకుపోయిన రావణాసురుడు నా సేవకుడు. నువ్వు నాతో చెప్పి ఉంటే పశువును ఈడ్చుకు వచ్చినట్లు రావణుడిని మెడలో తాడు వేసి నీ కాళ్ళ ముందు పడేసేవాడిని. అటువంటిది నాకు చెప్పకుండా, నన్నే గెలవలేని సుగ్రీవుడిని ఆశ్రయించి నువ్వు సీతను ఎలా తెచ్చుకోగలవు? సుగ్రీవుడి కోసం నన్ను చంపావు. ఇది కిరాయి హత్య కాదా? నువ్వు ఈ పని చేయొచ్చా?” అని రాముడిని ప్రశ్నించి, ఇక మాట్లాడడానికి ఓపిక లేక ఊరుకున్నాడు.
రాముడి సమాధానం
రాముడు “నీకు అసలు ధర్మం గురించి కానీ, అర్థం గురించి కానీ, కామం గురించి కానీ తెలుసా? నువ్వు అజ్ఞానివి. చిన్నపిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి. నీకు ఏమి తెలుసని నా మీద ఇన్ని నిందలు వేశావు? నువ్వు అజ్ఞానివి కావడం వలన నీకు తెలియకపోతే ఆచారం తెలిసిన వారిని, పెద్దలైన వారిని అడిగి తెలుసుకోవాలి. నువ్వు అవేమీ తెలుసుకోకుండా నా గురించి అడుగుతున్నావు. ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ ప్రాంతం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు.
ఇక్ష్వాకు వంశం వారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మాలు జరిగిన చోట శిక్షించే అధికారం మాకు ఉంటుంది. నీకు కామం తప్ప వేరొకటి తెలియదు. అందుచేత నీకు ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారం లేదు. జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురు తండ్రులతో సమానం. అలాగే తనకి పుట్టిన కొడుకు, తోడబుట్టిన తమ్ముడు, తన దగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు ముగ్గురూ కొడుకులతో సమానం.
నీ తండ్రి చనిపోవడం చేత, నువ్వు పెద్దవాడివి కావడం చేత నువ్వు తండ్రితో సమానం. నీ తమ్ముడు సుగ్రీవుడి భార్య అయిన రుమ నీకు కోడలితో సమానం. సుగ్రీవుడు బతికున్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించి, నీ భార్యగా కామ సుఖాలను పొందుతున్నావు (వాలి గుహలో ఉండిపోయినప్పుడు వాలి చనిపోయాడు అనుకొని సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు.
సుగ్రీవుడు వాలి భార్య అయిన తారని తన భార్యగా అనుభవించాడు. మరి సుగ్రీవుడు చేసింది తప్పు కాదా? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రులచేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త చనిపోతే మరిదిని మళ్ళీ పెళ్లి చేసుకొని వారితో ఉండవచ్చు. ఆనాడు వాలి చనిపోయాడనుకొని తార సుగ్రీవుడిని వివాహం చేసుకుంది. కనుక సుగ్రీవుడితో ఆనాడు తార ఉండడం ధర్మం తప్పడం కాదు.
సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామ సుఖాలను అనుభవించడం వాలి యొక్క తప్పు. కేవలం పైన చెప్పిన వానర జాతికి మాత్రమే ఈ నియమం, మనుషులకు కాదు. అలాగే వాలికి రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి ఇంద్రుడు ఇచ్చిన మాలను మెడలో వేసుకుంటే వాలికి అపారమైన ఉత్సాహం ఉంటుంది. రెండు ఎవరైనా వాలికి ఎదురుగా వెళితే వారి శక్తిలో సగం శక్తిని ఈయన లాగేసుకుంటాడు, ఇది బ్రహ్మగారు వాలికి ఇచ్చిన వరం. అలాగే వాలికి రావణాసురుడికి స్నేహం ఉంది. వారిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం వాలి అనుభవించే స్త్రీని రావణుడు అనుభవించవచ్చు. వాలికి శత్రువు రావణుడికి శత్రువే… అలా కొన్ని విషయాలలో ఒప్పందం చేసుకున్నారు).
అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాలు అనుభవిస్తే ఎంత తప్పో అంత తప్పు నువ్వు చేశావు. ధర్మశాస్త్రంలో దీనికి మరణ శిక్ష తప్ప వేరొక శిక్ష లేదు. అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది. నువ్వు రాజువి, మంత్రులచేత సేవింపబడుతున్న వాడివి, సంధ్యావందనం చేస్తున్న వాడివి. నువ్వు ధర్మం తప్పితే నీ వెనుక ఉన్న వారు కూడా ధర్మం తప్పుతారు. నేను క్షత్రియుడిని కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉంది. ఇది తప్పు అని తెలిసి కూడా నేను నిన్ను శిక్షించకపోతే నువ్వు చేసిన పాపం నాకు వస్తుంది. ఈ పాపం అవతలివాడు చేశాడని రాజుకు తెలిసి వాడిని శిక్షిస్తే వాడి పాపం పోతుంది.
రాజు అలా శిక్షించకపోతే ఆ పాపం రాజుకు వెళుతుంది. అందుకే మా వంశంలో ఇంతకు ముందు మాంధాత అనే రాజు ఒక సన్యాసి ఇలాంటి తప్పు చేస్తే శిక్ష వేశాడు. ఇక నాతో ఎందుకు స్నేహం చేయలేదు? చేసి ఉంటే సీతను తీసుకు వచ్చేవాడిని అన్నావు కదా! నీలాంటి అధర్మపరుడితో నేను స్నేహం చేయను. నన్ను చెట్టు చాటు నుండి చంపావు, వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు, అది తప్పు కాదా అని నన్ను అడిగావు. దానికి నేను సమాధానం చెబుతాను విను.
తప్పు చేసిన వాడిని రాజు శిక్షిస్తే వాడి పాపం ఇక్కడితో పోతుంది. నేను నిన్ను చంపడం వల్ల నువ్వు ఏ పాపమూ లేని స్థితికి వచ్చావు. నీ పాపం ఇక్కడితో పోయింది అందుకని నువ్వు మంచి లోకాలకు వెళ్ళిపోతావు.
నేను మనిషిని, నువ్వు కోతివి. నేను క్షత్రియుడిని, మాంసం తినేవాడిని, ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడిని ఒక జంతువును కొట్టవలసి వస్తే తాను చాటున ఉండి కొట్టవచ్చు, వల వేసి పట్టుకొని కొట్టవచ్చు, తాడు వేసి పట్టుకొని కొట్టవచ్చు. అది మెలకువగా ఉన్నప్పుడు కొట్టవచ్చు, అది పడుకొని ఉన్నప్పుడు కొట్టవచ్చు, నిలబడి ఉన్నప్పుడు కొట్టవచ్చు, పారిపోతున్నప్పుడు కొట్టవచ్చు. ఎప్పుడైనా కొట్టవచ్చు. కానీ ఆ జంతువు వేరొక ఆడ జంతువుతో కలుస్తున్నప్పుడు మాత్రం బాణం వేయకూడదు. నువ్వు ఆ స్థితిలో లేవు. అందుకని నిన్ను కొట్టాను. నేను నరుడిని కనుక జంతువైన నిన్ను ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలిసి కొట్టాను. కానీ నువ్వు చనిపోయే ముందు కోపంతో నన్ను ప్రశ్నించావు. నాలో ఎటువంటి తప్పు లేదు” అని రామచంద్రమూర్తి సమాధానమిచ్చారు.
వాలి పశ్చాత్తాపం
రాముడి మాటలు విన్న వాలి తన రెండు చేతులతో రాముడికి నమస్కారం పెట్టి “మహానుభావా! ధర్మాత్మా! రామచంద్రా! నువ్వు చెప్పినది పరమ సత్యం. తప్పు నాలోనే ఉంది. నువ్వు నన్ను చంపడంలో కానీ నాలో తప్పు ఉందని చెప్పడంలో కానీ కొంచెం కూడా సందేహం లేదు. నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేత నీకున్న జ్ఞానం చేత ముందు వెనుక బాగా ఆలోచించిన తర్వాత ఏమి చేయాలో నిర్ణయించుకొని దానిని అమలు చేసి దాని మీద స్థిరంగా నిలబడగల వ్యక్తిత్వం ఉన్నవాడివి. అటువంటి నిన్ను చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. నీ చేతిలో మరణమైనా నాకు స్వర్గమే” అన్నాడు.
ఈ ఘట్టం రాముని మానవత్వం, ధైవత్వం, ధైర్యం, స్నేహబంధం — అన్నింటినీ స్పష్టంగా చూపిస్తుంది.👉 రామాయణంలోని మరిన్ని వివరాలు – భక్తివాహిని