Categories: రామాయణం

Ramayanam Story in Telugu – రామాయణం 55

తీక్ష్ణమైన స్వభావాలు

  • గంధర్వులు: వీరిలో కోరికలు తీవ్రముగా ఉంటాయి.
  • పాములు: వీరు ఎంతో కోపిష్ఠులు.
  • మృగాలు: వీటికి భయం అత్యధికంగా ఉంటుంది.
  • పక్షులు (నేను): నాకు ఆకలి తీవ్రంగా ఉండేది.

రెక్కలు లేని నిస్సహాయత

Ramayanam Story in Telugu- అధికమైన ఆకలితో బాధపడుతున్నప్పటికీ, నాకు ఎక్కడికీ వెళ్ళి ఆహారం తెచ్చుకునేందుకు రెక్కలు లేవు.

కుమారునిపై ఆధారపడటం

నా కుమారుడు సుతార్ష్వుడు ప్రతిరోజూ ఆహారం తీసుకొచ్చేవాడు. ఒకరోజు ఆహారం కోసం వెళ్ళిన నా కొడుకు చాలా సమయం వరకు తిరిగి రాలేదు. ఆకలితో నేను అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. చివరికి నా కొడుకు ఒట్టి చేతులతో తిరిగి రావడంతో నాకు కోపం వచ్చింది మరియు నేను అతన్ని నిందించాను.

సుతార్ష్వుని వివరణ – వింతైన దృశ్యం

అప్పుడు సుతార్ష్వుడు ఇలా అన్నాడు: “నాన్నగారు! ఇందులో నా తప్పు ఏమీ లేదు. నేను ఉదయాన్నే సముద్రంలోని మహేంద్రగిరి పర్వతంపై కూర్చొని సముద్రపు నీటిలోకి చూస్తున్నాను. ఏదైనా పెద్ద జీవి కనిపించగానే దానిని తీసుకొచ్చి మీకు ఆహారంగా ఇద్దామని అనుకున్నాను. ఇంతలో ఆకాశంలో నల్లటి ఆకారంతో ఒక రాక్షసుడు, మెడలో తెల్లటి ముత్యాల హారం వేసుకొని, తెల్లటి దుస్తులు ధరించి వెళుండగా చూశాను. మేఘంపై మెరుపు మెరిసినట్లుగా ఒక స్త్రీ అతని చేతుల్లో కొట్టుకుంటుంది. ‘హ రామ! హ లక్ష్మణా!’ అని ఆమె కేకలు వేస్తోంది.

రాక్షసుని వేడుకోలు – వింత ప్రవర్తన

నేను వాడిని చూసి మంచి ఆహారం దొరికిందని అనుకున్నాను. వాడు నా దగ్గరికి వచ్చి నమస్కరించి, ‘మహానుభావా! నాకు దారి ఇవ్వండి’ అని వేడుకున్నాడు. ఎంతటి బలవంతుడైనా అలా బ్రతిమలాడుతూ శాంతంగా మాట్లాడితే, వివేకం ఉన్నవాడు ఎవరైనా అలాంటి వ్యక్తిని ధిక్కరించకూడదు కదా! అందుకే నేను వాడిని వదిలివేశాను.

రావణాసురుని గురించి వెల్లడి

కానీ వాడు వెళ్ళిపోగానే ఆకాశంలో దేవతలు మరియు ఋషులు నా దగ్గరికి వచ్చి, ‘నువ్వు అదృష్టవంతుడివి, బ్రతికిపోయావు. వాడి పేరు రావణాసురుడు, వాడు దుర్మార్గుడు మరియు చాలా బలవంతుడు. వాడికి విశేషమైన వరాలు ఉన్నాయి’ అని చెప్పి వెళ్ళిపోయారు.” నా కొడుకు చెప్పిన ఈ విషయం వల్ల నాకు సీతమ్మ గురించి తెలిసింది. రావణాసురుడు సీతమ్మను అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు. నేను వింధ్య పర్వత శిఖరం మీద రెక్కలు కాలిపోయి పడిపోయినప్పుడు ఆరు రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాను. తరువాత స్పృహ వచ్చింది. నా తమ్ముడు ఎటో ఎగిరిపోయాడు, నాకేమో రెక్కలు కాలిపోయాయి. అందుకని ఆ పర్వతం మీద నుండి కిందకి దూకి చనిపోదామని అనుకున్నాను.

జ్ఞాపకం వచ్చిన ఆశ – నిశాకర మహర్షి

ఇంతలో నాకు ఒక ఆలోచన వచ్చింది. మా ఇద్దరికీ రెక్కలు ఉన్న రోజుల్లో, మేము కామరూపులం కాబట్టి మనుష్య రూపాన్ని పొందగలిగేవాళ్ళం. అక్కడ ఉండే నిశాకర మహర్షి పాదాలకు మేము నమస్కారం చేస్తూ ఉండేవాళ్ళం.

ఒక్కసారి ఆ మహర్షి పాదాలకు నమస్కరించి ప్రాణాలు విడిచిపెడదామని అనుకొని మెల్లగా పాకుతూ ఆ మహర్షి ఉండే ఆశ్రమానికి వచ్చాను.

అప్పుడు ఆ మహర్షి స్నానం చేసి వెళుతుంటే, అభిషేకం చేయబడ్డ బ్రహ్మగారు వెళుతున్నట్లుగా ఉంది. బ్రహ్మగారి చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరుతాయో, అలా నిశాకర మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఆయన చుట్టూ ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, పాములు చేరి ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళగానే ఆ మృగాలన్నీ వెళ్ళిపోయాయి.

ఆయన బయటికి వచ్చి నన్ను చూసి, ‘నిన్ను చాలా కాలం నుండి చూస్తున్నాను, నువ్వు నీ తమ్ముడు వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా! నీ రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావేంటి?’ అని అడిగారు. అప్పుడు నేను జరిగిన కథంతా చెప్పాను.

మహర్షి భవిష్యద్వాణి – ఆశ మరియు కర్తవ్యం

అప్పుడాయన అన్నారు: ‘సంపాతి! బాధపడకు, భవిష్యత్తులో నీ ద్వారా ఒక గొప్ప కార్యం జరగవలసి ఉంది. నువ్వు కొంత కాలానికి సీతాపహరణాన్ని చూస్తావు. సీతమ్మను వెతుకుతూ వానరులు వస్తారు. వారికి నువ్వు సహాయం చెయ్యి. నేను నీకు అభయం ఇస్తున్నాను. అలా చేస్తే నీ కాలిపోయిన రెక్కలు మళ్ళీ వస్తాయి. నాకు కూడా రామలక్ష్మణులను చూడాలని ఉంది. అంత కాలం ఈ శరీరంలో ఉండాలని నాకు లేదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టేద్దామని అనుకుంటున్నాను. నువ్వు ఈ కొండ మీదే వేచి ఉండు.

మహర్షి రహస్యం – సీతమ్మ యొక్క దృఢ సంకల్పం

నీకు ఇంకొక విషయం చెబుతాను. సీతమ్మను అపహరించిన తరువాత ఆమెను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని రావణాసురుడు తన అంతఃపురం చూపిస్తాడు, దివ్యమైన భోజనం పెడతాడు. ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు, ఒక్క మెతుకు ముట్టదు. ఆ తల్లి కోసం దేవేంద్రుడు ప్రతిరోజూ దేవతలు కూడా చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని పంపిస్తాడు. సీతమ్మ ఆ పాయసాన్ని తినదు.

ఆమె పైన ఉన్న పాయసాన్ని తీసి ఈ భూమండలంలో ఎక్కడైనా సరే రామలక్ష్మణులు బతికుంటే, ఈ పాయసం వారికి చెందుగాక! ఒకవేళ రామలక్ష్మణులు శరీరాన్ని విడిచిపెట్టి ఉంటే ఊర్ధ్వ లోకాల్లో ఉన్న వారికి ఈ పాయసం చెందుగాక! అని భూమి మీద పైన ఉన్న పాయసాన్ని పెడుతుంది. ఆ సీతమ్మ తిన్న అన్నం రావణుడు పెట్టినది కాదు. ఈ విషయాన్ని ఆ వానరులు వచ్చాక వారికి చెప్పు’ అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు. అందుకని కొన్ని వేల సంవత్సరాల నుండి ఇలా బ్రతికి ఉన్నాను.

వానరులతో సంపాతి ఈ విధంగా చెబుతుండగానే, ఆ వనచరులందరూ చూస్తుండగా ఆయనకు రెక్కలు మళ్ళీ వచ్చాయి. సంపాతి ఆనందంతో తన ఎర్రటి రెక్కలను అటూ ఇటూ ఊపుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోయాడు.

వానరుల సందిగ్ధం – సముద్రాన్ని దాటేదెలా?

ఇక అక్కడ ఉన్న వానరులకు ఇది చూడగానే చాలా సంతోషం వేసింది మరియు సముద్రాన్ని దాటుదామని వారందరూ కలిసి సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. అప్పుడు వారు అనుకున్నారు: “ఈ నూరు యోజనాల సముద్రాన్ని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళగలిగిన వాడు ఎవరు? మిగిలిన వానర జాతికి ప్రాణదానం చేయగలిగిన వాడు ఎవరు? ఈ సముద్రం దగ్గర నిలబడిపోయిన వానరులు సంతోషంగా తిరిగి వెళ్ళి తమ భార్యాపిల్లలను చూసేటట్లు చేయగలిగిన వాడు ఎవరు? ఎవరి వల్ల ఈ కార్యం జరుగుతుంది? అంతటి సమర్థుడు ఎవరు?” అని అడిగారు.

శరభుడు లేచి నేను ముప్పై యోజనాలు వెళతాను అన్నాడు. ఋషభుడు నలభై, గంధమాదనుడు యాభై, మైందుడు అరవై, ద్వివిదుడు డబ్భై, సుషేణుడు ఎనభై అన్నాడు. అప్పుడు జాంబవంతుడు లేచి అన్నాడు: “నేను యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉండేవాడిని. పరమేశ్వరుడు త్రివిక్రమావతారంతో (వామన) పెరిగిపోతుంటే నేను ఆయనకు ఇరవై ఒక్క సార్లు ప్రదక్షిణ చేశాను. కానీ ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను. నేను ఇప్పుడు తొంభై యోజనాలు ఎగర గలను” అన్నాడు.

అంగదుని నిస్సహాయత – తిరిగి రాలేననే భయం

అప్పుడు అంగదుడు అన్నాడు: “నేను నూరు యోజనాలు వెళ్ళగలను కానీ తిరిగి మళ్ళీ రాలేను” అన్నాడు.

జాంబవంతుని సూచన – హనుమంతుని సామర్థ్యం

జాంబవంతుడు “అయ్యో! అది మహా పాపం. ప్రభువు వెళ్ళి పని చేస్తుంటే ఆయనను సేవించేవారు హాయిగా కూర్చుంటే అది చాలా అసహ్యంగా ఉంటుంది. నువ్వు వెళ్ళకూడదు. నువ్వు మాకు పనిని పురమాయించాలి. ఎవరిని పంపాలో నాకు తెలుసు. వాడిని నేను పంపిస్తాను, మీరందరూ చూడండి” అని ఒంటరిగా కూర్చున్న హనుమంతుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు.

హనుమంతుని గురించి వెల్లడి – జన్మ రహస్యం

“హనుమా! ఏమి తెలియని వాడిలా ఇలా కూర్చున్నావు? ఒకానొకప్పుడు అప్సరసలలో శ్రేష్ఠురాలైన పుంజికస్థల అనే ఒక అప్సరస శాపవశం చేత కుంజరుడు అనే వానరానికి కుమార్తెగా జన్మించింది. ఆమెకు అంజనా అని పేరు పెట్టారు. ఆమె నీ తండ్రి అయిన కేసరి యొక్క భార్య. నీ తల్లి కామరూపి అవ్వడం చేత ఒకనాడు మనుష్య రూపం దాల్చి ఒక పర్వత శిఖరం మీద నిలబడింది.

వాయువు ఆమెను చూసి మోహించి తన దీర్ఘమైన బాహువుల చేత గట్టిగా కౌగలించుకున్నాడు. అప్పుడా తల్లి ‘ఎవడురా దుర్మార్గుడు నా పాతివ్రత్యాన్ని చెరప చూస్తున్నవాడు?’ అన్నది. వాయువు ‘అమ్మా! బ్రహ్మగారు మా తేజస్సులను వానర స్త్రీల యందు ప్రవేశపెట్టి వానరులను సృష్టించమన్నారు.

అందుకని నీ పాతివ్రత్యానికి భంగం కలగకుండా గొప్ప పరాక్రమం ఉన్నవాడు, బుద్ధిమంతుడు, నాతో సమానంగా దూకగలిగిన వాడు, ఎగర గలిగిన వాడైన పుత్రుడు కేవలం నిన్ను నేను మానసికంగా చూసినంత మాత్రాన నీ కడుపునందు జన్మించనున్నాడు’ అన్నాడు. ఆ కారణం చేత నువ్వు జన్మించావు.

బాల్యం మరియు వరాలు – అసాధారణ శక్తులు

నువ్వు పుట్టగానే ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి తినే పండు అనుకొని ఆయనను పట్టుకోబోయావు. సూర్య పథానికి అడ్డు వస్తున్నావని కోపం వచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే నీ ఎడమ దవడ సొట్టపడి కింద పడ్డావు. సొట్టపడ్డ హనువులు కలిగిన వాడివి కనుక నిన్ను హనుమని పిలిచారు. నువ్వు అలా పడిపోవడం చేత నీ తండ్రి అయిన వాయుదేవుడికి కోపం వచ్చి భూమి మీద వీచడం మానేశాడు.

బ్రహ్మగారు పరుగు పరుగున వచ్చి గాలి వీచకపోతే సృష్టి ఆగిపోతుందని ‘హనుమా! ఏ అస్త్రం చేత, ఏ శస్త్రం చేత నిన్ను ఎవరూ బంధించలేరు’ అని వరం ఇచ్చారు. అలాగే ఇంద్రుడు నీకు స్వచ్ఛంద మరణ వరం ఇచ్చాడు. నీ అంత నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి కానీ, నిన్ను పడగొట్టగలిగే పురుషుడు ఈ బ్రహ్మాండంలో ఎక్కడా ఉండడు.

హనుమంతుని శక్తిని గుర్తు చేయడం

నేను ఎన్నో సందర్భాలలో సముద్రంలో ఉన్న పాములను గరుత్మంతుడు తన్నుకుపోతుండగా చూశాను. నీ తండ్రి అయిన వాయుదేవుడు ప్రభంజనుడై వీస్తే పెద్ద పెద్ద చెట్ల యొక్క కొమ్మలను విరిచేస్తాడు. అటువంటి శక్తిమంతుడైన వాయుదేవుడి కుమారుడవైన నీకు ఆ గమన శక్తి ఉన్నది. గరుత్మంతుడికి ఆ గమన శక్తి ఉన్నది. ఇవ్వాళ కొన్ని కోట్ల వానరముల భవిత, సౌభాగ్యము, ప్రాణములు నీ చేతుల్లో ఉన్నాయి. నీ వీర్యాన్ని, తేజస్సును, పరాక్రమాన్ని ఒక్కసారి పుంజుకో. నూరు యోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి సీతమ్మ జాడ కనిపెట్టు. నీ శక్తిని చూపించు” అన్నాడు.

హనుమంతుని స్పందన

జాంబవంతుడి మాటలు విన్న హనుమంతుడు మేరు పర్వతం పెరిగినట్లు తన శరీరాన్ని పెంచేశాడు. గుహలో నుండి సింహం ఆవలిస్తూ బయటికి వస్తుంటే దానిని చూసిన ప్రాణులు భయంతో ఎలా నిలబడిపోతాయో, అలా అప్పటివరకు తమతో తిరిగిన హనుమంతుడు అటువంటి స్వరూపాన్ని పొంది ఒక్కసారి ఆవలించి బాహువులను పైకి ఎత్తి ఒక్కసారి విదిల్చి భూమి మీద కొట్టేసరికి వానరులన్నీ భయపడిపోతూ శ్రీ మహావిష్ణువు దర్శనమైతే ఎలా నిలబడతారో అలా హనుమంతుడిని చూసి అంజలి ఘటించి నిలబడిపోయారు.

హనుమంతుని ప్రతిజ్ఞ

హనుమంతుడు అక్కడ ఉన్న వృద్ధులైన వానరములకు నమస్కరించి “నా తండ్రి వాయుదేవుడు, ఆయన అగ్నిదేవుడి యొక్క స్నేహితుడు. వాయుదేవుడు ఎటువంటి వేగంతో వెళతాడో నేను అటువంటి వేగంతో వెళతాను. నేను వెళుతున్నప్పుడు నాకు అడ్డొచ్చిన ఏ ప్రాణినైనా నా వక్షస్థలంతో గుద్ది చంపేస్తాను. పర్వతాలను చూర్ణం చేస్తాను, సముద్రాలను కలయ తిప్పుతాను. నా బాహువుల శక్తి చేత ఈ సముద్రాన్ని తిరగ తోడుతాను. నూరు యోజనాలే కాదు, పదివేల యోజనాలైనా సరే కొన్ని వేల మార్లు అటువైపు నుండి ఇటువైపుకి వెళతాను.

సూర్యుడు ఉదయిస్తుండగా భూమి నుండి ఆకాశంలోకి వెళతాను, సూర్యుడి సమీపంలో నిలబడి నమస్కారం చేస్తాను. సూర్యుడు అస్తమించడానికి పశ్చిమ దిక్కుకి వెళుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి వస్తాను.

గరుత్మంతుడు సముద్రం మీద తిరుగుతుండగా ఆయనకు కొన్ని వేలసార్లు ప్రదక్షిణం చేస్తాను. ఇక్కడ నుండి లేచి దక్షిణ దిక్కున ఉన్న సముద్రాన్ని ముట్టుకుంటాను. రావణాసురుడిని కొట్టి చంపేస్తాను లేదా లంకను పెళ్ళగించి చేతితో పట్టి సముద్రానికి ఈవలి ఒడ్డుకి తీసుకువచ్చి రాముడి పాదాల దగ్గర పడేస్తాను.

ఇక నా పరాక్రమం ముందు నిలబడగలిగిన వాడు లేడు. బ్రహ్మగారు, దేవేంద్రుడు చెరొక ఆసనం మీద కూర్చుని మధ్య ఆసనంలో అమృతాన్ని పెడితే ఇద్దరి మధ్యలోకి వెళ్ళి, చెరొక చేతితో ఇద్దరినీ అడ్డగించి అమృతాన్ని తీసుకురాగలను. ఈ భూమి నన్ను తట్టుకోలేకపోతున్నది, అందుకని మహేంద్రగిరి పర్వతం మీద నుండి బయలుదేరతాను” అన్నాడు.

హనుమంతుని ప్రయాణం

హనుమంతుడు ఆ మహేంద్రగిరి పర్వతాన్ని ఎక్కుతుంటే అక్కడ ఉన్న గంధర్వులు, విద్యాధరులు ఎగిరి పారిపోయారు. అనిలకుమారుడి కాలి తాకిడికి ఆ పర్వతం కంపించిపోయింది. చెట్లు నేలరాలిపోయాయి. మృగాలన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి. హనుమంతుడిని చూసిన వానరులు “

మహానుభావా! ఋషుల యొక్క ఆశీర్వచనము చేత, గురువుల యొక్క ఆశీర్వచనము చేత, దేవతల యొక్క ప్రభావము చేత ఏ విధమైన అడ్డంకి లేకుండా నూరు యోజనాల సముద్రాన్ని దాటి సీతమ్మ జాడ కనిపెట్టి తిరిగి నువ్వు ఎప్పుడు వస్తావా అని ఒంటి కాలు మీద నిలబడి ఉంటాము. ఇన్ని కోట్ల వానరములకు ప్రాణము పోసిన వాడిగా కీర్తి గడించెదవు గాక. నీ కోసం పుణ్య కర్మలను చేస్తూ ఇక్కడ నిలబడి ఉంటాము” అన్నారు.

హనుమంతుడు మానసిక ఉత్సాహమును పొంది లంకా పట్టణాన్ని మనస్సుతో చేరిపోయి ఉన్నాడు.

శ్రీరామాయణం – భక్తివాహిని

సంపాతి యొక్క కథ రామాయణంలో ఒక అద్భుతమైన ఘట్టం. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క సహాయం మాత్రమే కాదు, భక్తి, నిబద్ధత, ధైర్యం మరియు నిస్వార్థమైన సేవా భావానికి ఒక గొప్ప ఉదాహరణ.

https://youtu.be/bqDv7hjsgN8

bakthivahini

Share
Published by
bakthivahini

Recent Posts

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 13 శ్లోకాలు

Bhagavath Geetha Telugu ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో సందేహాలు, భయాలు, ఊహించని సమస్యలు ఎదురుకావడం చాలా…

7 hours ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 12 శ్లోకాలు

Bhagavath Geetha Telugu ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మీరెప్పుడైనా ఏమీ తోచని గందరగోళాన్ని అనుభవించారా? ఈ కాలంలో చాలామంది…

20 hours ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 10&11 శ్లోకాలు

Bhagavath Geetha Telugu మనిషి సాధారణంగా ఈ ప్రపంచాన్ని తన పరిమితమైన కళ్లతో చూస్తాడు. అందుకే ఒక చిన్న కష్టం…

2 days ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 9 వ శ్లోకం

Bhagavath Geetha Telugu మనం రోజూ ఉదయం లేవగానే ఏదో తెలియని ఒక గందరగోళం. "నా కెరీర్ ఏమవుతుంది? నా…

3 days ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 8 వ శ్లోకం

Bhagavath Geetha Telugu మనం సాధారణంగా మన కళ్ళతో చూసేదే నిజం అని నమ్ముతాం. ఒక వ్యక్తి కోపంగా మాట్లాడితే…

4 days ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 7 వ శ్లోకం

Bhagavath Geetha Telugu మన జీవితంలో చాలాసార్లు మనం చిన్న చిన్న సమస్యలకే కొండంత ఆందోళన పడతాం. రేపు ఏమవుతుందో,…

5 days ago