Categories: రామాయణం

Ramayanam Story in Telugu – రామాయణం 71

Ramayanam Story in Telugu- ఇంద్రజిత్ మరణవార్త విని రావణుడి దుఃఖం, ఆవేశం, తదుపరి యుద్ధ పరిణామాలు, లక్ష్మణుడికి మూర్ఛ, హనుమంతుడి సంజీవని తెచ్చే సాహసం, ఇంద్రుడి సహాయం, రామ రావణ యుద్ధం, రావణుడి సారథి వివేకం, లంకా ప్రజల ఆవేదన, చివరగా అగస్త్య మహర్షి ద్వారా ఆదిత్య హృదయం ఉపదేశం వంటి అంశాలు ఈ కథలో ఉన్నాయి.

భక్తివాహిని రామాయణ విభాగం

ఇంద్రజిత్ మరణం – రావణుడి తీవ్ర ఆవేదన

ఇంద్రజిత్ మరణవార్త వినగానే రావణుడు కుప్పకూలిపోయాడు. “నా కుమారుడు ఇంద్రజిత్ అజేయుడు. అలాంటివాడు ఇంత దారుణంగా ఎలా మరణించాడు? ఇక నాకీ జీవితం ఎందుకు? ఈ ఉపద్రవాలన్నింటికీ కారణమైన సీతను అంతం చేస్తాను!” అని రగిలిపోతూ, పెద్ద కత్తి పట్టుకుని సీత వద్దకు దూసుకొచ్చాడు. రావణుడి ఆగ్రహం చూసి సీతమ్మ భయంతో వణికిపోయింది.

సుపార్శ్వుడి హితబోధ

సీతను చంపడానికి రావణుడు సిద్ధమవగా, సుపార్శ్వుడు అడ్డుకుని ఇలా అన్నాడు: “మీరు ఇంత గొప్ప జీవితం జీవించి, ఎన్నో విద్యలు అభ్యసించి, ఎందరినో ఓడించి, మీవారు ఎందరో మరణించాక, ఒక స్త్రీని చంపారన్న అపకీర్తిని మూటగట్టుకుంటారా? మీరు నిజమైన వీరులైతే, యుద్ధంలో రాముడిని జయించండి. అంతేకానీ, ఒక ఆడదానిపై మీ ప్రతాపం ఎందుకు?” ఈ మాటలు విని రావణుడు శాంతించి, “రేపు అమావాస్య, రేపే రాముడితో యుద్ధం చేస్తాను” అని తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు.

భీకర యుద్ధం – రాక్షస వీరుల సంహారం

మరునాడు రావణుడు విరూపాక్షుడు, మహోదరుడు, సుపార్శ్వుడు వంటి రాక్షస వీరులతో యుద్ధానికి బయలుదేరాడు. ఆ భీకర యుద్ధంలో:

  • సుగ్రీవుడు విరూపాక్షుడిని, మహోదరుడిని సంహరించాడు.
  • అంగదుడు సుపార్శ్వుడిని అంతమొందించాడు.

రామబాణముల ప్రభావం

రాముడు తన ధనుస్సును మండలాకారంగా (వృత్తాకారంలో) పట్టుకుని బాణాలు వేస్తుంటే, లోపల ఉన్న కోరికలను ప్రేరేపించే జీవాత్మ కనపడనట్టుగా, రాముడి బాణాలు ఎక్కడ నుండి వస్తున్నాయో కనిపించకుండా రాక్షసులను ఛేదించాయి. ఏనుగుల తొండాలు తెగిపడ్డాయి, గుర్రాల కాళ్ళు విరిగిపోయాయి. లక్షల రాక్షస సైన్యం నేలకూలింది. రాముడు అగ్నిచక్రంలా తిరుగుతూ, మండలాకారంలో ధనుస్సు పట్టుకుని, కోట్ల మంది రాక్షసులను ఒక్కడే అంతం చేశాడు.

లక్ష్మణుడికి శక్తిఘాతం – హనుమంతుడి సంజీవని

తన ఇంటి గుట్టును రాముడికి చెప్పి, ఇంతమంది రాక్షసుల మరణానికి కారణమైన విభీషణుడు అనుకుని, రావణుడు శక్తి అనే అస్త్రాన్ని విభీషణుడిపై ప్రయోగించబోయాడు. అయితే లక్ష్మణుడు తన బాణాలతో రావణుడి చేతిని కొట్టి అడ్డుకున్నాడు. ఆగ్రహించిన రావణుడు ఆ శక్తిని లక్ష్మణుడిపై ప్రయోగించాడు. ఆ శక్తి లక్ష్మణుడి వక్షస్థలం నుంచి దూసుకుపోయింది. వెంటనే లక్ష్మణుడు మూర్ఛపోయి కిందపడిపోగా, హనుమంతుడు లక్ష్మణుడిని ఎత్తి రాముడి దగ్గర పెట్టాడు.

లక్ష్మణుడి పరిస్థితి చూసి రాముడు తీవ్రంగా బాధపడ్డాడు. “నా చేతి నుండి ధనుస్సు జారిపోతున్నది, మంత్రాలు జ్ఞాపకానికి రావడము లేదు. ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, బంధువులు దొరుకుతారు. కానీ తోడబుట్టినవాడు జీవితంలో ఒక్కసారే వస్తాడు” అని విలపించాడు.

అప్పుడు హనుమంతుడు “రామా! మీరు దిగులు పడకండి. లక్ష్మణుడిని ఎలా బ్రతికించుకోవాలో నాకు తెలుసు” అని ఆకాశంలోకి ఎగిరి, హిమాలయాలను చేరుకొని అక్కడ ఉన్న ఓషధ పర్వతాన్ని తీసుకొచ్చాడు. సుషేణుడు ఆ ఓషధుల రసాన్ని లక్ష్మణుడి ముక్కులో పిండగానే, ఆ వాసన తగిలి లక్ష్మణుడు తిరిగి స్పృహలోకి వచ్చాడు.

ఇంద్రుడి సహాయం – రామ రావణ యుద్ధం

“ఇక నేను యుద్ధం చేస్తాను ఈ రావణుడితో” అని రాముడు ముందుకు బయలుదేరాడు. ఆ సమయంలో ఆ యుద్ధాన్ని ఆకాశంలో నుండి చూస్తున్న దేవతలు “దుర్మార్గుడు, దుష్టుడు అయిన రావణుడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు. మహానుభావుడైన రాముడు భూమి మీద నుండి యుద్ధం చేస్తున్నాడు” అని అనుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన సారధి మాతలిని పిలిచి, రాముడికి సహాయం చేయమని తన రథాన్ని ఇచ్చి పంపించాడు.

మాతలి రాముడితో “రామా! ఇంద్రుడు ఈ రథాన్ని పంపించాడు. దీనికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉన్నాయి. పూర్తిగా కాల్చిన బంగారంతో ఈ రథం నిర్మించబడినది. ఇందులో అక్షయ బాణ తూణీరాలు, ఇంద్రుడు పట్టుకునే గొప్ప ధనుస్సు ఉన్నాయి. మీరు ఈ రథాన్ని అధిరోహించండి. శ్రీ మహావిష్ణువును గరుడుడు వహించినట్లు, నేను మీకు సారధ్యం చేస్తాను. మీకు ఇవ్వమని ఇంద్రుడు ఈ శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు. మీరు దీన్ని స్వీకరించండి” అన్నాడు.

రాముడు ఆ రథానికి నమస్కరించి, దానిలోకి ఎక్కాడు. రాముడికి, రావణుడికి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. రాముడి బాణాల వేగాన్ని తట్టుకోలేక రావణుడు వెనక్కి వెళ్ళాడు. వారిద్దరి యుద్ధం జరుగుతుండగా ఆకాశం అంతా చీకటిగా మారిపోయింది. పగటి వేళలో వారి బాణ పరంపర ఆకాశాన్ని కప్పేసింది. రాముడు “ఇక మీరెవరూ యుద్ధం చేయకండి. అలా నిలబడి చూడండి. రావణుడో – రాముడో తేలిపోవాలి” అన్నాడు.

రామ – రావణ యుద్ధం పరాకాష్ట

అటుపక్క రాక్షసులు, ఇటుపక్క వానరులు నిలబడి రామ-రావణ యుద్ధాన్ని చూస్తున్నారు. రావణుడు తన ఇరవై చేతులతో ఆయుధాలను రాముడిపై ప్రయోగిస్తున్నాడు. ఆ సమయంలో రావణుడు శక్తి అనే అస్త్రాన్ని రాముడిపై విడిచిపెట్టాడు. అప్పుడు రాముడు “ఈ రథం ఎక్కాక, లక్ష్మణుడు బ్రతికాక నాకు విపరీతమైన ఆనందం కలుగుతున్నది.

అన్ని అస్త్ర-శస్త్రాలు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఉత్సాహం పొంగిపొర్లుతోంది” అనుకొని ఇంద్రుడు ఇచ్చిన శక్తిని ప్రయోగించాడు. ఇద్దరి శక్తులు ఆకాశంలో కొట్టుకొని నిర్వీర్యమై కిందపడిపోయాయి. రాముడు వేసిన బాణాలను రావణుడు తట్టుకోలేకపోయాడు. అతని చేతిలోని ధనుస్సు విరిగిపోయింది. అటువంటి సమయంలో రావణుడి సారధి అతని రథాన్ని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయాడు.

సారథి వివేకం – రావణుడి పశ్చాత్తాపం

యుద్ధభూమి నుండి రథాన్ని తీసుకెళ్ళిన సారథిపై రావణుడు ఆగ్రహించి “ఛీ నీచుడా! ఇటువంటి అపకీర్తి నా జీవితంలో లేదు. యుద్ధభూమిలో ఉండగా నా తలలు తెగిపోయినా పరవాలేదు. నువ్వు రథాన్ని చాటుకి తీసుకొచ్చి దాచావు. నువ్వు శత్రువుల దగ్గర లంచం తీసుకున్నావు కనుకనే ఇలాంటి పని చేసావా నిజం చెప్పు?” అని నిలదీశాడు.

అప్పుడు సారధి “మీ దగ్గర ఇంతకాలం పని చేశాను. ఇప్పుడు ఒకరి దగ్గర లంచం తీసుకుని మిమ్మల్ని అవమానించవలసిన అవసరం నాకు లేదు. నేను శాస్త్రం తెలియనివాడిని, మర్యాద తెలియనివాడిని కాదు. రథికుడు రథంలో ఉండగా ఎలా నడపాలో తెలియని భ్రష్టుడిని కాదు. నేను ఎంతో కాలంగా మీ ఉప్పు తిన్నాను. మీయందు కృతజ్ఞుడనై ఉన్నాను. ద్వంద్వ యుద్ధం జరుగుతున్నప్పుడు సమయోచితంగా అవసరాన్ని బట్టి రథాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి, దూరంగా కూడా తీసుకెళ్ళాలి.

గుర్రాలు అలసిపోతున్నాయేమో చూసుకోవాలి. వెనుక ఉన్న రథికుడి పరిస్థితిని గమనించుకోవాలి. రాముడి బాణపు వేడిచేత గుర్రాలు శోషించిపోయాయి. తిరిగి ఆయుధాన్ని ప్రయోగించలేని నీరస స్థితిని మీరు పొందుతున్నారు. అప్పుడు రథికుడిని రక్షించుకోవలసిన బాధ్యత సారధికి ఉంది. అందుకని నేను రథాన్ని వెనక్కి తెచ్చాను. అంతేగాని ఒకరి దగ్గర లంచం తీసుకుని మిమ్మల్ని తేవలసిన అవసరం నాకు లేదు. మీ సేవలో ధన్యుడను అవ్వడానికి నీతికి కట్టుబడిన సారధిని నేను” అని వినయంగా బదులిచ్చాడు.

సారథి మాటలు విని రావణుడు పశ్చాత్తాపపడి “నేను నిన్ను ఎన్ని మాటలు అన్నాను. నువ్వు ఉత్తమ సేవకుడివి” అని చెప్పి, తన చేతికున్న స్వర్ణ కంకణాన్ని తీసి సారధికి ఇచ్చాడు.

లంకా ప్రజల ఆవేదన – శూర్పణఖ ప్రస్తావన

ఈ సమయంలోనే లంకాపట్టణంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకుంటున్నారు: “ఆ శూర్పణఖ జుట్టు తెల్లబడిపోయి, వృద్ధురాలు అయిపోయింది. ఒళ్ళు ముడతలు పడిపోయింది. భయంకరమైన, వికృతమైన స్వరూపంతో ఉంటుంది. జారిపోయిన కడుపుతో, కఠినమైన మాట కలిగినటువంటిది. అటువంటి శూర్పణఖ మన్మధుడితో సమానమైన ఆకృతి కలిగినవాడిని, అంత మధురంగా మాట్లాడగలిగినవాడిని, అటువంటి సౌందర్యరాశిని, చక్కటి నడవడి కలిగినవాడిని, సర్వకాలములయందు ధర్మాన్ని అనుష్టించేవాడయిన రాముడిని ఏ ముఖం పెట్టుకొని కామించింది? రాముడిని పొందాలన్న కోరిక ఎలా కలిగింది? ఆ రాముడు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే కడుపులో కక్ష పెంచుకొని, సీతాపహరణానికి దారితీసేటట్టుగా, రావణుడి మనస్సు కలతచెందేటట్టుగా ఎలా మాట్లాడగలిగింది? రావణుడు ఎంత మూర్ఖుడు! రాముడు అరణ్యంలో పదునాలుగు వేలమంది రాక్షసులను, ఖర-దూషుణలను సంహరించాడు. అలాంటివాడితో సంధి చేసుకుందామని ఆలోచించకుండా శూర్పణఖ మాటలు విని సీతను అపహరించడానికి వెళ్ళాడు.

పోనీ అప్పటికి రాముడు అంత పరాక్రమం ఉన్నవాడని రావణుడు తెలుసుకోలేకపోయాడు అనుకుందాము. రాజ్యభ్రష్టుడై అన్నగారి చేత తరమబడి, ఋష్యమూక పర్వత శిఖరాలపై కూర్చున్న సుగ్రీవుడిని రక్షించడం కోసమని ఆయనతో స్నేహం చేసుకొని, వాలిని ఒక్క బాణంతో సంహరించి, చేసుకున్న స్నేహానికి, ఒప్పందానికి నిలబడి సుగ్రీవుడిని రాజ్యంలో ప్రతిష్టించినప్పుడైనా రావణుడి కళ్ళు తెరచుకోలేదా?

అప్పుడు కూడా తెలుసుకోలేకపోయాడు అనుకుందాము. విభీషణుడు ధర్మబద్ధమైన మాట చెప్పాడు ‘అన్నయ్యా! నువ్వు రాముడిని జయించలేవు. లంక అంతా నాశనమయిపోతుంది. నువ్వు చేసినది పాపపు నడవడితో కూడిన పని. నా మాట విని సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి ఇయ్యి’ అని చెప్పాడు. విభీషణుడి మాటలు కాని రావణుడు విని ఉంటే ఈరోజు లంకాపట్టణానికి ఇంతటి చేటుకాలం దాపురించేది కాదు. తోడబుట్టినవాడైన కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోయాడు. తన కుమారులైన నరాంతకుడు, అతికాయుడు మొదలైన వారందరూ మరణించారు. మహోదర, మహాపార్షులు మొదలైనవారు మరణించారు. ఆఖరికి ఇంద్రజిత్ కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు. ఇంతమంది చనిపోయాక కూడా వచ్చినవాడు సామాన్య నరుడు కాదన్న ఆలోచన రావణుడికి రావడం లేదా?”

రావణుడి అంతానికి శివుడి వరం – సీతమ్మ జననం

ఒకానొకసారి దేవతలందరూ కూడా రావణుడు చేస్తున్న ఆగడాలను భరించలేక అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి “అయ్యా! రావణుడు చేస్తున్న ఆగడాలు మేము భరించలేకపోతున్నాము. నరవానరుల చేతిలో తప్ప వాడికి ఎవరి చేతిలో చావు లేదు. ఈరోజు వాడి ముందుకెళ్ళి నిలబడగలిగే ధైర్యం ఎవరికీ లేదు. సముద్రము కూడా అలలతో వాడి ముందు నిలబడటానికి భయపడుతున్నది.

సూర్యుడు గట్టిగా ప్రకాశించడము లేదు. అలా దిక్పాలకులను కూడా శాసించగలిగే స్థితిలో ఉన్నాడు. వాడి చేతిలో లోకాలన్నీ పీడింపబడుతున్నాయి. మేము ఎలా జీవించాలి?” అని అడిగారు. అప్పుడు బ్రహ్మగారు “నేను ఈరోజు నుండి ఒక కట్టుబాటు చేస్తున్నాను. ఈ రాక్షసులు మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటారు. ఒక చోట ఉండరు. దానివల్ల మీకు కొంత ఉపశాంతి కలుగుతుంది” అని అన్నారు.

దానివల్ల ఆ దేవతలు పూర్తి ఉపశాంతిని పొందకపోవడం చేత శివుడి కోసం తపస్సు చేశారు. త్రిపురములను తన కంటి మంట చేత నశింపజేసిన పరమశివుడు ఆ దేవతలయందు ప్రీతి చెంది వారి ముందు ప్రత్యక్షమై “ఇంత తపస్సు కలిగిన రావణుడు మరణించడానికి కావలసిన విధంగా సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతున్నది” అని ఆ రోజున శివుడు దేవతలకు వరం ఇచ్చాడు. రావణుడు అపహరించి తీసుకొచ్చిన ఆ మైథిలి సాక్షాత్తుగా రావణుడి ప్రాణాలను తీసుకోడానికి, ఈ లంకాపట్టణాన్ని సర్వనాశనం చేయడానికి, రాక్షసులందరినీ పరిమార్చడానికి కాళరాత్రిలా వచ్చింది. ఈ విషయాన్ని రావణుడు తెలుసుకోలేక రాముడి మీదకి యుద్ధానికి వెళుతున్నాడు” అని లంకా పట్టణంలోని ప్రజలు చెప్పుకుంటున్నారు.

రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశం

రాముడు అలసిపోయినవాడై “ఈ రావణుడిని అసలు ఎలా సంహరించడం” అని ఆలోచిస్తుండగా, ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఋషులు మొదలైనవారందరూ ఆకాశంలో నిలబడ్డారు. అందరితోపాటుగా వారిలోకి గబగబా అగస్త్య మహర్షి వచ్చి “రామా! రామా! ఇప్పుడు నేను నీకు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తున్నాను. దీనిని నువ్వు స్వీకరించు. ఇది నువ్వు పొందాక ఇక నీకు ఏ విధమైన అలసట ఉండదు. ఈ పరమమంగళమైన ఆదిత్యహృదయాన్ని నీకు భయం కలిగినప్పుడు కాని, అరణ్యంలో ఉన్నప్పుడు కాని చదువుకుంటే నీకు రక్ష చేస్తుంది” అని చెప్పి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు.

అగస్త్య మహర్షి రాముడితో ఇలా అన్నారు: “ఈ ఆదిత్య హృదయాన్ని పఠించు. దీని ద్వారా నీవు నీ శత్రువులందరినీ జయిస్తావు. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. రావణుడు నీ చేతిలో తప్పక హతమవుతాడు.”

ఈ మాటలు విని రాముడు ఆ ఆదిత్య హృదయాన్ని మూడుసార్లు పఠించాడు. అనంతరం అగస్త్య మహర్షి అక్కడి నుంచి నిష్క్రమించారు.

ఈ ఘట్టం రామాయణంలో అత్యంత రక్తసిక్త ఘట్టం. ఇందులో సీతమ్మ ప్రాణాపాయం, లక్ష్మణుని మూర్చ, రాముని బాధ, హనుమంతుని త్యాగం, దేవతల అనుగ్రహం అన్నీ మిళితమై ఒక గంభీర ఘట్టంగా నిలుస్తాయి. రావణుని ధర్మ బద్ధతను సారధి మాటల ద్వారా కూడా మనం చూడగలము. ఇది ఒక మానవతా విలువలకి, ధర్మ యుద్ధానికి జీవవిభిన్నతను తెలిపే శాస్వత ఘట్టం.

🔹 Rama receives Indra’s chariot from Matali | Ramayan Full Scene

bakthivahini

Share
Published by
bakthivahini

Recent Posts

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 15 శ్లోకాలు

Bhagavath Geetha Telugu జీవితం అనే ప్రయాణంలో మనం తరచుగా ఒత్తిడి, భయం, మరియు గందరగోళానికి లోనవుతుంటాం. "ఈ సమస్యలతో…

1 hour ago

Ugadi 2026 ప్రత్యేకత: ఆధ్యాత్మిక అర్థం, తేదీ, శుభ ముహూర్తం & ఉగాది పచ్చడి జీవన పాఠాలు

Ugadi 2026 ప్రకృతి పాత ఆకులను రాల్చేసి, కొత్త చిగురులు తొడుగుతున్న సమయం. మన చుట్టూ ఉన్న గాలిలో ఒక…

4 hours ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 14 శ్లోకాలు

Bhagavath Geetha Telugu మన జీవితంలో ఎప్పుడో ఒకసారి కొన్ని క్షణాలు ఎదురవుతాయి—అవి మన ఆలోచనా విధానాన్ని, మన వ్యక్తిత్వాన్ని…

1 day ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 13 శ్లోకాలు

Bhagavath Geetha Telugu ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో సందేహాలు, భయాలు, ఊహించని సమస్యలు ఎదురుకావడం చాలా…

2 days ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 12 శ్లోకాలు

Bhagavath Geetha Telugu ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మీరెప్పుడైనా ఏమీ తోచని గందరగోళాన్ని అనుభవించారా? ఈ కాలంలో చాలామంది…

3 days ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 10&11 శ్లోకాలు

Bhagavath Geetha Telugu మనిషి సాధారణంగా ఈ ప్రపంచాన్ని తన పరిమితమైన కళ్లతో చూస్తాడు. అందుకే ఒక చిన్న కష్టం…

4 days ago