వకుళాదేవి పూర్వజన్మ వృత్తాంతం
Venkateswara Swamy Katha-వకుళాదేవి గొప్ప విష్ణుభక్తురాలు. ఆమె పూర్వజన్మలో యశోదాదేవి. కృష్ణునిపై ఆమెకున్న ప్రేమాభిమానాలు ఈ జన్మలోనూ అలాగే ఉన్నాయి. ఆమె నిత్యం గోపాలకృష్ణుని ధ్యానిస్తూ, ఆయన ప్రసాదాన్నే స్వీకరిస్తూ, కొండపై ఉన్న వరాహస్వామిని సేవిస్తూ తన శేషజీవితాన్ని గడుపుతోంది.
శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల కుమారుడే అయినప్పటికీ, కంసుని భయం వల్ల వసుదేవుడు ఆయనను వ్రేపల్లెకు తీసుకువెళ్లి యశోదమ్మ చెంతన ఉంచాడు. అప్పటి నుండి కృష్ణుని ఆలనాపాలనా, ముద్దు ముచ్చట్లన్నీ యశోదమ్మే చూసుకుంది. కృష్ణుడు చిన్నప్పటి నుండి ఎన్నో అల్లరి పనులు చేశాడు, వాటినన్నింటినీ యశోదమ్మ సహించింది. పెరిగి పెద్దయ్యాక ఆయన అష్టభార్యలను వివాహం చేసుకున్నాడు. కానీ, కృష్ణుని ఒక్క వివాహం కూడా యశోదమ్మ చూడలేకపోయింది.
ఆమె తన కోరికను కృష్ణునితో చెప్పగా, “అమ్మా, నా లీలలన్నీ పూర్తయ్యాయి. నీ కోరిక తీర్చడానికి ఇది సమయం కాదు. రాబోయే కలియుగంలో ఆ కళ్యాణ వేడుకను చూసే అవకాశం నీకు లభిస్తుంది. అప్పుడు నన్ను ఆశీర్వదించు తల్లీ” అని ఆయన ఆమెకు మాట ఇచ్చాడు. మరుజన్మలో యశోదమ్మ వకుళగా పిలువబడుతూ వరాహస్వామి ఆశ్రమంలో ఉంటోంది.
శ్రీనివాసుని రాక
శ్రీహరి ఆనాటి వాగ్దానం ప్రకారం వకుళాదేవి వద్దకు వచ్చి “అమ్మా” అని పిలిచాడు. ఆ పిలుపుతో వకుళాదేవి తన కుమారుడు కృష్ణుడే వచ్చినట్లు భావించింది.
వెంటనే వకుళాదేవి శ్రీహరిని కొండపై తపస్సు చేసుకుంటున్న వరాహస్వామి వద్దకు తీసుకువెళ్లింది. వారి అడుగుల చప్పుడు విని వరాహస్వామి కళ్ళు తెరిచి, “ఎవరీ కొత్త వ్యక్తి? ఎందుకొచ్చాడు?” అని చూడగా, శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడై శంఖచక్రగదాపద్మాలు ధరించి వరాహస్వామికి దర్శనమిచ్చాడు.
వరాహస్వామి ప్రశ్నలు, శ్రీహరి సమాధానం
వరాహస్వామి ఆశ్చర్యపోయి, “హరీ! ఇలా వచ్చావేమి? లక్ష్మీదేవి ఏది? నీ ముఖంలో విచారం కనిపిస్తోంది. ఏ దానవుడైనా భూలోకాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడా? నా సహాయం ఏమైనా కావాలా?” అని ఆత్రుతగా ప్రశ్నించాడు.
శ్రీహరి తన కథను వివరిస్తూ, “వరాహా! నా చరిత్ర ఏమి చెప్పను? నేను వైకుంఠంలోనే ఉంటున్నాను, లక్ష్మి నా హృదయ పీఠంలోనే ఉంటోంది. ఒకరోజు భృగు మహర్షి తన సహజ అహంకారంతో నా హృదయంపై కాలితో తన్నాడు. అందుకు లక్ష్మీదేవి కోపించి నన్ను విడిచి భూలోకంలోని కొల్లాపురానికి చేరుకుంది. ఆమెను ఎంత బతిమాలినా వినలేదు.
లక్ష్మీదేవి లేని వైకుంఠం కళావిహీనమైపోయింది. ఆమెను వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చి ఒక పుట్టలో నివసిస్తుండగా, ఒక ఆవు ప్రతిరోజూ వచ్చి నా ఆకలి తీర్చడానికి తన పాలను నా నోటిలో విడిచేది. ఒకరోజు పశువుల కాపరి అది చూసి ఆవును గొడ్డలితో కొట్టబోతుండగా నేను అడ్డుపడ్డాను. ఆ దెబ్బ నాకు తగిలి రక్తం కారింది. ఆ గాయం మాన్పుకోవడానికి వనమూలికల కోసం వెతుక్కుంటూ వకుళాదేవి ఆశ్రమానికి వచ్చాను. ఆమె నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది” అని చెప్పాడు.
వరాహస్వామి సూచనలు
వరాహస్వామి శ్రీహరిని ఓదార్చి, “విచారించకు. ఈ రోజు నుండి నా ఆశ్రమంలోనే ఉండు. వకుళాదేవి నీకు సేవలు చేస్తుంది. వకుళా! ఈయన ఎవరో నీకు తెలుసా? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ద్వాపరయుగంలో నీవు యశోదాదేవివి. ఈయన కృష్ణనామంతో నీ ఇంట్లో నీ కుమారునిగా పెరిగాడు. ఈ జన్మలో కూడా నీ బిడ్డగానే ఉంటాడు. నీవు ఆయనకు సేవలు చేస్తూ ఉండు” అని ఆజ్ఞాపించాడు.
శ్రీనివాసుని సేవలు
వరాహస్వామి వద్ద సెలవు తీసుకుని ఇద్దరూ వకుళాశ్రమానికి వచ్చారు. అప్పటి నుండి శ్రీహరి శ్రీనివాసుడనే పేరుతో వకుళాదేవి సేవలతో తృప్తి చెందుతూ ఉన్నాడు. వకుళాదేవి శ్రీనివాసుని భక్తిశ్రద్ధలతో సేవించింది. అందుకే శ్రీనివాసుని విగ్రహం మెడలో ఇప్పటికీ బొగడపూల దండ అలంకరించి ఉంది. ఆమె ధన్యజీవి, పుణ్యవంతురాలు కాబట్టే శ్రీహరిని చేరుకోగలిగింది.