Karthika Puranam Telugu
దూర్వాసుడు తిరిగి రావడం
అంబరీషుడు దూర్వాసునికి నమస్కరించి ఇలా అన్నాడు : “మహామునీ! నేను బహు పాపాత్ముడను. ఆకలితో ఉండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసటపాలు చేసిన మందభాగ్యుడను. అయినా నాయందు దయతో మరల నా ఇంటికి అతిథిగా వచ్చితివి.”
అనంతరం, “దయచేసి నా ఇంట విందారగించి, నా సర్వదోషాలనూ ఉపశమింప చెయ్యి” అని ప్రార్థించాడు.
దూర్వాసుడు అంబరీషుడిని తన బాహువులతో లేవనెత్తి , “రాజా! ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడవయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కానీ, బ్రాహ్మణుడనూ, తాపసినీ, నీ కన్నా వయోవృద్ధుడినీ అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందేగాని మేలు చేయదు. అందువల్ల నీకు నమస్కరించబడం లేదని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను. అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనమును చేయడం మహాభాగ్యం” అని చెప్పాడు.
అలా చెప్పి, అతని ఆతిథ్యాన్ని స్వీకరించి, విష్ణుభక్తుల మహాత్మ్య ప్రకటనార్థం, పరీక్షకునిగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు.
ఏకాదశి వ్రత ఫలం
కాబట్టి, కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవాస జాగరణలు చేసి , ద్వాదశినాడు దానాదులను (క్షీరాబ్ది ద్వాదశీ వ్రతం) నిర్వర్తించి , బ్రాహ్మణ సమేతుడై, ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలూ అంతరించి పోతాయి. ఈ పుణ్యగాథను చదివినా, చదివించినా, రాసినా, వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలనూ పొంది, పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు.
శౌనకాది ఋషుల ప్రశ్నలు
పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్మ్యాన్ని విని, శౌనకాది ఋషులు ఇలా అడిగారు : “కలియుగ కల్మషగతులు, రాగాది పాశయుక్త సంసారగ్రస్తులూ అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది? అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేది? దేవతలందరిలోకీ దేవాదిదేవుడెవరు? దేని వల్ల మోక్షం కలుగుతుంది? మోహము దేనివలన నశిస్తుంది? జరామృత్యు పీడితులు, జడమతులు, మందులూ , అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకు పోయే తెరువేమిటీ?”
సూతుడి సమాధానం
అందుమీదట సూతుడిలా చెప్పసాగాడు : “మంచి ప్రశ్నలను వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థ క్షేత్రాటనా స్నానాల వల్లా – వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్లా కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకూ నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విష్ణు ఆనందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమధర్మము.”
“సర్వశాస్త్రాలనీ వివరించి చెప్పేందుకు నేను సమర్థుడినీ గాను, సమయమూ చాలదు. గనుక, అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి. విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు.”
కార్తీక వ్రత మహిమ
- విష్ణుగాథలను వినేవాళ్లు విగతపాపులై, నరకదూరులై ఉంటారు.
- హరి ప్రీత్యర్థులుగా స్నాన, దాన, జప, పూజా, దీపారాధనాదులను చేసే వాళ్ల పాపాలన్నీ వాటికవే పటాపంచలై పోతాయి.
- సూర్యుడు తులారాశి యందుండే నెల రోజులూ కూడా విడవకుండా కార్తీక వ్రతమాచరించే వాళ్లు జీవన్ముక్తులవుతారు.
- కార్తీక వ్రతమును చేయని వాళ్లు – కుల, మత, వయో, లింగభేద రహితంగా – ‘అంధతామిత్రము’ అనే నరకాన్ని పొందుతారు.
- కార్తీకంలో కావేరీ నదీ స్నానం చేసిన వాళ్లు దేవతలచే కీర్తించబడుదురు, విష్ణులోకాన్ని చేరుదురు.
- కార్తీక స్నానమును చేసి, విష్ణ్వర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ వ్రతాచరణ చేయని వాళ్లు వెయ్యిసార్లు ఛండాలపు జన్మల పాలవుతారు.
- సర్వశ్రేష్ఠము, హరిప్రీతిదాయకమూ, పుణ్యకరమూ అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు.
- సూర్యుడు తులారాశిలో ఉండగా, కార్తీక, స్నాన, దాన, జప పూజాదులు చేసే వాళ్లు – సర్వదుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు.
దీపదానం, కంచుపాత్రదానం, దీపారాధానం, ధన-ఫల-ధాన్య-గృహాది దానాలూ అమిత పుణ్యఫలదాలు.
కార్తీకం ముప్పయి రోజులూ కార్తీక మహాత్మ్యాన్ని వినినా, పారాయణ చేసినా కూడా – సకలపాపాలూ నశించిపోతాయి , సంపత్తులు సంభవిస్తాయి , పుణ్యాత్ములౌతారు. ఇన్ని మాటలెందుకు? విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ గూడా కలుగుతాయి.
పదునాలుగవ (చతుర్దశ దిన) రోజు పారాయణము సమాప్తము.