తార మాటలు
Ramayanam Story in Telugu- “ఓ లక్ష్మణా! ఎందుకంత కోపంగా ఉన్నావు? నిన్ను ఇంత కోపానికి గురి చేసిన వాళ్ళు ఎవరు? ఎండిపోయిన చెట్లతో నిండిన అడవిని మంటలు కాల్చేస్తుంటే, వాటికి ఎదురుగా వెళ్ళే ధైర్యం ఎవరికి ఉంటుంది?” అని తార అడిగింది.
లక్ష్మణుడి సమాధానం
లక్ష్మణుడు బదులిస్తూ, “నీ భర్త చేసే పనులు నీకు తెలియదా? నీ భర్త ధర్మాన్ని వదిలిపెట్టి, కేవలం కోరికల వెంటే తిరుగుతున్నాడు. (మనకు ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే నాలుగు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ధర్మబద్ధంగా సంపాదించిన డబ్బు, ధర్మబద్ధమైన కోరికలు (భార్యతో మాత్రమే సుఖాన్ని పొందడం) మోక్షానికి దారి తీస్తాయి. ధర్మాన్ని వదిలి మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని సుఖాలు అనుభవించినా ప్రమాదమే వస్తుంది). తన స్నేహితుడికి ఇచ్చిన మాట తప్పాడు. నాలుగు నెలల సమయం గడిచిపోయింది.
రాజు రాజ్యపాలన గురించి ఆలోచించడం లేదు. మమ్మల్ని బాధలో ఉన్నవాళ్ళను పట్టించుకోవడం లేదు. మంత్రులతో కలిసి ఆలోచించకుండా, కేవలం తాగుడులోనే మునిగిపోయాడు.
రాజు అంటే కేవలం సుఖాలు అనుభవించడం కాదు. రాజు మొదట మంత్రులతో కలిసి ఆలోచించి రాజ్య కార్యాలు చేయాలి. నీ భర్త ఇవన్నీ చేస్తున్నాడా? వర్షాకాలంలో వెతకడం కష్టం కాబట్టి, ఈ నాలుగు నెలలు సుఖాలు అనుభవించి, తర్వాత స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం సహాయం చేయమంటే, ఇచ్చిన సమయం దాటిపోయినా ఇంకా కామసుఖాలలో మునిగి ఉన్న సుగ్రీవుడిది తప్పు కాదా? ఈరోజు నీ భర్త ఎప్పుడూ తాగుతూ ఉండడం వల్ల అతని బుద్ధి సరిగా లేదు. తాగుడులో మునిగిపోయిన సుగ్రీవుడు ముఖ్యమైన విషయాలన్నిటినీ వదిలేశాడు” అన్నాడు.
తార యొక్క హితవు
తార “నాయనా! ఇది కోప్పడవలసిన సమయం కాదు. ఎవరో బయటి వాళ్ళు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా అరవచ్చు, వారిని ఆపవచ్చు లేదా శిక్షించవచ్చు. కానీ ఈరోజు నీ అన్నతో సమానమైన సుగ్రీవుడు కోరికలకు బానిస అయ్యాడు. అలాంటి సుగ్రీవుడి మీద నీకు ఇంత కోపం తగదు. ‘సుగ్రీవుడిది తప్పు’ అని నువ్వు చెప్పింది నిజమే. నువ్వు మంచి గుణాలు కలిగిన వాడివి కాబట్టి సుగ్రీవుడిని క్షమించు. లక్ష్మణా! నీకు చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. నీకు శాస్త్ర మర్యాద తెలుసు. నా భర్తకు చాలా తక్కువ మంచి గుణాలు ఉన్నాయి. కోరికలకు లొంగిపోయాడు. మరి నువ్వు కోపానికి ఎందుకు లొంగిపోతున్నావు?
లక్ష్మణా! నువ్వు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి అరుస్తున్నావు. రాముడు బాణం వేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సుగ్రీవుడు ఎంత విలువైన సమయాన్ని వృథా చేసుకున్నాడో నాకు తెలుసు. దానివల్ల రాముడు ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఈ మూడు తప్పులు జరిగాయి కాబట్టి మీకు ఎలా సహాయం చేయాలో కూడా నాకు తెలుసు. ఎంతో బలమైన మన్మథుని బాణాల దెబ్బకు కామానికి ఎంత తొందరగా పడిపోతారో, ఏ కాముని బాణాల దెబ్బకు సుగ్రీవుడు ఇలా ఉన్నాడో, ఆ సుగ్రీవుడు ఎవరితో సంతోషంగా ఉన్నాడో నాకు తెలుసు. శత్రువులను చంపే ఓ లక్ష్మణా! ఈరోజు సుగ్రీవుడు తన కోరికలకు లొంగిపోయాడు. ఆయనకు రాముడి మీద ఎలాంటి ద్వేషం లేదు. అందుకని నువ్వు ఆయనను క్షమించి తీరాలి.
నేను కొత్తగా చెప్పాలా! నీకు తెలియదా? సంసారాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకునే గొప్ప ఋషులు కూడా ఇంద్రుడు పంపిన అందమైన అప్సరసలను చూసి కోరికలకు లొంగి తమ తపస్సును పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత గొప్ప ఋషులే కామానికి లొంగిపోయినప్పుడు, చంచలమైన బుద్ధి కలిగిన వానరుడు కామంతో చేయవలసిన పనిని కొన్ని రోజులు మరిచిపోవడం పెద్ద విషయం కాదు. సుగ్రీవుడు ఇంతగా కామానికి లొంగిపోయినప్పటికీ కూడా మీకు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఎప్పుడో ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
లక్ష్మణా! పరాయివాడిలా ఇక్కడే నిలబడి ఉన్నావు. నువ్వు లోపలికి రాకూడదా! నువ్వేమైనా పరాయివాడివా! సుగ్రీవుడు పడుకున్న మందిరంలోకి వస్తే లోపలి స్త్రీలు కనిపిస్తారని అనుకుంటున్నావా! చెడు ఆలోచనలు లేకుండా స్నేహితుడితో కూర్చుని మాట్లాడే మంచి చరిత్ర, మంచి నడవడిక కలిగినవాడు లోపలికి రావచ్చు. ఏమి తప్పులేదు, లోపలికి రా” అని చెప్పింది.
సుగ్రీవుడి పశ్చాత్తాపం
బంగారు కాంతులతో మెరిసిపోతున్న సుగ్రీవుడు తన తొడ మీద రుమని కూర్చోబెట్టుకొని గట్టిగా కౌగలించుకొని ఉన్నాడు. తెర తీయగానే లక్ష్మణుడు లోపలికి రావడం చూసి సుగ్రీవుడికి తన తప్పు గుర్తుకు వచ్చింది. వెంటనే లేచి లక్ష్మణుడి దగ్గరికి వచ్చి తల వంచి నమస్కరించాడు.
లక్ష్మణుడి కోపం
సుగ్రీవుడిని చూడగానే లక్ష్మణుడికి కోపం వచ్చి “సుగ్రీవా! రాజు మంచి వంశంలో పుట్టి ఉండాలి. దయ కలిగి ఉండాలి. కోరికలను జయించినవాడై ఉండాలి. చేసిన సహాయాన్ని మరిచిపోకూడదు. మాట తప్పకూడదు. అలాంటి వాడిని ఈ లోకం రాజు అని గౌరవిస్తుంది. స్నేహితుడి దగ్గర సహాయం పొంది, ఆ స్నేహితుడికి తిరిగి సహాయం చేయని వాడిని ఈ లోకం క్రూరుడు అని పిలుస్తుంది.
ఎవరైనా గుర్రం విషయంలో అబద్ధం చెబితే అంటే ఎవరికైనా గుర్రం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండడం నూరు గుర్రాలను చంపిన పాపం వస్తుంది. ఆవు విషయంలో అబద్ధం చెబితే వెయ్యి ఆవులను చంపిన పాపం వస్తుంది. సహాయం చేస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకోని వాడు తన బంధువులందరినీ చంపి వారిని తినేసి తనను తాను చంపుకున్న వాడితో సమానం అవుతాడు. ఒకరి దగ్గరికి వెళ్ళి ‘అయ్యా! మీరు నాకు సహాయం చేయండి, నేను మీకు తిరిగి సహాయం చేస్తాను’ అని మాట తీసుకుని వారి దగ్గరి నుండి సహాయం పొంది దాని ఫలితాన్ని అనుభవిస్తూ తాను ఇచ్చిన మాట మరిచిపోయిన వాడిని లోకం అంతా కలిసి చంపేస్తుంది.
బ్రహ్మహత్య చేసిన వాడికి, తాగుబోతుకు, దొంగకు, ఒక వ్రతం చేస్తానని చెప్పి చేయకుండా మానేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉండవచ్చు. కానీ కృతఘ్నుడికి ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు రాముడికి సహాయం చేస్తానని ఒప్పుకున్నావు కానీ తిరిగి సహాయం చేయలేదు. నీ ప్రవర్తన చూసి మా అన్నయ్య నిన్ను మంచివాడు అనుకున్నాడు. నువ్వు కప్పలా అరుస్తున్న పామువని మా అన్నయ్య కనిపెట్టలేకపోయాడు. నువ్వు మా అన్నయ్యకు చేసిన తప్పుకు నిన్ను ఇప్పుడే చంపేస్తాను. నీ మాట మీద నిలబడు. లేకపోతే వాలి వెళ్ళిన దారిలోనే వెళ్ళవలసి ఉంటుంది” అని లక్ష్మణుడు అన్నాడు.
తార శాంతింపచేయడం
లక్ష్మణుడు మాట్లాడుతున్నంతసేపు నక్షత్రాల మధ్యలో ఉన్న చంద్రుడిలా సుగ్రీవుడు తన భార్యల మధ్యలో చేతులు కట్టుకొని నిలబడిపోయి ఉన్నాడు. తార అందిస్తూ, “లక్ష్మణా! నీ నోటి వెంట సుగ్రీవుడి గురించి ఇలాంటి మాటలు రాకూడదు. సుగ్రీవుడు మోసగాడు కాదు. అబద్ధాలు చెప్పేవాడు కాదు. కోరికలను అదుపులో ఉంచుకోలేనివాడు, దుర్మార్గుడు కాదు. రాముడు చేసిన సహాయాన్ని సుగ్రీవుడు ఎప్పటికీ మరిచిపోలేదు. రాముడు చేసిన సహాయం వల్లే సుగ్రీవుడు ఈరోజు ఇంత గొప్ప రాజ్యాన్ని, సంపదను, రుమని, నన్ను పొందగలిగాడు.
చాలా కాలం సుఖాలకు దూరంగా ఉండడం వల్ల సుగ్రీవుడు ఈరోజు సమయాన్ని మరిచిపోయాడు. నా భర్తేనా అలా మరిచిపోయినవాడు? విశ్వామిత్రుడంతటి గొప్ప ఋషి కూడా కోరికలకు లొంగి సమయాన్ని మరిచిపోయాడు కదా! ఏ రుమయందు, ఏ రాజ్యమందు, నా యందు ఆనందంతో సుగ్రీవుడు ఈరోజు సమయాన్ని మరిచిపోయాడో, అదే సుగ్రీవుడు రాముడి పని కోసం అవసరమైతే నన్ను, రుమని, రాజ్యాన్ని వదిలేస్తాడు. రావణుడు యుద్ధంలో చనిపోతాడు. చంద్రుడితో రోహిణి కలిసినట్టు కొద్దికాలంలోనే సీతమ్మ రాముడితో కలవడం సుగ్రీవుడు చూస్తాడు.
నాయనా! లంకలో నూరు వేల కోట్ల రాక్షసులు మరియు 36 వేల సంఖ్యలో బలగాలు ఉన్నాయి. వాలి బతికి ఉన్నప్పుడు ఈ విషయాలు నాకు చెప్పాడు. నాకు పూర్తిగా తెలియదు. అంతమంది రాక్షసులను చంపడానికి మనకు కూడా కొన్ని కోట్ల కోట్ల వానర సైన్యం అవసరం ఉంది. అందుకని సుగ్రీవుడు వానర సైన్యం కోసం కబురు పెట్టాడు. నువ్వు బాణం వేస్తాను అంటుంటే, ఆనాడు రాముడి బాణానికి వాలి పడిపోయిన సంఘటన గుర్తుకు వచ్చి ఇక్కడున్న స్త్రీలందరూ భయపడుతున్నారు. నువ్వు ఇలా ప్రవర్తించకూడదు. నీ కోపాన్ని విడిచిపెట్టు” అని చెప్పింది.
లక్ష్మణుడి శాంతం
లక్ష్మణుడు “అమ్మా! నువ్వు చెప్పిన మాట నిజమే. నేను ఒప్పుకుంటున్నాను. ఇక నేను కోపంగా మాట్లాడను. నేను శాంతించాను” అన్నాడు.
సుగ్రీవుడి వేడుకోలు
లక్ష్మణుడి మాటలు విన్న సుగ్రీవుడు ఆనందంతో తన మెడలో ఉన్న పూలదండలను తీసివేసి “లక్ష్మణా! నేను రాజ్యాన్ని, భార్యను పోగొట్టుకున్నాను. రాముడి దయతో వాటిని పొందాను. కేవలం తన చూపుతో, బాణం ప్రయోగంతో రాముడు లంకను కాల్చేయగలడు.
రాముడికి సహాయం చేయడానికి నేను ఎంతటి వాడిని? ‘నా రాముడే కదా’ అని ప్రేమతో సమయాన్ని మరిచిపోయానో లేకపోతే వానర సైన్యానికి కబురు పంపించాను కదా అనే నమ్మకంతో మరిచిపోయానో నేను సమయాన్ని మరిచిపోయిన మాట నిజమే. ప్రపంచంలో తప్పు చేయని వాడంటూ ఉండడు కదా! నన్ను క్షమించు” అన్నాడు.
లక్ష్మణుడి ఓదార్పు
లక్ష్మణుడు “సుగ్రీవా! నువ్వు మా అన్నయ్యకు పెద్ద దిక్కుగా ఉన్నావు. నీలాంటి వాడి నీడలో ఉన్న రాముడి పని తప్పకుండా జరుగుతుంది. అపారమైన శక్తి ఉండి ఎదురు తిరగకుండా తప్పు జరిగితే ఇలా చేతులు కట్టుకొని క్షమించమని అడగగలిగే మంచి బుద్ధి మా అన్న రాముడి దగ్గర ఉన్నది. నీ దగ్గర ఉన్నది. ఆ ప్రస్రవణ పర్వత గుహలో బాధపడుతున్న నీ స్నేహితుడిని ఓదార్చు. మా అన్నయ్య బాధపడుతున్నాడన్న బాధతో కోపానికి లొంగి నిన్ను అనకూడని మాటలు ఏమైనా నేను అని ఉంటే నన్ను క్షమించు” అన్నాడు.
వానర సైన్యం కోసం ఆజ్ఞ
సుగ్రీవుడు హనుమంతుడిని పిలిచి “ఈ భూమండలంలో ఎక్కడెక్కడ ఉన్న వానరాలు ఇక్కడికి రావాలని చెప్పాను. వాళ్ళని కేవలం పది రోజుల్లో రమ్మని చెప్పండి. మలయ, హిమాలయ, మహేంద్ర, వింధ్య మొదలైన పర్వతాల మీద ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేయాలి. కాటుక రంగులో ఉన్నవారు, బంగారు రంగులో ఉన్నవారు, వెయ్యి ఏనుగుల బలం కలిగినవారు, పది ఏనుగుల బలం కలిగినవారు, నీటిమీద నడిచేవారు, నీళ్ళల్లో ఉండేవారు, పర్వతాల మీద ఉండేవారు, చెట్ల మీద ఉండేవారు మొదలైన వానరములన్నిటికీ కబురు చేయండి” అని చెప్పాడు.
సైన్యం తరలింపు
సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం మంత్రులు మొదలైనవారు వానరములను తీసుకురావడానికి వెళ్ళారు. అలా వెళ్ళినవారు అన్ని ప్రాంతాలలోని వానరములను పోగుచేసుకొని కిష్కింధకు బయలుదేరారు.
రాముడి వద్దకు సుగ్రీవుడు
సుగ్రీవుడు పల్లకిలో తనతోపాటు లక్ష్మణుడిని ఎక్కించుకొని ప్రస్రవణ పర్వతానికి చేరుకున్నాడు. ఇంతకాలానికి ప్రభువు బయటికి వచ్చాడని అక్కడున్న వానరములు కూడా బయటికి వచ్చాయి. రాముడి దగ్గరికి వెళ్ళి తన తల రాముడి పాదాలకు తగిలేటట్టు నమస్కరించాడు.
రాముడు సుగ్రీవుడిని కౌగలించుకొని “ధర్మం, అర్థం, కామం వీటి కోసం సమయాన్ని వేరు చేసుకోవడంలోనే ఎవరిదైనా తెలివి ఉంటుంది. కేవలం కామంలోనే జీవితాన్ని ఉంచిన వాడు చెట్టు చివరి కొమ్మ మీద నిద్రపోతున్న వాడితో సమానం” అన్నాడు.
సుగ్రీవుడి విన్నపం
సుగ్రీవుడు “రామా! నువ్వు ఇచ్చినదే ఈ రాజ్యం, ఈ భార్య. కానీ నేను కృతఘ్నుడిని కాదు. కొన్ని కోట్ల వానరాలు, ఎలుగుబంట్లు మొదలైనవి వచ్చేస్తున్నాయి. వీటన్నిటితో ఏ పని చేయాలో నన్ను ఆజ్ఞాపించు” అన్నాడు.
రాముడి ఆజ్ఞ
రాముడు “నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. సీత ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నది? ప్రాణాలతో ఉన్నదా? చనిపోయిందా? అసలు ఏ పరిస్థితుల్లో ఉందో ముందుగా తెలుసుకోవాలి. వానరులను అన్ని దిక్కులకూ పంపించి వెతికేలా చూడు” అన్నాడు.
వానర సైన్యం రాక
ఇంతలో అక్కడికి కోట్ల కోట్ల వానరములు వచ్చాయి. అవి రావడం వలన ఆ ప్రాంతమంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. అంతా గందరగోళంగా ఉంది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది నమస్కారాలు చేస్తున్నారు. కొంతమంది చెట్లమీద ఉన్నారు. కొంతమంది నీళ్ళల్లో ఉన్నారు. కొంతమంది పర్వతాల మీద ఉన్నారు.
సైన్యాన్ని క్రమబద్ధీకరించడం
వానర రాజైన సుగ్రీవుడు అందరినీ సరిగ్గా నిలబడమన్నాడు. వానరములు తమను ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాయి. “ఎవరు ఎంతమందిని తెచ్చారో నాకు చెప్పండి” అని సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు.
సైన్యం వివరాలు
వాళ్ళు “సూర్యాస్తమయ పర్వతం నుండి పది కోట్ల వానరములు వచ్చాయి. శతబలి అనే వానరుడు పదివేల కోట్ల వానరములతో వచ్చాడు. సుషేణుడు లెక్కలేనన్ని వానరములతో వచ్చాడు. రుమ తండ్రి కొన్ని వేల కోట్ల వానరములతో, హనుమంతుడి తండ్రి కేసరి కొన్ని వేల కోట్ల వానరములతో, గవాక్షుడు వెయ్యి కొండముచ్చులతో, ధూమ్రుడు రెండు వేల కోట్ల ఎలుగుబంట్లుతో వచ్చాడు, పనసుడు మూడు కోట్ల వానరములతో వచ్చాడు.
నీలుడు పది కోట్ల నల్లటి శరీరం కలిగిన వానరములతో వచ్చాడు. గవయుడు ఐదు కోట్ల వానరాలతో వచ్చాడు, దరీముఖుడు వెయ్యి కోట్ల వానరములతో వచ్చాడు. మైంద-ద్వివిదులు అశ్విని దేవతల్లా వెయ్యి కోట్ల వానరాలను తెచ్చారు, గజుడు మూడు కోట్ల వానరములను, జాంబవంతుడు పది కోట్ల ఎలుగుబంట్లను తెచ్చాడు. రుమణుడు నూరు కోట్ల వానరములను తెచ్చాడు. గంధమాదనుడు పదివేల కోట్ల వానరములతో వచ్చాడు. ఆయన వెనకాల లక్ష కోట్ల వానరములు వస్తున్నాయి. అంగదుడు వెయ్యి పద్మ వానరములను, నూరు శంకు వానరములను తీసుకొచ్చాడు.
తారుడు ఐదు కోట్ల వానరములను తీసుకొచ్చాడు. ఇంద్రజానువు పదకొండు కోట్ల వానరాలను తెచ్చాడు. రంభుడు పదకొండు వందల ఆయుత వానరాలను తెచ్చాడు. దుర్ముఖుడు రెండు కోట్ల వానరములను తెచ్చాడు. హనుమంతుడు కైలాస శిఖరాల్లా ఎత్తుగా ఉన్న వెయ్యి కోట్ల వానరములను తెచ్చాడు. నలుడు నూరు కోట్ల వెయ్యి మంది వంద మంది వానరములతో వచ్చాడు. దధిముఖుడు పది కోట్ల వానరములతో వచ్చాడు.
“పదివేల కోట్లను ఒక ఆయుతం అంటారు. లక్ష కోట్లను ఒక శంకు అంటారు. వెయ్యి శంకువులను ఒక అద్భుతం అంటారు. పది అద్భుతాలను ఒక మధ్యమం అంటారు. పది మధ్యమాలను ఒక అంత్యం అంటారు. ఇరవై అంత్యాలను ఒక సముద్రం అంటారు. ముప్పై సముద్రాలను ఒక పరార్థం అంటారు. అలాంటి పరార్థాలు కొన్ని వేలు ఉన్నాయి” అని వానరులు చెప్పారు.
తూర్పు దిక్కుకు వెళ్ళే బృందం
సుగ్రీవుడు వినతుడు అనే వానరమును పిలిచి “వినతా! నువ్వు లక్ష మంది వానరములతో బయలుదేరి తూర్పు దిక్కుకు వెళ్ళు. నీకు నెల రోజుల సమయం ఇస్తున్నాను. నెల రోజుల్లో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టాలి. మీరు ఇక్కడి నుండి తూర్పు దిక్కుకు బయలుదేరి గంగ, సరయు, కౌశికి, యమున, సరస్వతి, సింధు మొదలైన నదులను, వాటి ఒడ్డున ఉన్న ప్రాంతాలను వెతకండి. బ్రహ్మమాల, విదేహ, మాలవ, కాశి, కోసల, మాగధ, పుండ్ర, అంగ దేశములలో ఉండే పట్టణాలను, ఊళ్ళను వెతకండి. వెండి గనులు కలిగిన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నీ వెతకండి.
సముద్రాలలో ఉన్న పర్వతాలు, వాటి మధ్యలో ఉన్న ద్వీపాలు, అందులో ఉన్న నగరాలు, మంధరాచల శిఖరం మీద ఉన్న గ్రామాలలో నివసిస్తున్న మనుషుల యొక్క ఇళ్ళు, అక్కడ కొంతమందికి చెవులు ఉండవు. కొంతమందికి పెదవులు చెవుల వరకు వ్యాపించి ఉంటాయి. కొంతమంది జుట్టు చెవుల వరకు పడి ఉంటుంది. వాళ్ళందరూ చాలా భయంకరమైన మనుషులను తినేవాళ్ళు. వాళ్ళు నీళ్ళల్లో ఉంటారు.
మీరందరూ ప్రతి చోటా సీతమ్మని వెతకండి. కొంత దూరం వెళితే యవద్వీపం కనపడుతుంది. అది రత్నములతో నిండి ఉంటుంది. మీరు అక్కడ వెతకండి. తరువాత సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపము ఉంటాయి. అవి బంగారము, వెండి గనులకు నిలయమైనటువంటివి. అది దాటితే శిశిరం అనే పర్వతం కనపడుతుంది. ఆ పర్వతం అంతా వెతకండి.
కొంత దూరం వెళ్ళాక శోణానది కనపడుతుంది. ఆ నది చాలా లోతుగా, ఎర్రటి నీటితో ఉంటుంది. ఆ ప్రదేశములో గొప్పవారు, గూఢచారులు తిరుగుతూ ఉంటారు. అక్కడున్న ఆశ్రమాలలో, తపస్సు చేసుకునే చోట్ల సీతమ్మని ఉంచాడేమో వెతకండి. తరువాత ఇక్షు సముద్రము వస్తుంది. అందులో పెద్ద శరీరం కలిగిన రాక్షసులు ఉంటారు. వాళ్ళు ఆకలిని తీర్చుకోడానికి ప్రాణుల నీడను పట్టి తింటుంటారు. అది దాటాక లోహితము అనే తీపి సముద్రం ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడ బూరుగు చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఆ ద్వీపాన్ని శాల్మలీ ద్వీపం అంటారు. అక్కడున్న కొండ శిఖరాలకు మందేహులు అనే రాక్షసులు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. వాళ్ళు సూర్యుడు ఉదయించే సమయంలో, సూర్యుడు ఉదయించకుండా ఆయనను మింగే ప్రయత్నం చేస్తుంటారు.
అక్కడున్న బ్రాహ్మణులు సంధ్యావందనం చేసి నీళ్ళు వదిలిపెడితే, ఆ నీళ్ళ యొక్క శక్తి చేత, సూర్యుడి శక్తి చేత ఆ మందేహులు అనే రాక్షసులు సముద్రములో పడిపోతుంటారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ లేచి ఆ పర్వతానికి తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. ఆ సముద్ర మధ్యలో ఋషభము అనే పెద్ద పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద సుదర్శనము అనే పేరుగల గొప్ప సరస్సు వెండి కాంతులతో మెరుస్తూ ఉంటుంది.
దానిని దాటితే క్షీరసముద్రము వస్తుంది. దానిని కూడా దాటితే తియ్యటి నీళ్ళు కలిగిన మహాసముద్రము వస్తుంది. అందులో ఔర్వుడు అనే గొప్ప ఋషి యొక్క కోపం బడబాగ్నిగా పుట్టి సముద్రములో ప్రవేశించింది. దానికి గుర్రం తల వంటి ఆకారం ఉంటుంది.
దానిని దాటి ముందుకి ఒక పదమూడు యోజనముల దూరం వెళితే ఒక బంగారు పర్వతము కనపడుతుంది. దానికి జాతరూప శిలము అని పేరు. దానిమీద పాము ఆకారం కలిగిన అనంతుడు నల్లటి బట్టలు ధరించి కూర్చొని ఉంటాడు. ఆయనే ఆదిశేషుడు. ఆయన పక్కనే తాటి చెట్టు ఆకారంలో జెండా పెట్టబడి ఉన్నది. దాని పక్కనే ఒక వేదిక ఉన్నది. దానిని దేవతలు నిర్మించారు.
మీరు ఆ ఆదిశేషుడిని చూసి ముందుకి వెళితే బంగారు పర్వతమైన ఉదయాద్రి కనపడుతుంది. ఆ పర్వతము నూరు యోజనముల వరకు వ్యాపించి ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. దానిని దాటి వెళితే సౌమనసం అనే బలమైన బంగారు శిఖరము ఉంటుంది. అక్కడే బ్రహ్మగారు భూమండలానికి ద్వారం ఏర్పాటు చేశారు. అక్కడే సూర్యుడి మొదటి కిరణం ప్రసరించడం మొదలవుతుంది. అది దాటి వెళితే చాలా చీకటి. ఇక్కడి వరకు అంగుళం కూడా వదలకుండా సీతమ్మ జాడ వెతకండి. తూర్పు దిక్కుకు వెళ్ళే వానరములు సిద్ధం అవ్వండి” అన్నాడు.
దక్షిణ దిక్కుకు వెళ్ళే బృందం
సుగ్రీవుడు “నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహోతుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, మైందుడు, ద్వివిదుడు, గంధమాదనుడు, ఉల్కాముఖుడు, అనంగుడు, హుతాశనుడు మొదలైన వారందరికీ నాయకుడిగా యువరాజైన అంగదుడు బయలుదేరి దక్షిణ దిక్కుకు వెళ్ళండి. మీతో పాటు కొన్ని లక్షల వానరములను తీసుకువెళ్ళండి.
వెయ్యి శిఖరములు కలిగిన వింధ్యపర్వతానికి వెళ్ళి ఆ పర్వతము అంతా వెతకండి. గోదావరి నది, కృష్ణవేణి, వరదా నదిలో వెతకండి. తరువాత మేఖల దేశము, ఉత్కల దేశము, దశార్ణ నగరము, భద్రవంతీ, అవంతీ నగరాలను వెతకండి.
గోదావరి నదిని, అలాగే ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ దేశాలన్నిటినీ చూడండి.
విదర్భ, రుష్టిక, మహిషి, కళింగ, కౌశిక, కుంభ, చేర, చోళ, పాండ్య, కేరళ మొదలైన రాజ్యాలన్నీ వెతకండి. కావేరి నదిని దాటండి. మలయ పర్వత శిఖరం మీద అగస్త్యునికి విశ్వకర్మ నిర్మించిన ఇల్లు ఉంటుంది. ఆ ప్రాంతాన్ని వెతకండి. తరువాత మొసళ్ళతో ఉన్న తామ్రపర్ణి నదిలో వెతకండి. ఆ తరువాత సముద్రం వస్తుంది. ఆ సముద్రంలోకి చొచ్చుకుపోయిన శిఖరములతో మహేంద్రగిరి పర్వతము కనపడుతుంది. ఆ సముద్రానికి నూరు యోజనముల అవతల ఒక ద్వీపం ఉన్నది. దానిని కాంచనలంక అంటారు.
ఆ లంకా పట్టణాన్ని రావణాసురుడనే పది తలల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా వెతకాలి. ఆ తరువాత సముద్రాన్ని దాటితే పుష్పితము అనే పర్వతము కనపడుతుంది. అది దాటితే సూర్యవంత్, వైద్యుతం అనే పర్వతాలు కనపడతాయి. ఆ పర్వతాల మీద ఉండే చెట్లకి కాచిన పళ్ళు చాలా బాగుంటాయి. అవి తినండి. ఆ తరువాత కుంజరం అనే పర్వతం కనపడుతుంది. దాని మీద విశ్వకర్మ అగస్త్యుడికి గొప్ప భవనం నిర్మించాడు.
అలా ముందుకి వెళితే భోగవతి అనే నగరం వస్తుంది. అందులో విషంతో కూడుకున్న పాములు ఉంటాయి. అక్కడే పాములకి రాజైన వాసుకి ఉంటాడు. ఆ తరువాత ఎద్దు ఆకారంలో ఉన్న వృషభ పర్వతం కనబడుతుంది. దానిమీద గోశీర్షకం, పద్మకం, హరిశ్రావం అనే మూడు రకాల చందనం కనపడుతుంది. అగ్నితో సమానమైన చందనం కూడా ఉంటుంది. మీరు పొరపాటున కూడా ఆ చందనాన్ని ముట్టుకోకండి. అక్కడ శైలూషుడు, గ్రామణి, శిగ్రువు, శుభ్రువు, బభ్రువు అనే ఐదుగురు గంధర్వ రాజులు పరిపాలన చేస్తుంటారు. మీరు వారికి నమస్కారం చేసి ముందుకి వెళితే, భూమి చివరన మంచి పనులు చేసుకున్నవారు స్వర్గానికి వెళ్ళేవారు కనపడతారు. అది కూడా దాటిపోతే పితృలోకం వస్తుంది.
ఇక అది దాటితే యమధర్మరాజు యొక్క రాజ్యం ఉంటుంది. అక్కడ పాపం చేసిన వాళ్ళు ఉంటారు. మీరు అది దాటి వెళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడి వరకు వెళ్ళి వెతికి రండి” అన్నాడు.
పడమర దిక్కుకు వెళ్ళే బృందం
తరువాత సుగ్రీవుడు సుషేణుడిని పిలిచి ఆయనకి నమస్కరించి “మీతో పాటు మరీచి మహర్షి యొక్క కుమారుడైన అర్చిష్మంతుడు, అర్చిర్మాల్యుడు మొదలైన వానరాలను తీసుకొని పడమర దిక్కుకు వెళ్ళండి. అప్పుడు మీరు సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్ర, కురు, మల్ల, పాంచాల, కోసల, అంగ, మగధ, అవంతి, గాంధార, కాంభోజ మొదలైన రాజ్యాలు, పట్టణాలు, గ్రామాలు వెతకండి. అలాగే అవంతీపురం, జటాపురం కనపడతాయి, వాటిని కూడా వెతకండి. సింధు నది, సముద్రం కలిసే చోట, నూరు శిఖరాలతో, పెద్ద చెట్లతో సోమగిరి అనే పర్వతం కనపడుతుంది. మీకు ఆ పర్వతం మీద రెక్కలున్న సింహాలు కనపడతాయి, అవి ఏనుగుల్ని ఎత్తుకుపోతుంటాయి. సముద్రంలోని తిమింగలాలను ఎత్తుకుపోతుంటాయి.
అక్కడ సముద్రంలో పారియాత్రం అనే పర్వతము ఉన్నది. అది వంద యోజనముల వైశాల్యంలో ఉంటుంది. దానిమీద ఇరవైనాలుగు కోట్ల మంది గంధర్వులు ఉంటారు. వాళ్ళకి నమస్కారం చేసి ముందుకి వెళ్ళండి. అప్పుడు మీకు నూరు యోజనముల ఎత్తైన వజ్ర పర్వతము కనపడుతుంది. సముద్రములో నాలుగో వంతు భాగంలో చక్రవంతము అనే పర్వతం ఉంటుంది. దానిమీద విశ్వకర్మ వెయ్యి అంచుల చక్రాన్ని నిర్మించాడు. ఆ చక్రాన్ని ఎవరూ తీసుకోకుండా చేస్తున్న హయగ్రీవుడు అనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు చంపి ఆ చక్రాన్ని తీసుకున్నారు. పంచజనుడు అనే మరొక రాక్షసుడిని చంపి శంఖాన్ని తీసుకున్నారు.”
రామాయణం విభాగం – మరిన్ని చదవండి
ముగింపు
ఈ భాగంలో మనం చూస్తాం
- మిత్రధర్మాన్ని విస్మరించడమే ఎంతటి పెద్ద దోషమో.
- కోపాన్ని నిగ్రహించడం ఎంత కీలకమో.
- కామమనే అంధత్వం ఎంత మానవుని పతనానికి దారితీస్తుందో.