రావణుడి మరణం – విభీషణుడి దుఃఖం
Ramayanam Story in Telugu- రణభూమిలో రావణుడు మరణించి పడిపోగానే, విభీషణుడు దుఃఖంతో ఆయన దగ్గరికి పరుగున వచ్చాడు. “అన్నయ్యా! ఆనాడే నేను నీకు చెప్పాను, ‘యుద్ధానికి వెళ్ళవద్దు, నువ్వు తప్పు చేశావు, నీ తప్పును నువ్వు సరిదిద్దుకో’ అన్నాను. కానీ నువ్వు నా మాట వినలేదు. నా మాట వినకపోవడం వల్ల ఈనాడు నువ్వు ఎలా పడిపోయావో చూడు. ఆ రోజున దర్పంతో ప్రహస్తుడు, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, అతిరథుడు, అతికాయుడు, నరాంతకుడు నా మాట వినలేదు. మా అన్నయ్య బ్రతికి ఉన్నంతకాలం ఎందరికో దానాలు చేశాడు. గొప్ప అగ్నిహోత్రాలు నిర్వహించాడు.
మిత్రధర్మాన్ని నెరవేర్చి స్నేహితులకు కానుకలు ఇచ్చాడు. భూరి దానాలు చేశాడు. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించాడు. ఇన్ని చేసినవాడు ఈరోజు కేవలం కిందపడిపోయి, పనికిరానివాడిగా చేతులు భూమికి ఆన్చి, నోరు తెరిచి ఉండిపోయాడు. శాంతించిన అగ్నిహోత్రంలా ఉన్నావు” అని ఏడ్చాడు. బక్తివాహిని రామాయణం విభాగం
రాముడి మాటలు
రాముడు “విభీషణా! నీకు ఒక మాట చెబుతాను. నీ అన్నయ్య యుద్ధం చేయడానికి బెంగ పెట్టుకోలేదు, భయపడలేదు. ఉత్సాహంతో యుద్ధం చేసి పడిపోయాడు. ఒక వీరుడు ఎలా పడిపోవాలని కోరుకుంటాడో నీ అన్నయ్య కూడా అలానే పడిపోయాడు” అన్నాడు.
అంతఃపుర కాంతల విలాపం
అంతఃపురం నుండి వేలాది మంది అంతఃపుర కాంతలు పరుగున వచ్చి “రావణా! నువ్వు వెళ్లిపోయావు. నీతో పాటు మా ఐదోతనం వెళ్లిపోయింది. భోగం వెళ్లిపోయింది. ఇంత గొప్పవాడివి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు” అన్నారు.
మండోదరి దుఃఖం, జ్ఞానోదయం
ఆ సమయంలోనే అక్కడికి మేలిముసుగు తీసేసి పరుగున రావణుడి పట్టమహిషి మండోదరి వచ్చి రావణుడిని కౌగిలించుకొని “ఈరోజు నేను మేలిముసుగు లేకుండా పరుగున వచ్చానని కోపం తెచ్చుకోకు. నువ్వు దేవతలందరినీ ఓడించావు. ఎందరినో తరిమికొట్టావు. దుర్భేద్యమైన కాంచన లంకను నిర్మించావు. పది తలలతో, ఇరవై చేతులతో ప్రకాశించావు. గొప్ప తపస్సు చేసి చివరికి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు. ఆ రోజు హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటి ‘నీ పది తలకాయలు ఇప్పుడే గిల్లేస్తాను, రాముడు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కనుక వదిలేస్తున్నాను’ అని, లంకను కాల్చి వెళ్లిపోయాడు.
ఒక్కడే అలా వచ్చి లంకను నాశనం చేసి వెళ్ళిపోతే నీ మనస్సులో శంక కలగలేదు. నీ జీవితానికి ప్రమాదం వస్తుందని నువ్వు ఆలోచించలేదు. కోతులంటే చపల బుద్ధికి పెట్టింది పేరు. అలాంటి కొన్ని కోట్ల కోతులను రాముడు వెంట పెట్టుకొని సముద్రానికి సేతువు కట్టించి దాటి వచ్చాడు. నీకు అప్పుడైనా అనుమానం రాలేదు. ఒక మనుష్యుడైన రాముడి చేతిలో చనిపోయావా?” అని పక్కకు తిరిగి రాముడిని చూసింది.
రాముడిని చూడగానే మండోదరి “ఈయన మనుష్యుడు కాదు. సనాతనమైన పరమాత్మ. నిన్ను నిగ్రహించడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు. దేవతలందరినీ వానర రూపములు ధరింపజేసి, వాళ్ళని వెంటబెట్టుకుని, శంఖ, చక్ర, గద, పద్మములను పట్టుకున్న శ్రీ మహావిష్ణువు వచ్చాడు. రాముడిని ఇన్ని సార్లు చూసినా నీకు వచ్చింది విష్ణువని ఎందుకు అర్థం కాలేదు రావణా! నువ్వు రాముడి చేత సంహరింపబడ్డావని లోకం అనుకుంటుంది. నువ్వు ఎందువల్ల చనిపోయావో నాకు తెలుసు. ఒకప్పుడు నువ్వు తపస్సు చేయాలనుకొని నీ ఇంద్రియాలను బలవంతంగా అణచివేశావు. అప్పుడు నీ ఇంద్రియాలు నీ మీద పగబట్టాయి. అందుకని నిన్ను చంపింది రాముడు కాదు. నీ ఇంద్రియాలే నిన్ను చంపాయి.
ఒక్కసారి కామం పుట్టింది అనడానికి నీ విషయంలో ఆస్కారం లేదు. మహా సౌందర్యరాశులైన భార్యలు నీకు కొన్ని వేల మంది ఉన్నారు. వారితో నువ్వు ఎవరితో క్రీడించినా నీ కామం అదుపులో ఉంటుంది. ఎక్కడో అరణ్యంలో ఉన్న సీతమ్మయందు కామం పుట్టి ఆవిడని నువ్వు అనుభవించడం కాదు. నువ్వు, నీ రాజ్యము, నీ వారు భ్రష్టమవ్వడం కోసం నీకు ఆ కోరిక పుట్టింది. దుర్మతీ! నీకు సీతమ్మ ఎవరో అర్థం కాలేదు. ఆవిడ రోహిణి కన్నా, అరుంధతి కన్నా గొప్పది. తన భర్తను అనుగమించి వచ్చిన ఇల్లాలిని ఒంటరిగా ఉన్నప్పుడు ఎత్తుకొచ్చావు. ఆ తల్లి తేజస్సు నిన్ను కాల్చింది. నీకు ఎన్నోసార్లు చెప్పాను ఆ తల్లిని తేవడం వల్ల నువ్వు పొందే సుఖం ఏమి లేదు, నాశనమైపోతావని చెప్పాను.
నువ్వు చేసుకున్న పూర్వ పుణ్యాల వల్ల కాంచన లంకను అనుభవించావు. ఎన్నో సుఖాలు పొందావు. సీతమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం వల్ల ఆ పాపాన్ని అనుభవించాల్సి వచ్చి ఈనాడు పడిపోయావు. విభీషణుడు పుణ్యాలు చేశాడు. సీతమ్మ ఎవరో తెలుసుకున్నాడు. ఆ పుణ్య ఫలం ఈనాడు విభీషణుడికి అనుభవంలోకి వచ్చింది. బ్రతికిపోయాడు.
రావణా! సీత నాకన్నా గొప్ప కులంలో పుట్టిందా! నాకన్నా గొప్ప రూపవతా! నాకన్నా గొప్ప దయ ఉన్నదా! సీత నాకన్నా ఎందులో గొప్పది? నీ దురదృష్టం నాకన్నా సీత నీకు గొప్పదిలా కనిపించింది. నా తండ్రి దానవ రాజైన మయుడు, నా భర్త లోకాలను గెలిచిన రావణుడు, నా కుమారుడు ఇంద్రుడిని జయించిన మేఘనాథుడు, నేనున్నది కాంచనలంకలో అని అహంకరించాను. ఇది నిలబడలేదు. అబద్ధమైపోయింది.
ఈనాడు నాకు కొడుకు లేడు, భర్త లేడు, రాజ్యం లేదు, బంధువులు లేరు. నీకు తలకొరివి పెట్టడానికి ఒక్క కొడుకూ లేడు. నువ్వు మహాపాతకం చేయడం వల్ల పది రోజులలో నా పరిస్థితి ఇలా అయిపోయింది. మహా పతివ్రత అయిన స్త్రీ ఏ ఇంటికైనా వచ్చి కన్నీరు పెడితే ఆ కన్నీరు కిందపడితే, ఆ ఇల్లు నాశనమైపోతుంది” అని బాధపడింది.
రావణుడి అంత్యక్రియలు
“ఆవిడ చాలా శోకించింది. ఆవిడని లోపలికి తీసుకువెళ్ళండి. రావణుడి కొడుకులందరూ చనిపోయారు. ఈ శరీరానికి చేయవలసిన కార్యాన్ని విభీషణా, నువ్వు చేయి” అన్నాడు రాముడు .
విభీషణుడు “రామా! మీరు ఏమైనా చెప్పండి. వీడు బ్రతికున్నంత కాలం వీడి జీవితంలో ధర్మం అన్న మాటే లేదు. బ్రతికున్నంత కాలం పర స్త్రీల వెంట తిరిగాడు. ఇటువంటి వాడికి అంత్యేష్టి సంస్కారం ఏమిటి? ఆ శరీరం అలా వదిలేద్దాము” అన్నాడు.
రాముడు “విభీషణా! అవతలివాడు ఏ శరీరంతో ఇన్ని పాపాలు చేశాడో ఆ పాపాలన్నీ ఆ శరీరంతోనే వెళ్లిపోయాయి. అందుకని ఇంకా వైరము పెట్టుకోకూడదు. ఆ శరీరానికి సంస్కారం చేయకపోతే వాడు ఉత్తమ గతులకు వెళ్ళడు. ఒకవేళ నువ్వు ‘చేయను’ అంటే నువ్వు నాకు స్నేహితుడివి కదా! స్నేహితుడి అన్నయ్య నాకూ అన్నయ్యే కదా! నువ్వు చేయకపోతే ఆయనని అన్నగారిగా భావించి నేను సంస్కారం చేస్తాను” అన్నాడు.
విభీషణుడు రావణుడికి అంత్యేష్టి సంస్కారం చేశాడు. ఆ తరువాత ఆకాశంలో ఉన్న దేవతలందరూ మెల్లగా ఒకరి తరువాత ఒకరు వెళ్లిపోయారు.
విభీషణుడి పట్టాభిషేకం
రాముడు “విభీషణుడికి సింహాసనం మీద అభిషేకం జరిగితే చూడాలని ఉన్నది. లక్ష్మణా! సముద్రానికి వెళ్లి నీళ్ళు తీసుకొచ్చి విభీషణుడికి పట్టాభిషేకం చేయండి” అన్నాడు.
విభీషణుడికి అభిషేకం చేశాక రాముడు హనుమంతుడిని పిలిచి “ఈనాడు విభీషణుడు అభిషేకం జరిగి లంకకి రాజయ్యాడు కనుక ఆయన అనుమతి తీసుకొని లంకలోకి వెళ్లి సీతా దర్శనం చేయి. నేను సుగ్రీవుడి సాయంతో, విభీషణుడి సాయంతో రావణుడిని సంహరించి లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకొని క్షేమంగా ఉన్నానని చెప్పు.
విభీషణుడికి పట్టాభిషేకం అయిపోయిందని చెప్పు. ఈనాడు సీత నా మిత్రుడైన విభీషణుడి ఇంట్లో ఉన్నది కనుక బెంగపడవలసిన అవసరం లేదని చెప్పు” అన్నాడు.
హనుమంతుడు – సీత సంభాషణ
హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళగా సీతమ్మ హనుమంతుడిని చూసి తల తిప్పుకొని ఏదో ధ్యానం చేసుకుంటుంది. మళ్ళీ ఓ సారి హనుమంతుడి వంక చూసి “హనుమా! నువ్వు కదా?” అన్నది.
హనుమంతుడు “సీతమ్మా! రాముడు సుగ్రీవుడిని, విభీషణుడిని తన పక్కన పెట్టుకొని, వాళ్ళ సహాయంతో రావణుడిని సంహరించి లంకను తనదిగా చేసుకున్నాడు. ఈనాడు విభీషణుడిని లంకా రాజ్యానికి రాజుగా చేశారు. ఇప్పుడు నువ్వు రాముడి మిత్రుడైన విభీషణుడి ప్రమదావనంలో ఉన్నావు. నువ్వు బెంగపడవలసిన పరిస్థితి లేదు. నీ శోకాన్ని విడిచిపెట్టు” అన్నాడు.
సీతమ్మ “ఎంత మంచిమాట చెప్పావు హనుమా!” అని చెప్పి ఒక్క నిమిషం అలా ఉండిపోయింది.
హనుమంతుడు “అదేమిటమ్మా! ఏమి మాట్లాడావు?” అన్నాడు.
సీతమ్మ “పది నెలల నుంచి ఈ మాట ఎప్పుడు వింటానా అని తపస్సు చేశాను కదా! నువ్వు నిజంగా వచ్చి ఈ మాట చెప్పేటప్పటికి నా నోటి వెంట మాట రాలేదు. నువ్వు చెప్పిన మాటకు నేను చాలా ఆనందాన్ని పొందాను. నేను నీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి. నేను ఆలోచిస్తే నేను నీకు ఏమి ఇవ్వగలను? ఎంత బంగారం ఇచ్చినా, రత్నాలు ఇచ్చినా, మూడు లోకాలని ఇచ్చినా సరిపోదు. ఈనాడు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు.
నువ్వు మధురాతి మధురంగా మాట్లాడతావు. నీకు అష్టాంగ యోగంతో కూడిన బుద్ధి ఉన్నది. వీర్యము, పరాక్రమము, తేజస్సు ఉన్నది. నిన్ను చూసి పొంగిపోతున్నాను” అన్నది.
హనుమంతుడు “అమ్మా! నువ్వు నా గురించి ఇన్ని మాటలు చెప్పి నాకు ఇవ్వడానికి నీ దగ్గర గొప్ప వస్తువు లేదన్నావు కదా! నేనొక వరం అడుగుతాను, ఇస్తావా తల్లీ! ఇంతకుముందు వచ్చినప్పుడు శింశుపా వృక్షం మీద కూర్చుని చూశానమ్మా! ఈ రాక్షస స్త్రీలందరూ నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడారు.
నువ్వు బ్రతికుండగా నిన్ను వాటాలు వేసుకున్నారు. ‘నిన్ను అనుమతించాను హనుమా’ అని ఒక్కమాట అను. నేను వాళ్ళని గోళ్ళతో గిల్లేస్తాను, మోకాళ్ళతో గుద్దేస్తాను, కొంతమందికి పళ్ళు పీకేస్తాను, కొంతమంది జుట్టు పీకేస్తాను, కొంతమందిని గుద్దేస్తాను” అన్నాడు.
సీతమ్మ దయార్ద్ర హృదయం
సీతమ్మ హనుమంతుడితో ఇలా అంది: “హనుమా! వాళ్ళు దాసీజనం. ప్రభువు ఎలా చేయమంటే వాళ్ళు అలా చేస్తారు. దోషం వాళ్ళది కాదు, దోషం ప్రభువుది. వాళ్ళలో ఏ దోషం ఉందని వాళ్ళని చంపేస్తావు? నీ ప్రభువు చెబితే నువ్వు ఎలా చేసావో, వాళ్ళ ప్రభువు చెప్పినట్టు వాళ్ళు చేశారు. ప్రభుభక్తి విషయంలో నువ్వు ఎలాంటివాడివో, వాళ్ళు కూడా అలాంటివాళ్ళే. గతంలో నేను చేసిన పాపం ఏదో ఉన్నది. ఆ పాపానికి ఫలితంగానే ఇన్ని కష్టాలు పడ్డాను.
పూర్వకాలంలో ఒక వేటగాడు అడవిలో వెళ్తుండగా ఒక పెద్ద పులి అతనిని వెంబడించింది. అప్పుడు ఆ వేటగాడు పరుగు పరుగున వెళ్లి ఒక చెట్టు ఎక్కాడు. తీరా చెట్టు మీదకి ఎక్కి చూస్తే అక్కడ ఒక భల్లూకం పడుకొని ఉన్నది. ఆ వేటగాడు పైకి వెళ్తే భల్లూకం తినేస్తుంది, కిందకి వెళ్తే పులి తినేస్తుంది.
ఈ స్థితిలో పులి భల్లూకంతో ‘వాడు మనిషి, మనమిద్దరం క్రూర జంతువులం. మనది ఒక జాతి, వాడిది ఒక జాతి. కనుక వాడిని కిందకి తోసేయి’ అన్నది.
భల్లూకం ‘వాడు తెలిసో తెలియకో ఆర్తితో పరుగు పరుగున నేనున్న చెట్టు ఎక్కాడు. అందుకని వాడు నన్ను శరణాగతి చేసినట్టే, వాడు నాకు అతిథి. నేను వాడిని తోయ్యను. నేను వాడికి ఆతిథ్యం ఇస్తున్నాను’ అన్నది.
ఆ పెద్ద పులి అలా చెట్టు కిందనే ఉంది. కొంతసేపయ్యాక భల్లూకం వేటగాడితో ‘నాకు పెద్ద పులి వల్ల ప్రమాదముంది. నాకు నిద్ర వస్తుంది. నిద్రలో జారి కిందపడిపోతాను. నేను నీ ఒడిలో తల పెట్టుకొని పడుకుంటాను. కొంచెం పడిపోకుండా చూడు’ అన్నది. వేటగాడు ‘తప్పకుండా పడుకో’ అన్నాడు.
భల్లూకం పడుకున్నాక పెద్ద పులి ‘దానికి నిద్రలేచాక ఆకలి వేస్తుంది. అది సహజంగా క్రూర జంతువు కనుక నిన్ను చంపేసి తింటుంది. అందుకని ఇదే అదును. నువ్వు ఆ భల్లూకాన్ని కిందకి తోసేయి. అప్పుడు నేను ఆ భల్లూకాన్ని తిని వెళ్లిపోతాను. నువ్వు కూడా వెళ్లిపోవచ్చు’ అన్నది.
ఈ మాట వినగానే ఆ వేటగాడు నిద్రపోతున్న భల్లూకాన్ని కిందకి తోసేశాడు. ఆ భల్లూకం కిందకి పడిపోతూ పడిపోతూ ఒక చెట్టుకొమ్మను పట్టుకొని పైకి ఎక్కింది. అప్పుడు ఆ పులి ‘చూశావా, నిద్రపోతున్న నిన్ను వాడు కిందకి తోసేశాడు. ఎప్పటికైనా మనిషి మనిషే, మనం మనమే. అందుకని వాడిని కిందకి తోసేయి’ అన్నది.
భల్లూకం ‘అపకారం చేసినవాడే అయినా, వాడు నా ఇంటికి వచ్చాడు. అపకారికి కూడా ప్రయత్నపూర్వకంగా అపకారం చేయకూడదు కాబట్టి నేను ఆ వేటగాడిని తోయ్యను’ అని ఒక భల్లూకం చెప్పింది. నేను మనుష్య స్త్రీగా పుట్టి, క్షత్రియ కాంతనై, రాముడికి ఇల్లాలినై ఆ రాక్షస స్త్రీలను చంపిస్తే నేను ఉత్తమ కులాంగనను అవను. చెడ్డగా ఎవడున్నాడో, ఎవడు పాడైపోయాడో వాడి మీద దయ ఉండాలి. ఈ రాక్షస స్త్రీలు చేయకూడని పనులు చేశారు, వీళ్ళ మీద కదా నేను దయతో ఉండాలి. వీళ్ళందరికీ నా రక్ష” అన్నది.
హనుమంతుడు రాముడి వద్దకు
“అమ్మా! ఈ మాట చెప్పడం నీకే చెల్లింది తల్లీ” అని సీతమ్మతో చెప్పి, అక్కడినుంచి బయలుదేరి రాముడి దగ్గరికి వెళ్లి “రామా! సీతమ్మ నీ దర్శనం చేయాలని అనుకుంటుంది” అని రాముడితో చెప్పాడు.
రాముడి ఆజ్ఞ – సీతమ్మ నిర్ణయం
హనుమంతుడు చెప్పిన మాట విన్న రాముడు కొంచెంసేపు ఆలోచించాడు. ఆ సమయంలో ఆయన కళ్ళల్లో నీళ్ళు నిండాయి. చాలా శోకం పొందినవాడిలా అయి ఒకసారి భూమివంక చూసి, తన పక్కన ఉన్న విభీషణుడిని పిలిచి “విభీషణా! నువ్వు లోపలికి వెళ్లి సీతకి నేను చెప్పానని చెప్పి తలస్నానం చేయించి, పట్టు వస్త్రం కట్టించి, అన్ని అలంకారములు చేసి నా దగ్గరికి ప్రవేశపెట్టు” అన్నాడు.
రాముడి మాటలు విన్న విభీషణుడు ఆశ్చర్యపోయి సీతమ్మ దగ్గరికి వెళ్లి “సీతమ్మా! నువ్వు తల స్నానం చేసి, పట్టుబట్ట కట్టుకొని, ఒంటినిండా అలంకారములు చేసుకుని వస్తే రాముడు నిన్ను చూడాలని అనుకుంటున్నాడు” అన్నాడు.
సీతమ్మ “నేను ఎలా ఉన్నానో అలానే వచ్చి రామదర్శనము చేసుకోవాలని నా మనస్సు కోరుకుంటున్నది” అన్నది.
విభీషణుడు “అమ్మా! అది రామ ఆజ్ఞ. ప్రభువు ఎలా చెప్పాడో అలా చేయడమే మంచిది. అంతఃపుర కాంతలు నీకు తలస్నానం చేయిస్తారు. నువ్వు దివ్యాంగరాగములను అలదుకొని, మంచి భూషణములను వేసుకొని, రాముడికి దర్శనము ఇవ్వమ్మా” అన్నాడు.
సంఘటన | వివరాలు |
---|---|
రావణుని మరణం | యుద్ధంలో రామచంద్రునిచే వధ |
విభీషణుని స్పందన | దుఃఖం, ధర్మపరమైన భిన్నాభిప్రాయాలు |
రాముని స్పందన | క్షమ, గౌరవతత్వం, యోధ ధర్మం పట్ల నమ్మకం |
లంకా మహిలల రోదనలు | సామాజిక క్షోభకు ప్రతిబింబం |
మండోదరి స్పందన | పరమార్థ గాథ, విశ్లేషణాత్మక ధర్మ విజ్ఞానం |
అంత్యక్రియల విభేదం | విభీషణుని నిరాకరణ, రాముని సమర్థన |
ముగింపు
రావణుని మరణానంతరం జరిగిన సంఘటనలు, మానవ జీవితంలో ధర్మం, శాంతి, క్షమ, గర్వం, అహంకారం అనే భావనల మధ్య నడిచే పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి. రాముడు చూపిన ఔదార్యం, మండోదరి గాథలోని తత్త్వ చింతన, విభీషణుని అనుభవం – ఇవన్నీ మనకు అనేక జీవన పాఠాలు నేర్పుతాయి.