Karthika Puranam Telugu – కార్తీక పురాణం | ఆరో రోజు పారాయణ

Karthika Puranam

పదకొండవ అధ్యాయము – మందరోపాఖ్యానము

వశిష్ఠ ఉవాచ: ఓ మహారాజా! కార్తీకమాసములో శ్రీహరిని ఎవరైతే అవి సెపూలతో పూజిస్తారో వాళ్లకి చాంద్రాయణ ఫలము కలుగుతుంది. గరికతోనూ, కుశలతోనూ పూజించే వాళ్లు పాపవిముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్లు మోక్షమును పొందుతారు.

కార్తీక స్నానాచరణమును చేసి విష్ణుసన్నిధిని దీపమాలికను వుంచే వాళ్లూ, వైకుంఠ పురాణ పాఠకులూ, శ్రోతలూ కూడా విగతపాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా మాత్రాననే సర్వపాపాలనూ సమయింపచేసేదీ – ఆయురారోగ్య దాయినీ – అయిన ఒక కథను వినిపిస్తాను విను.

కళింగ దేశీయుడైన మంధరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నానసంధ్యా వందనాలన్నిటినీ విసర్జించి, పరులకు కూలిపని చేస్తూ వుండేవాడు. అతనికి పతివ్రత, సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్నా, సద్గుణ సముచ్ఛయము చేత ‘సుశీల’ అని పిలువబడే భార్య వుండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా, అతని యందు రాగమే తప్ప ద్వేషము లేనిదై, పాతివ్రత్య నిష్ఠాపరురాలయి వుండేది.

కొన్నాళ్ల తరువాత, కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు వనగతుడై, ఖడ్గపాణియై, దారులు కాసి బాటసారులను కొట్టి – వారి నుండి ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగసొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసికొనిపోయి, అమ్మి, ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు.

ఒకసారి దొంగతనానికై దారికాసి వున్న మంధరుడు బాటసారియైన ఒకానొక బ్రాహ్మణునిని పట్టుకొని – అక్కడి మర్రిచెట్టుకు కట్టివేసి, ఆ బాపని ద్రవ్యాన్నంతనూ అపహరించేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు – దోచుకొనిన మంధరుడినీ, దోచుకోబడి బంధితుడై వున్న బ్రాహ్మణునినీ ఇద్దరినీ కూడా చంపివేసి, ఆ ద్రవ్యాన్ని తాను హరించుకు పోబోయాడు. కాని, అదే సమయానికి అక్కడి కిరాత, మంధర, బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన చేరువగుహలోని ఖడ్గంతోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు. ఆ జగడంలో పులీ, కిరాతకుడూ కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధముగా మరణించిన విప్ర, మంధర, వ్యాఘ్ర, కిరాతకుల జీవులు నలుగురూ యమలోకమును చేరి, కాలసూత్రమనే నరకాన్ని పొందారు. యమకింకరులు ఆ నలుగురినీ – పురుగులూ, అమేథ్యమూతో నిండి వున్న తప్త రక్తకూపంలో పడవేశారు.

ఇక భూలోకములో, భర్త మరణవార్త తెలియని మంధరుని భార్యయైన సుశీల మాత్రము నిత్యం భర్తృ ధ్యానాన్నే చేస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యముతో జీవించసాగింది.

సుశీల పుణ్యఫలము

ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తనా తత్పరుడు, సర్వులయందునా భగవంతుని దర్శించువాడూ, నిత్యానంద నర్తనుడూ అయిన ఒకానొక యతీశ్వరుడు – ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి ‘అయ్యా! నా భర్త కార్యార్థియై వెళ్లి వున్నాడు. ఇంట లేడు. నేను ఏకాకినై ఆయన ధ్యానములోనే కాలమును గడుపుతున్నాను’ అని విన్నవించుకుంది.

అందులకా యతి ‘అమ్మాయీ! ఆవేదనపడకు. ఇది కార్తీక పూర్ణిమా మహాపర్వదినము. ఈ రోజు సాయంకాలము నీ ఇంట పురాణ పఠనాశ్రవణాదులు ఏర్పాటు చేయి. అందుకుగాను ఒక దీపము చాలా అవసరము. దీపానికి తగినంత నూనె నా దగ్గర వుంది. నీవు వత్తిని – ప్రమిదను సమర్పించినట్లయితే – దీపమును వెలిగించవచ్చును’ అని సలహా ఇచ్చాడు.

ఆ యతిశ్రేష్ఠుని మాటలనంగీకరించి సుశీల తక్షణమే గోమయముతో ఇల్లంతా చక్కగా అలిగి పంచరంగుల ముగ్గులను పెట్టినది. ప్రత్తిని పరిశుభ్రపరిచి, రెండు వత్తులను చేసి, యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది. యతి, ఆ దీప సహితముగా – విష్ణువును పూజించి, మనశ్శుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్లి, వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించినది. అందరి నడుమా తాను కూడా ఏకాగ్రచిత్తయై ఆ పురాణాన్ని వింది. అనంతరము ఆమెకు శుభాశీస్సులు అందించి యతీశ్వరుడు వెళ్లిపోయాడు.

నిరంతర హరి సేవనము వలన క్రమక్రమముగా ఆమె జ్ఞానియై, తదుపరిని కాలధర్మమును చెందినది. తత్క్షణమే శంఖ చక్రాంకితులు, చతుర్భాహువులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు – నందనవన, సుందర మందారాది సుమాలతోనూ, రత్నమౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించిన మాలికాంబరాభరణాలంకృతమై వున్న దివ్య విమానాన్ని తెచ్చి – సుశీలను అందు అధిరోహింప చేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు.

నరకంలో నలుగురు

అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యములోని నరకములో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూనన తన భర్తను గుర్తించి, విమానాన్ని ఆపించి – తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషదులను కోరింది. అందుకు వారు ‘అమ్మా! నీ భర్తయైన ఆ మంధరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలియై, మరి కొన్నాళ్ళు దొంగయై, దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు.

అతనితో బాటే వున్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మిత్రుడొకనిని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకుగాను అతడు నరకము పొందాడు. మూడవవాడు కిరాతకుడు. బంధితుడైన ఆ బ్రాహ్మణునినీ, నీ భర్తను కూడా చంపివేసిన పాపానికిగాను ఇతడు నరకమును చేరవలసి వచ్చినది. ఇక నాలుగవ జీవి ఒక పులి. ఆ పులి అతః పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై వుండి – ద్వాదశినాడు భక్షాభక్ష్య విచక్షణా రహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకమును పొంది – పులిగా పుట్టి ఈ కిరాతకుని తోడి జగడములో అతనితో బాటే నరకాన్ని చేరాడు. ఈ నలుగురి నరకయాతనలకూ కారణాలివే తల్లీ!’ అని చెప్పారు.

ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి – ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్లకా నరకము తప్పుతుందో చెప్పుడని కోరగా, వైష్ణవులు:

  • కార్తీకమాసములో నీచేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితానని ధారబోయడము వలన నీ భర్తా (మంధరుడు).
  • పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికీ వెళ్లి ప్రజలను పిలిచిన పుణ్యమును ధారబోయడము వలన మిత్ర ద్రోహియైన ఆ బ్రాహ్మణుడు.
  • పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యమును చెరిసగముగా ధారపోయడము వలన కిరాత వ్యాఘ్రాలూ నరకము నుంచి ముక్తిని పొందుతారు అని పలికారు.

అలా వాళ్లు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారబోయడముతో ఆ నలుగురూ నరకము నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా! కార్తీకమాసములో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో.

పన్నెండవ అధ్యాయము – కార్తీక మాసపు విశేష తిథులు

పునః వశిష్ఠుడు జనకునికిలా చెప్పసాగాడు: ‘ఓ రాజా! కార్తీకమాసములో వచ్చే సోమవార మహాత్మ్యమును విని వున్నావు. ఆ కార్తీక సోమవారము ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే:

  • కార్తీక శని త్రయోదశి – వందరెట్లు
  • కార్తీకపూర్ణిమ – వెయ్యిరెట్లు
  • శుక్ల పాడ్యమి – లక్షరెట్లు
  • శుక్ల ఏకాదశి – కోటిరెట్లు
  • ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలనూ అదనముగా ప్రసాదిస్తాయి.

మోహము, చేతనైనాసరే శుక్ల ఏకాదశినాడు ఉపవసించి, మరునాడు (ద్వాదశి) బ్రాహ్మణయుక్తులై పారాయణ చేసే వాళ్లు సాయుజ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ద ద్వాదశినాడు అన్నదానమును చేసిన వారికి సమస్త సంపదలూ అభివృద్ధి చెందుతాయి. రాజా! సూర్యగ్రహణ సమయములో గంగా తీరములో కోటి మంది బ్రాహ్మణులకు అన్నసమారాధన చేయడము వలన ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యమూ కూడా కేవలం కార్తీక ద్వాదశినాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నమును పెట్టడము వలన కలుగుతుంది. వేయి గ్రహణపర్వాలు, పదివేల వ్యతీపాత యోగాలూ, లక్ష అమావాస్యాపర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో పదహారవవంతు కూడా చేయమని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులెన్నయినా వుండవచ్చును గాక, కాని – వాటన్నింటికంటే కూడా సాక్షాద్విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు.

ద్వాదశి దానములు

ఏకాదశినాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశినాడు క్షీర సముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధినీ ద్వాదశి అనే పేరు వచ్చింది. అటు వంటి ఈ హరిబోధినినాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానమును చేస్తారో, వాళ్లు ఇహములో భోగాను సేవనాన్నీ, పరములో భోగిశయనామ సేవనాన్నీ పొందుతారు. కార్తీక ద్వాదశినాడు పెరుగు-అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ వుంది. ఎవరైతే ఈ ద్వాదశినాడు పాలిచ్చే ఆవును, వెండి డెక్కలూ, బంగారు కొమ్మలతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్లు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే వుంటాయో, అన్నివేల సంవత్సరాలు స్వర్గములో నివసిస్తారు. ఈ రోజు వస్త్రదానము చేసిన వాళ్లు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారానడంలో ఎటు వంటి వివాహము లేదు. ఓ మహారాజా! ఎవరైతే కార్తీక శుద్ద ద్వాదశినాడు సాలగ్రామాన్నీ, బంగారపు తులసీ వృక్షాన్నీ – దక్షిణా సమేతముగా దానము చేస్తారో వాళ్లు – చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్నీ దానము చేసినంత పుణ్యాన్ని పొందుతూన్నారు. ఇందుకు నిదర్శనముగా ఒక గాథను చెబుతాను విను.

ధర్మవీరోపాఖ్యానము

పూర్వము గోదావరీ తీరములో దురాచారవంతుడూ, పరమ పిసినిగొట్టూ అయిన ఒక వైశ్యుడు వుండేవాడు. ఈ లుబ్ధుడు దానధర్మాలు చేయకపోవడమే కాక, తాను కూడా తినకుండా ధనమును పోగు చేసేవాడు. ధనధాన్యాలనే కాదు. కనీసము ఎవరికీ మాట సాయమైనా చేసే వాడు కాదు. నిత్యమూ పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకూ ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు.

ఒకానొకసారి ఈ లుబ్ధుడొక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్లి – తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు. అందుకు, బ్రాహ్మణుడు ‘ఋణదాతా! నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను ఎందుకంటావేమో

శ్లో || యో జీవతి ఋణీనిత్యం నియమం కల్పమశ్నుతే
పశ్చాత్తస్యసుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి ||

ఎవడయితే ఋణం తీర్చకుండానే పోతాడో, వాడు మరుసటి జన్మలో ఋణదాతకు సంతురూపముగా జన్మించి ఆ ఋణాన్ని చెల్లుబెట్టుకోవలసి వస్తుంది. అందు చేత ఏదో విధముగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ ఋణము చెల్లుబెడతాను. అంతవరకూ ఓర్పు వహించి వుండు’ అని చెప్పాడు.

ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్ధుడు కనిసి, ‘నీ కబుర్లు నా దగ్గర కాదు. నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్లాగే సమయం నాకు లేదు. మర్యాదగా ఇప్పుడే ఇయ్యి లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను’ అననాడు. యధార్థంగా ఆ సమయంలో ధనము లేదనీ, అప్పటికప్పుడు తానా అప్పు తీర్చలేననీ చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి – బ్రాహ్మణుడిని జుట్టు పట్టుకుని లాగి, నేలకు పడదోసి, కాలితో తన్ని, అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వేటు పెట్టాడు. సింహము యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా, క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తిదెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి-హత్యానేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి – గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంత కాలం గుట్టుగా ఉండగలమే గాని గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం గదా! అదే విధముగా ఆ కోమటి కూడా ఆయువు దీరి మృతి చెందాడు. యమకింకరులు వచ్చి, ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు.

జనకభూపతీ! ‘రురువు’లనే మృగాల చేతా, వాటి శృంగాల చేతా పీడింప చేసే ఒకానొక యాతననే ‘రౌరవం’ అంటారు. ఈ కోమటిని ఆ రౌరవమనే నరక విభాగములో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు.

ఇక ఈ భూలోకములో ఆ లుబ్ధ వైశ్యుని కుమారుడైన ‘ధర్మవీరు’డనే వాడు – మహాదాతా, పరోపకారియై – పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజా శ్రేయస్సుకై చెరువులు, నూతులు త్రవ్వించి తోటలు వేయించి – వంతెనలు కట్టించి – పేదలకు వివాహోపనయనాదులు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులనూ – క్షుత్పీడితులకు తరతమ భేద రహితముగా అన్నదానాలను చేస్తూ – ధర్మాత్ముడుగా పేరు పొందాడు.

సాలగ్రామ దానం మహిమ

ఒకానొక నాడీ ధర్మవీరుడు విష్ణుపూజ చేసే సమయానికి త్రిలోక సంచారియైన – నారద మహర్షి యమ లోకము నుండి బయలుదేరి హరినామ స్మరణను చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు. ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుని చూచి ధర్మవీరుడు భక్తిప్రపత్తులతో ప్రణమిల్లాడు. అర్ఘ్యపాద్యాది వివిధోపచారాలతోనూ నారదుని పూజించి ‘నారదా! దేవర్షులైన మీరిలా మా భూవర్షానికి అందునా నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మధన్యమైంది. హే దివ్య ప్రభూ! నేను నీ దాసుడిని. నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు. నువ్వేమి చెబితే అది చేస్తాను’ అని వినయపూర్వకముగా వేడుకున్నాడు.

అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖము కలవాడై ‘ధర్మవీరా! నా కోసము నువ్వేమీ చేయనక్కరలేదు. నీ శ్రేయస్సుకై చెబుతున్న నా ఈ మాటల్ని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున చేసిన స్నానదాన జప తపః ప్రభృతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్నిస్తాయి. ధర్మవీరా! సూర్యుడు తులారాశిలో వుండగా కార్తీక ద్వాదశీ ప్రాతఃస్నాతులై – సాలగ్రామ దానమును చేసే వారు – దరిద్రులు గానీ, ధనికులు గానీ, యతులు గానీ, వానప్రస్థులు గానీ, బ్రాహ్మణులు గానీ, క్షత్రియులు గానీ, వైశ్యులుగానీ, శూద్రులు – స్త్రీలేగానీ – వాళ్లెవళ్లయినా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను దహింప చేసుకున్న వాళ్లే అవుతారు. మరో ముఖ్య విషయమును చెబుతాను విను. నీ తండ్రి మరణించి, యమలోకములో పడరాని పాట్లు పడుతున్నాడు. అతనికి నరకబాధా విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశినాడు సాలగ్రామ దానమును చెయ్యి.

నారదడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. పైపెచ్చు ‘నారద మునీంద్రా! నా తండ్రి పేరున – గో, భూ, తిల, సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటివల్ల వెలువరించబడని నరకయాతన కేవలం సాలగ్రామమనే పేరు కలిగిన రాతిని దానము చేస్తే సాధ్యమవుతుందా? అయినా ఆ సాలగ్రామమనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికా పనికిరాదు, అలంకారానికా నవరత్నాలలోనిది కాదు. ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దానిని నీనెందుకు దానము చేయాలి. రాతి దాతకు కీర్తి వుండదు. ఆ దానమును పట్టిన వానికి సుఖమూ వుండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యనుగాక చెయ్యను. అన్నాడు.

నారదుడెంత అనునయముగా చెప్పినా కూడా, ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు. సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు. అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు.

మరి కొంత కాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులూ, సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించని పాపానికీ – సాలగ్రామ దానము చేయకపోవడము వలనా నరకగతుడై, అనంతరము:

  • మూడు మారులు పులిగాను
  • మూడుసార్లు కోతిగాను
  • అయిదుసార్లు ఆబోతుగాను
  • పది పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది.

పునః పదకొండవ జన్మలో కూడా ఒకానొక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పురాకర్మ వలన పెండ్లి కుమారుడు అనతికాలంలోనే మరణించడంతో – ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞాన దృష్టి చేత తన కూతురి పురాకర్మను గత పాపఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి – కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా, జన్మజన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫలావాప్తి వలన – మరణించిన పెండ్లికొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి, పుణ్యఫలానుభ వాప్తులయ్యారు.

తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి, పూర్వజన్మలో చేసిన మహత్త్వ పూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషము వలన జ్ఞానియై – ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యము వలన ‘రౌరవ’ గతుడైన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు.

కాబట్టి జనక మహారాజా! కార్తీక మాసములో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధ్రువపరుచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానమును చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తము. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు.

ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే ఏకాదశ, ద్వాదశాధ్యాయౌ (పదకొండు -పన్నెండు అధ్యాయములు) ఆరవరోజు పారాయణము సమాప్తము.

bakthivahini

Recent Posts

Bhagavad Gita 700 Slokas in Telugu – Discover the Wisdom of అధ్యాయం 7: జ్ఞాన విజ్ఞాన యోగం, శ్లోకం 13

Bhagavad Gita 700 Slokas in Telugu మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం తీసుకునే ప్రతి…

7 hours ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 22వ రోజు పారాయణ

Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 21వ రోజు పారాయణ

Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 20వ రోజు పారాయణ

Karthika Puranam Telugu తులసి మహాత్మ్యంపై పృధు చక్రవర్తి ప్రశ్న పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు: 'దేవర్షీ! తులసిని స్థాపించి,…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 19వ రోజు పారాయణ

Karthika Puranam Telugu నారదుడు చెబుతున్నాడు: ఓ పృథు భూపాలా! కార్తీక వ్రతం పాటించే పురుషుడు తప్పకుండా ఆచరించవలసిన నియమాలను…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 18వ రోజు పారాయణ

Karthika Puranam Telugu నారదుడు చెప్పినదంతా విన్న పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసపు గొప్పదనమును వివరించి, నన్ను ధన్యుని…

1 day ago