Karthika Puranam
జ్ఞానసిద్ధుని స్తోత్రం జ్ఞానసిద్ధుడు ఇలా అన్నాడు: “వేదవేత్తల చేత – వేదవేద్యునిగానూ, వేదాంత స్థితునిగానూ, రహస్యమైనవానిగానూ, అద్వితీయునిగానూ కీర్తింపబడే వాడా! సూర్యచంద్ర శివబ్రహ్మదుల చేతా – మహారాజాధి రాజుల చేతా స్తుతింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా! నీకు నమస్కారము.
పంచభూతాలూ, సృష్టి సంభూతాలైన సమస్త చరచరాలూ కూడా నీ విభూతులే అయి వున్నాయి. శివ సేవిత చరణా! నువ్వు పరమము కంటేను పరముడవు. నువ్వే సర్వాధికారివి. స్థావర జంగమరూపమైన సమస్త ప్రపంచమూ కూడా – దానికి కారణబీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది. సృష్ట్యాదినీ, మధ్యలోనూ, తదంతమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి వుంటావు.
భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూప చతుర్విథాన్న రూపుడవూ, యజ్ఞ స్వరూపుడవూ కూడా నీవే. అమృతమయమూ, పరమ సుఖప్రదమూ అయిన నీ సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రము చేతనే – ఈ సంసారము సమస్తమూ ‘వెన్నెట్లో సముద్రములా’ భాసిస్తోంది. హే ఆనందసాగారా! ఈశ్వరా! జ్ఞాన స్వరూపా! సమస్తానికీ ఆధారమూ, సకల పురాణసారమూ కూడా నీవే అయి వున్నావు. ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జనించి – తిరిగి నీ యందే లయిస్తూ వుంది. ప్రాణులందరి హృదయాలలోనూ వుండే వాడినీ, ఆత్మవాచ్యుడవూ, అఖిలవంద్యుడవు. మనోవాగ గోచరుడవూ అయిన నువ్వు – కేవలము మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు గదా తండ్రీ! ఓ కృష్ణా! ఈశ్వరా! నారాయణా! నీకు నమస్కారము.
జ్ఞానసిద్ధుని అభ్యర్థన నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుని చెయ్యి. దయామతివై నన్ను నిత్యమూ పరిపాలించు. జగదేక పూజ్యుడవైన నీకు మ్రొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు. నేతవు. కృపాసముద్రుడవూ – అయిన నీవు సంసార సాగరములో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు. హే శుద్ధచరితా! ముకుందా! త్రిలోకనాథా! త్రిలోక వాసీ! అనంతా! ఆదికారణా! పరమాత్మా! పరమహంసవతీ! పూర్ణాత్మా! గుణతీతా! గురూ! దయామయా విష్ణో! నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్ది వాసీ! స్వర్గాపవర్గ ప్రదా! అభేదా! తేజోమయా! సాధు హృత్పద్మ స్థితా! ఆత్మారామా! దేవదేవేశా! గోవిందా! నీకిదే నమస్కారము. సృష్టి స్థితి లయకరా! వైకుంఠవాసా!
బుద్ధిమంతులైన వారు ఏ నీ పాదాలయందలి భక్తియనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో, అటు వంటి తేజస్స్వరూపాలైన నీ పాదాలకివే నా ప్రణామాలు. వేదాల చేత గాని, శాస్త్రతర్క పురాణ నీతి కావ్యాదుల చేతగాని- మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాద సేవ, భక్తి అనే అంజనాలను ధరించ గలిగిన వాళ్లు మాత్రమే – నీ రూపాన్ని భావించగలిగి, ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్తకోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలూ నశించి పోతున్నాయి. ఓ కేశవా! నారాయణా! గోవిందా! విష్ణూ! మధుసూదనా! త్రివిక్రమా! వామనా! శ్రీధరా! హృషీకేశా! పద్మనాభా! దామోదరా! సంకర్షణా! వాసుదేవా! నీకు నమస్కారము. నన్ను రక్షించు.
విష్ణుమూర్తి వరం ఈ విధంగా తెరపిలేని పారవశ్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ని చిరునవ్వుతో చూస్తూ విష్ణుమూర్తి ‘జ్ఞానసిద్ధా! నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను. ఏమి వరం కావాలో కోరుకో” అన్నాడు. ‘హే జగన్నాథా! నీకు నాయందు అనుగ్రహమే వున్నట్లయితే, నాకు సాలోక్యాన్ని (వైకుంఠం) ప్రసాదించు’మని కోరాడు జ్ఞానసిద్ధుడు. ‘తథాస్తు’ అని దీవించి – తార్య వాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు:
చాతుర్మాస్య వ్రత సూత్రం జ్ఞానసిద్ధా! నీ కోరిక నెరవేరుతుంది. కాని, అత్యంత దురాత్ములతో నిండిపోతూన్న ఈ నరలోకములో – మహాపాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను. సత్పురుషా! నేను ప్రతీ ఆషాఢ శుద్ధ దశమినాడూ, లక్ష్మీసమేతుడనై పాలసముద్రములో పవళించి కార్తీకశుద్ధ ద్వాదశినాడు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ నాలుగు నెలలూ – ఎవరైతే సద్ర్వతాలను ఆచరిస్తారో, వారు విగతపాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విజ్ఞులూ, వైష్ణవులూ అయిన నీవూ, నీ సహవ్రతులూ కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణను చేయుడు. చాతుర్మాస్య ప్రతాచరణ శూన్యులైన వాళ్లు బ్రహ్మహత్యా పాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి.
నిజానికి నాకు నిద్ర-మెలకువ కల – అనే అవస్థాత్రయమేదీ లేదు. నేను వానికి అతీతుడను. అయినా నా భక్తులను పరీక్షించటానికి నేనలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తూంటానని గుర్తించు. చాతుర్మాస్యాన్నే కాకుండా – నీవు నా పై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందూ పఠించే వాళ్లు కూడా తరిస్తారు. వీటిని లోకంలో – ప్రచారం చేసి – లోకోపకారానికి నడుం కట్టు’ ఈ విధంగా చెప్పి, ఆదినారాయణుడు లక్ష్మీసమేతుడై – ఆషాడశుక్ల దశమినాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పముపై శయనించాడు.
అంగీరసుని వచనం అంగీరస ఉవాచ: ఓయీ! నీవడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇది. దురాత్ములైనా పాపులైనా సరే – హరిపరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్లు గో గోత్రహత్యా ఫలాన్నీ, కోటిజన్మలు సురాపానము చేసిన పాపాన్నీ పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్లు – వంద యజ్ఞాలు చేసిన ఫలాన్నీ, అంత్యంలో విష్ణులోకాన్నీ పొందుతారు.
కార్తీక మహాత్మ్యం – వశిష్ఠుడు చెప్పగా జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు: ఓ మిధిలారాజ్య ధౌరేయా! ఈ కార్తీక మహాత్మ్యమును గురించి అత్ర్యగస్త్యమునుల నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి.
ఒకనాడు అత్రిమహాముని, అగస్త్యుని చూసి ‘కుంభ సంభవా! లోకత్రయోపకారము కోసము కార్తీక మహాత్మ్య బోధకమైన ఒకానొక హరిగాధను వినిపిస్తాను – విను. వేదముతో సమానమైన శాస్త్రము గాని, ఆరోగ్యానికి యీడైన ఆనందముగాని, హరికి సాటియైన దైవముగాని, కార్తీకముతో సమానమైన నెలకాని లేవయ్యా!
కార్తీక స్నాన, దీపదానాలూ, విష్ణ్వర్చనల వలన సమస్త వాంఛలూ సమకూరుతాయి. ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణుభక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్ఠాన సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతముగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను.
త్రేతాయుగంలో, సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనే వాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిదుడు, ధర్మజ్ఞుడూ అయిన ఆ రాజు – అత్యధికమైన ఐశ్వర్యము కలగడంతో అహంకరించిన వాడై – బ్రాహ్మణ, ద్వేషి, దేవ బ్రాహ్మణ భూహర్త, సత్య శౌచ విహీనుడూ, దుష్టపరాక్రమయుక్తుడూ, దుర్మార్గవర్తనుడూ అయి ప్రవర్తింపసాగాడు.
తద్వారా అతని ధర్మబలము నశించడంతో, సామంతులైన కాంభోజ కురుజాదులు అనేక మంది ఏకమై – చతురంగబలాలతో వచ్చి – అయ్యోధ్యను చుట్టి ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదయుక్తుడై – శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నదీ, ప్రకాశించేదీ, జెండాతో అలంకరించబడినదీ, ధనుర్బాణాదిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనదీ, అనేక యుద్ధాలలో విజయం సాథించినది, చక్కటి గుర్రాలు పూన్చినదీ, తమ సూర్యవంశాన్వయమైనదీ అయిన రథాన్నధిరోహించి – రథ, గజ, తురగ పదాతులు – అనబడే నాలుగు రకాల బలముతో – నగరము నుండి వెలువడి – చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకు పడ్డాడు.
ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే ఏకోనవింశతి, వింశతి అధ్యాయౌ, (పందొమ్మిది – ఇరవై అధ్యాయములు) పదియవ (దశమ దిన) నాటి పారాయణము సమాప్తము
Bhagavad Gita Sloka in Telugu ఈ రోజుల్లో జీవితం ఒక పెద్ద యుద్ధంలా మారింది. ఉదయం లేస్తే చాలు...…
Bhagavad Gita Sloka in Telugu ఈ రోజుల్లో చాలామంది యువతను వేధిస్తున్న పెద్ద సమస్య ఒకటుంది - "గందరగోళం".…
Bhagavad Gita Sloka in Telugu మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన వెలుగు ఉంటుంది. ఆ వెలుగు కొన్నిసార్లు…
Bhagavad Gita Chapter 10 Verse 20 మీరెప్పుడైనా కస్తూరి జింక గురించి విన్నారా? ఆ జింక తన శరీరం…
Bhagavad Gita Chapter 10 Verse 19 మీకు తెలుసా? ఒక చిన్న కథ చెప్తాను. సర్కస్లో ఏనుగు పిల్లను…
Bhagavad Gita Chapter 10 Verse 18 ప్రతి మనిషిలోనూ ఒక అపారమైన శక్తి సముద్రం దాగి ఉంటుంది. కానీ…