Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 24వ రోజు పారాయణ

Karthika Puranam Telugu

ఇది యుద్ధరంగంలో జరిగిన అద్భుత ఘట్టం. అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుడిని సమ్మోహింపజేయాలని తలచి మాయాగౌరిని సృష్టించాడు.

మాయాగౌరిని చూసి చలించిన శివుడు

ఒక రథంపై కట్టివేయబడి, నిశుంభాది నిశాచరుల చేత వధింపబడుతున్న ఆ మాయా గౌరిని చూశాడు శివుడు. చూసీ చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్నీ, తన పరాక్రమాన్నీ, కర్తవ్యాన్నీ విస్మరించి ఉదాసీనుడై వుండిపోయాడు. అదే అదనుగా జలంధరుడు ఆ పుంఖశా కాలైన మూడు బాణాలను శివుని శిరస్సుపైనా, వక్షస్థలం పైనా, ఉదరమందునా ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు.

రౌద్రరూపం దాల్చిన పరమేశ్వరుడు

అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధించబడిన వాడై, కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రౌద్రరూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సైతం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు.

పారిపోతున్న వారిలో వున్న అగ్రనాయకులైన శుంభ, నిశుంభులను చూచిన రుద్రుడు – ‘పారిపోతున్న వారంతా పార్వతి చేతిలో మరణించెదరు గాక‘ అని శపించాడు.

జలంధరుడి సంహారం

అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా గొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది. దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు.

ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమ్యాకాశాలను దహింప చేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలంధరుడి తలనరికి నేల పై పడవేసింది. అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు, ఈశ్వరునిలో లీనమై పోయింది.

సంఘటనఫలితం
శివుడి ఉదాసీనతజలంధరుడి బాణ ప్రయోగం
బ్రహ్మ బోధశివుడు రౌద్రరూపం దాల్చడం
రుద్రుడి శాపంశుంభ-నిశుంభులు పార్వతి చేతిలో మరణించడం
సుదర్శన చక్ర ప్రయోగంజలంధరుడి సంహారం

విష్ణువును స్వస్థుని చేయమని అభ్యర్థన

బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతి రేకులూ, అవనత శిరస్కులూ అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు. స్తుతించారు. కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం ‘బృందామోహితుడై అడవులలోబడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయజయధ్వానాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు.

శ్లో!! య దుద్భవాస్సత్వ రజ స్తమో గుణాః
సృష్టి స్థితి ధ్వంస నిదాన కారిణః
య దిచ్ఛయా విశ్వమిదం భవా భ
తనోతి మూల ప్రకృతి నతాస్స్మృతామ్ ||
శ్లో/ యాహి త్రయోవింశతి భేద శాబ్దితా
య ద్రూపకర్మాటి జగు స్త్ర యోపివై
జగత్యశేషే సమధిష్ఠితా పరా
వేదాస్తు మూల ప్రకృతిం నతాస్స్మృతామ్ ||
శ్లో|I యద్భక్తియుక్తాః పురుషాస్తు నిత్యం
దారిద్ర్య భీ మోహ పరాభ వాదీన్
నప్రాప్నువంత్యేవహి భక్తవత్సలాం
సదైవ మూల ప్రకృతిం నతాస్స్మృతామ్ ||

సృష్టి, స్థితి, లయలకు కారణమైన సత్త్వ, రజస్, తమో గుణాలు మూడు దేని నుంచి పుట్టినవో, దేవి యొక్క ఇచ్ఛ వలన లోకంలో జనన-మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి (మహామాయ)కి నమస్కరిస్తున్నాయి.

ఏదైతే ఇరవై మూడు భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో, వేదములలో సైతము దేని యొక్క రూప కర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను.

దేనియందు భక్తుడైన వాడు దారిద్ర్య భయ, మోహ, పరాభవాలను పొందడో, ఏదయితే తన భక్తుల యందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను.

నారద ఉవాచ

స్తవమే త సంధ్యాం యః పఠే దేకాగ్రమానసః
దారిద్ర్యమోహ దుఃఖాని న కదాచిత్ స్పృశంతి తమ్ ||

నారదుడు చెబుతున్నాడు: దేవతలచే గావించబడిన ఈ మూలప్రకృతి (మహామాయా) స్తవాన్ని ఎవరైతే ఏకాగ్రచిత్తంతో త్రిసంధ్యలూ పఠిస్తారో వాళ్లు ఏనాడూ కూడా దారిద్యాన్ని గాని, భయాన్ని గాని, మోహాన్నిగాని, దుఃఖాన్నిగాని, అవమానాన్ని గాని పొందరు.

ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడచూపి – ‘ఓ దేవతలారా! త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులనూ ధరించి వున్నాను.

  • రజోగుణం వలన లక్ష్మిగాను,
  • తమోగుణం వలన సరస్వతిగానూ,
  • సత్త్వగుణం వలన పార్వతిగానూ – విలసిల్లుతున్నది నేనే. కావున, మీ వాంఛా పరిపూర్తి కై ఆ లక్ష్మీ-పార్వతీ-సరస్వతులను ఆశ్రయింపుడి‘ అని ఆదేశించి అంతర్థానమై పోయింది.

విష్ణువును మోహవిముక్తుడిని చేసిన వృక్షాలు

దేవతలు రమా, ఉమా, సరస్వతుల చెంతకు వెళ్లి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలలైన ఆ తల్లులు ముగ్గురూ వారికి కొన్ని బీజాలనిచ్చి‘విష్ణువు ఎక్కడయితే మోహావృతుడై వున్నాడో అక్కడీ బీజాల్ని చల్లండి’ అని చెప్పారు.

దేవతలా బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి వున్న బృందా చితా ప్రాంతమంతటా చిలకించారు.

పృధు మహారాజా! పూర్వోక్త విధంగా బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల – త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి.

శక్తిగుణంవృక్షం
సరస్వతితమోగుణంఉసిరిక (ధాత్రి)
లక్ష్మిరజోగుణంమాలతి
గౌరి (పార్వతి)సత్త్వగుణంతులసి

మాలతి దూరం… ఉసిరి, తులసి ప్రియం

అంతవరకూ బృందా మోహముతో మందుడై వున్న విష్ణువు తన చుట్టూ చెట్లయి మొలచిన లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ మహిమల వలన, కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు.

కాని, వాటిలో లక్ష్మీ దత్త బీజాలు ఈర్ష్యాగుణాన్వితాలయి వుండటం వలన ఆ బీజోత్సన్నమైన ‘మాలతి బర్బరీ’ నామధేయమై, విష్ణువునకు ఎడమయ్యింది. కేవల అనురాగపూరితాలైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియాంకరాలయ్యాయి.

తద్వారా విష్ణువు మోహ విముక్తుడై, ధాత్రీ, తులసీ సమేతుడయి సర్వ దేవతా నమస్కారాలనూ అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్లాడు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణుపూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు.

తులసీ మహిమ

  • ఎవరింటిలో తులసీవనం వుంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడకు రాలేరు.
  • సర్వపాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో, వారికి యమధర్మరాజును దర్శించే పని వుండదు (నరకానికి వెళ్లరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావం).
  • గంగాస్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం – ఈ మూడూ సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతోంది.
  • తులసిని ప్రతిష్ఠించినా, తడిపినా, తాకినా, పెంచినా, మానసిక, శారీరక పాపాలేగాక, మాటలవలని పాపాలూ కూడా మటుమాయమై పోతాయి.
  • తులసి గుత్తులతో శివ, కేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
  • పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ట్వాది దేవతలు తులసి దళాలలో నివసిస్తూంటారు.
  • ఎన్ని పాపాలు చేసినవాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో, అటువంటి వానిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుజ్యాన్ని పొందుతున్నాడనడం సత్యం.
  • తులసి చెట్ల యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు.
  • తులసీవనపు నీడలో పితృశ్రాద్ధ చేసినట్లయితే, అది పితరులకు అక్షయ పదాన్నిస్తుంది.

ధాత్రీ (ఉసిరి) మహిమ

  • ఉసిరిచెట్టు నీడను పిండప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు.
  • ఎవడైతే తన శిరస్సుపైనా, ముఖమందునా, దేహమందునా, చేతులందునా ఉసిరిపండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణుస్వరూపుడని తెలుసుకోవాలి.
  • ఎవడి శరీరంపై ఉసిరిక ఫలమూ, తులసీ, ద్వారకోద్భవమైన మృత్తికా వుంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో.
  • ఉసిరిపండ్లనీ, తులసీ దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నానఫలం లభిస్తుంది.
  • ఉసిరిపత్రితోగాని, ఫలాలతో గాని దేవతాపూజ చేసిన వాడికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది.
  • సూర్యుడు తులాగతుడైన కార్తీకమాసంలో చేయబడే యజ్ఞయాగాదులు, తీర్థ సేవనలు విశేష ఫలితాలనిస్తాయి. సమస్త దేవతలూ, మునులూ కూడా ఈ కార్తీకమాసంలో ఉసిరిక చెట్టుని ఆశ్రయించుకుని వుంటారు.
  • ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశినాడు తులసీ దళాలను, కార్తీకం ముప్పై రోజులలోనూ ఉసిరిక పత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు.
  • కార్తీకమాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో, వాడి యొక్క ఒక సంవత్సరపు దోషం తొలగిపోతుంది.
  • ఉసిరి నీడన విష్ణుపూజ చేసినట్లయితే – అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది.

శ్రీహరి లీలలనీ, మహిమలనీ చెప్పడానికి ఏ ఒక్కరికీ కూడా ఎలాగైతే సాధ్యం కాదో, అదే ప్రకారం ఈ తులసీ, ధాత్రీ వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకుగాని, సహస్రముఖుడయిన శేషునికి గాని సాధ్యం కాదు.

ధాత్రీ, తులసీ జననగాథ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్లు తమ పాపాలను పోగొట్టుకున్నవారై తమ పూర్వులను కూడి శ్రేష్ఠమైన విమానంలో స్వర్గానని పొందుతున్నారు.

ఇరువది నాలుగవ (బహుళ నవమి) నాటి పారాయణం సమాప్తం

bakthivahini

Recent Posts

Bhagavad Gita Chapter 10 Verse 8 | భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 8 ప్రతిరోజూ ఉదయం లేచి, మనం ఎన్నో కలలతో, ఆశలతో రోజును ప్రారంభిస్తాం.…

3 hours ago

Bhagavad Gita Chapter 10 Verse 7 | భగవద్గీత 10వ అధ్యాయం 7వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 7 ఈ రోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే ఒక రకమైన అలసటతో…

1 day ago

Bhagavad Gita Chapter 10 Verse 6 | భగవద్గీత 10వ అధ్యాయం 6వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 6 ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య – "అసలు నేనెవరిని?…

2 days ago

Bhagavad Gita Chapter 10 Verse 4 & 5 | భగవద్గీత 10వ అధ్యాయం 4 & 5వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 4 & 5 ఈ రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న ఒకే…

2 weeks ago

Bhagavad Gita Chapter 10 Verse 3 | భగవద్గీత 10వ అధ్యాయం 3వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 3 మనలో చాలామంది రాత్రి పడుకునే ముందు ఒకే ఆలోచనతో సతమతమవుతుంటారు. "ఈరోజు…

2 weeks ago

Bhagavad Gita Chapter 10 Verse 2 | భగవద్గీత 10వ అధ్యాయం 2వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 2 మనలో చాలా మంది జీవితం... బయట ప్రపంచంతో యుద్ధం చేయడం కంటే,…

2 weeks ago